Maruti Suzuki price hike : బాదుడే బాదుడు- ఈ ఏడాదిలో మూడోసారి పెరగనున్న మారుతీ సుజుకీ వాహనాల ధరలు!-maruti suzuki cars to be costlier from april will see third consecutive price hike this year ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Maruti Suzuki Price Hike : బాదుడే బాదుడు- ఈ ఏడాదిలో మూడోసారి పెరగనున్న మారుతీ సుజుకీ వాహనాల ధరలు!

Maruti Suzuki price hike : బాదుడే బాదుడు- ఈ ఏడాదిలో మూడోసారి పెరగనున్న మారుతీ సుజుకీ వాహనాల ధరలు!

Sharath Chitturi HT Telugu

Maruti Suzuki news : 2025 ఏప్రిల్​లో మారుతీ సుజుకీ వాహనాల ధరలు పెరగనున్నాయి. ఈ సంస్థ వాహనాలపై ప్రైజ్​ హైక్​ తీసుకోవడం ఈ ఏడాదిలో ఇది మూడోసారి! తాజా ధరల పెంపు ఎంత ఉంటుందో ఇంకా చెప్పలేదు. తాజా పెంపునకు.. ఎప్పుడు చెప్పే కారణాలే చెప్పింది మారుతీ సుజుకీ. పూర్తి వివరాల్లోకి వెళితే..

ఏప్రిల్​లో మారుతీ సుజుకీ వాహనాల ధరలు పెరుగుతున్నాయి!

వినియోగదారులకు మళ్లీ షాక్​ ఇచ్చింది దేశీయ దిగ్గజ ఆటోమొబైల్​ సంస్థ మారుతీ సుజుకీ. తమ పోర్ట్​ఫోలియోలోని వాహనాల ధరలను పెంచనున్నట్టు ప్రకటించింది. 2025 ఏప్రిల్​ నుంచి తాజా రేట్లు అమల్లోకి వస్తాయని రెగ్యులేటరీ ఫైలింగ్​ ద్వారా వెల్లడించింది. మారుతీ సుజుకీ ఈ ఏడాదిలో తన వాహనాల ధరలను పెంచడం ఇది మూడోసారి!

2025 జనవరిలో, మారుతీ సుజుకీ కార్ల ధరలు నాలుగు శాతం పెరిగాయి. ఫిబ్రవరిలో మళ్లీ వాహన తయారీదారు తన కార్లపై ధరలను పెంచింది. అప్పుడు మారుతీ సుజుకీ కార్ల ధరలు ఒక శాతం నుంచి నాలుగు శాతం వరకు పెరిగాయి.

ఇక 2025 ఏప్రిల్ నుంచి అమల్లోకి రానున్న తాజా ధరల పెంపునకు ఇన్​పుట్​ ఖర్చులు, నిర్వహణ ఖర్చులు పెరగడమే కారణమని ఆటో కంపెనీ పేర్కొంది. ఏ మోడల్ ఎంత ధర పెరుగుతుందో మారుతీ సుజుకీ ఇంకా వెల్లడించలేదు. త్వరలోనే దీనిపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

మారుతీ సుజుకీ- మూడోసారి!

ముడి పదార్థాల అధిక ధరల కారణంగా పెరుగుతున్న ఇన్​పుట్ ఖర్చులను ఉదహరిస్తూ మారుతీ సుజుకీ ఈ ఏడాది జనవరిలో తన ప్యాసింజర్ వాహనాల ధరలను నాలుగు శాతం పెంచింది. గత ఏడాది డిసెంబరులో ధరల పెంపును ఓఈఎం ప్రకటించగా, సవరించిన ధర ఈ ఏడాది జనవరిలో అమల్లోకి వచ్చింది. ఆ తరువాత, మారుతీ సుజుకీ ఫిబ్రవరిలో అనేక మోడళ్ల ధరలను మళ్లీ పెంచింది. వివిధ మోడళ్లను బట్టి రూ .1,500 నుంచి రూ .32,500 వరకు ధరలు పెరిగాయి. అంతర్జాతీయ కమోడిటీ ధరలు పెరగడం, ముడి పదార్థాలపై అధిక దిగుమతి సుంకాలు, సరఫరా గొలుసు అంతరాయాలు వంటి కారణాలు చెప్పి ఈసారి కూడా ధరలను పెంచుతోంది దేశీయ దిగ్గజ ఆటోమొబైల్​ సంస్థ.

ధరల పెంపును ప్రకటిస్తూ మారుతీ సుజుకీ తన తాజా రెగ్యులేటరీ ఫైలింగ్​లో.. “ఖర్చులను ఆప్టిమైజ్ చేయడానికి, వినియోగదారులపై ప్రభావాన్ని తగ్గించడానికి కంపెనీ నిరంతరం కృషి చేస్తుంది,” అని పేర్కొంది. పెరిగిన ఖర్చులో కొంత భాగాన్ని మార్కెట్​కు బదిలీ చేయాల్సి ఉంటుందని పేర్కొంది.

మారుతీ సుజుకీ పోర్ట్​ఫోలియోలో ప్రస్తుతం ఆల్టో కే10, ఎస్-ప్రెస్సో, ఈకో, సెలెరియో, వాగన్​ఆర్, ఇగ్నిస్, స్విఫ్ట్, బాలెనో, డిజైర్, ఫ్రాంక్స్, బ్రెజ్జా, ఎర్టిగా, సియాజ్, గ్రాండ్ విటారా, ఎక్స్ఎల్6, జిమ్నీ, ఇన్విక్టో వంటి మోడళ్లు ఉన్నాయి. రాబోయే ధరల పెంపు చర్యలో ఈ మోడళ్లన్నీ ధరల పెరుగుదలను చూస్తాయి.

మారుతీ సుజుకీ మాత్రమే కాదు ఈ ఏడాది నుంచి ఇప్పటివరకు దాదాపు అన్ని ఆటోమైబైల్​ సంస్థలు తమ పోర్ట్​ఫోలియోలోని ప్రాడక్ట్స్​పై ధరలను భారీగానే పెంచుతూ వచ్చాయి. మారుతీ సుజుకీ మూడోసారి ధరలు పెంచడంతో, ఇతర సంస్థలు సైతం ప్రైజ్​ హైక్​ నిర్ణయం తీసుకుంటాయా? లేదా? అన్నది చూడాలి.

ఇంకో విషయం! హెచ్​టీ తెలుగు ఇప్పుడు వాట్సాప్​ ఛానెల్​లో అందుబాటులో ఉంది. ఆటోమొబైల్​ ప్రపంచం నుంచి లేటెస్ట్​ అప్డేట్స్​ కోసం హెచ్​టీ తెలుగు వాట్సాప్​ ఛానెల్​ని ఫాలో అవ్వండి.

Sharath Chitturi

TwittereMail
శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్ వార్తలు​, ఆస్ట్రాలజీ- లైఫ్​స్టైల్​ గ్యాలరీ రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది.

సంబంధిత కథనం