M&M pv sales up: మహీంద్రా ప్యాసింజర్ వెహికిల్స్ అమ్మకాల్లో 60 శాతం పెరుగుదల
M&M pv sales up: మహీంద్రా అండ్ మహీంద్రా ప్యాసింజర్ వాహనాలు అక్టోబరు నెలలో 60 శాతం పెరిగాయి.
న్యూఢిల్లీ, నవంబర్ 1: మహీంద్రా అండ్ మహీంద్రా లిమిటెడ్ దేశీయ ప్యాసింజర్ వాహనాల అమ్మకాలు 2022 అక్టోబర్లో 60 శాతం పెరిగి 32,298 యూనిట్లకు చేరుకున్నాయి. గత ఏడాది ఇదే నెలలో కంపెనీ 20,130 యూనిట్లను విక్రయించినట్లు మహీంద్రా అండ్ మహీంద్రా (ఎం&ఎం) ఒక ప్రకటనలో తెలిపింది.
యుటిలిటీ వాహనాల విక్రయాలు 32,226 యూనిట్లుగా ఉన్నాయని, క్రితం ఏడాది 20,034 యూనిట్ల నుంచి 61 శాతం వృద్ధి నమోదైందని పేర్కొంది.
‘పండుగ డిమాండ్ కారణంగా అక్టోబర్లో మా అమ్మకాల పరిమాణం పెరుగుతూ వచ్చింది..’ అని ఎం అండ్ ఎం ఆటోమోటివ్ డివిజన్ ప్రెసిడెంట్ వీజయ్ నక్రా చెప్పారు.
వాణిజ్య వాహనాల విభాగంలో 2022 అక్టోబర్లో 20,980 యూనిట్లను విక్రయించినట్లు ఎంఅండ్ఎం తెలిపింది. అక్టోబర్ 2021లో 47,017 యూనిట్లతో పోలిస్తే మొత్తం ట్రాక్టర్ విక్రయాలు గత నెలలో 11 శాతం పెరిగి 51,994 యూనిట్లకు చేరుకున్నాయి. దేశీయ ట్రాక్టర్ల విక్రయాలు గత ఏడాది ఇదే నెలలో 45,420 యూనిట్ల నుంచి ఈ అక్టోబరులో 50,539 యూనిట్లకు పెరిగాయి.
‘పండుగ సీజన్లో ఉత్సాహం పెరిగింది. ట్రాక్టర్లు, వ్యవసాయ యంత్రాలకు డిమాండ్ బాగా పెరిగింది’ అని ఎం అండ్ ఎం ఫార్మ్ ఎక్విప్మెంట్ సెక్టార్ ప్రెసిడెంట్ హేమంత్ సిక్కా చెప్పారు.
ప్రభుత్వం ఇటీవల కీలకమైన రబీ పంటలకు ఎమ్ఎస్పీ ధరలు పెంచడం, రిజర్వాయర్లలో గరిష్ట నీటిమట్టాలు రాబోయే నెలల్లో ట్రాక్టర్లకు మంచి డిమాండ్ కొనసాగడానికి సానుకూలంగా ఉన్నాయని ఆయన అన్నారు.