జులై 1 నుంచి మీ జేబులపై ప్రభావం చూపించే కీలక మార్పులు.. ఓసారి చూడండి!-lpg to pan card aadhaar link update key changes from july 1st 2025 check out details ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  జులై 1 నుంచి మీ జేబులపై ప్రభావం చూపించే కీలక మార్పులు.. ఓసారి చూడండి!

జులై 1 నుంచి మీ జేబులపై ప్రభావం చూపించే కీలక మార్పులు.. ఓసారి చూడండి!

Anand Sai HT Telugu

జులై 1, 2025 నుండి దేశంలో అనేక పెద్ద మార్పులు అమల్లోకి వస్తాయి. ఇవి ప్రతి ఇంటిని, జేబును ప్రభావితం చేస్తాయి. ఎల్పీజీ సిలిండర్ ధర, క్రెడిట్ కార్డ్ ఛార్జీలు, ఏటీఎం ఛార్జీలు, రైల్వే నియమాలు వంటి మార్పులు ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతాయి.

జులై 1 నుంచి కీలక మార్పులు

జులై 1, 2025న కొత్త నెల ప్రారంభం కావడంతో దేశవ్యాప్తంగా అనేక పెద్ద మార్పులు అమలు అవుతాయి. ఇవి మీ జేబును ప్రత్యక్షంగా ప్రభావితం చేస్తాయి. వంటగది బడ్జెట్ నుండి రైలు ప్రయాణం వరకు ప్రభావితం చేస్తాయి. ఈ మార్పులలో ఎల్పీజీ సిలిండర్ ధరల నుండి క్రెడిట్ కార్డ్ నియమాల వరకు ఉన్నాయి.

ఎల్‌పీజీ సిలిండర్ల ధరలు

ప్రతి నెల లాగే ఈసారి కూడా జూలై 1న చమురు కంపెనీలు ఎల్‌పీజీ సిలిండర్ల ధరలను మార్చవచ్చు. జూన్‌లో 19 కిలోల వాణిజ్య సిలిండర్ ధరను రూ.24 తగ్గించారు. కానీ 14 కిలోల దేశీయ సిలిండర్ ధరలు చాలా కాలంగా స్థిరంగా ఉన్నాయి. ఇప్పుడు అందరి దృష్టి వంటగది బడ్జెట్ పెరుగుతుందా లేదా ఉపశమనం లభిస్తుందా అనే దానిపై ఉంది.

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్

మీరు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ క్రెడిట్ కార్డును ఉపయోగిస్తుంటే జూలై 1 నుండి మీరు యుటిలిటీ బిల్లు చెల్లింపుపై అదనపు ఛార్జీలు చెల్లించాల్సి రావచ్చు. దీనితో పాటు పేటీఎం, Mobikwik, ఫ్రీఛార్జ్ లేదా ఓలా మనీ వంటి డిజిటల్ వాలెట్లలో నెలలో రూ. 10,000 కంటే ఎక్కువ లోడ్ చేస్తే 1 శాతం ఛార్జ్ విధిస్తారు.

ఐసీఐసీఐ

ఐసీఐసీఐ బ్యాంక్ కస్టమర్లకు కూడా ఒక వార్త ఉంది. జూలై 1 నుండి మెట్రో నగరాల్లోని ఏటీఎంల నుండి 5 ఉచిత లావాదేవీల తర్వాత ప్రతి ఉపసంహరణపై రూ. 23 రుసుము వసూలు చేస్తారు. మెట్రోయేతర నగరాల్లో ఈ పరిమితి మూడు లావాదేవీలు.

రైల్వే ఛార్జీలు

జూలై 1 నుండి భారత రైల్వే కూడా నిబంధనలను మారుస్తోంది. నాన్-ఏసీ మెయిల్, ఎక్స్‌ప్రెస్ రైళ్ల ఛార్జీలు కిలోమీటరుకు 1 పైసా, ఏసీ క్లాస్‌లో కిలోమీటరుకు 2 పైసా పెరుగుతాయి. ఇక మరో మార్పు ఏంటి అంటటే.. తత్కాల్ టికెట్ బుకింగ్ చేసుకునేందుకు ఆధార్-ధృవీకరణ కూడా కావాలి.

డ్రైవర్లకు పెద్ద షాక్

ఢిల్లీలోని డ్రైవర్లకు పెద్ద షాక్ తగలబోతోంది. జూలై 1 నుండి, 10 ఏళ్లు నిండిన డీజిల్, 15 ఏళ్లు నిండిన పెట్రోల్ వాహనాలకు పెట్రోల్ పంపులలో ఇంధనం లభించదు. ఎయిర్ క్వాలిటీ మేనేజ్‌మెంట్ కమిషన్(CAQM) ఈ నియమం ఉద్దేశ్యం వాయు కాలుష్యాన్ని తగ్గించడం.

పాన్, ఆధార్

మరోవైపు జులై 1 తర్వాత కొత్త పాన్ కార్డులు తీసుకునేవారికి కచ్చితంగా ఆధార్ కార్డు అవసరం. ఆధార్ కార్డు లింక్ తప్పనిసరి. ఇప్పటి వరకు పాన్ కార్డును ఆధార్‌తో లింక్ చేయనివారు డిసెంబర్ 31 వరకు లింక్ చేయాలి.

ఆనంద్ సాయి హెచ్.టి తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్. నేషనల్, బిజినెస్ వార్తలు రాస్తారు. గతంలో ఎంటర్‌టైన్మెంట్, లైఫ్‌స్టైల్ రాసేవారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభం ఉంది. కాకతీయ యూనివర్సిటీలో మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం పీజీ చేశారు. గతంలో నవతెలంగాణ, ఈనాడు, ఈటీవీ భారత్, ఏబీపీ దేశంలో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. 2022లో హెచ్.టి తెలుగులో చేరారు.