దేశ ప్రజలకు గుడ్ న్యూస్! ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధరలను చమురు మార్కెటింగ్ సంస్థలు భారీగా తగ్గించాయి. 19 కేజీల కమర్షియల్ ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధరను రూ. 7 తగ్గించినట్టు, ఇది ఫిబ్రవరి 1 నుంచే అమల్లోకి తెస్తున్నట్టు ప్రకటించాయి.
తాజా తగ్గింపుతో దేశ రాజధాని దిల్లీలో 19 కేజీల ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధర రూ. 1797కు చేరింది.
ఈ కమర్షియల్ గ్యాస్ సిలిండర్లను రెస్టారెంట్తో పాటు వివిధ వాణిజ్య కార్యకలాపాల కోసం వినియోగిస్తుంటారు. వీటి ధరలు తగ్గితే, ఆయా చోట్ల ప్రజలకు సైతం కాస్త రిలీఫ్ వచ్చే అవకాశం ఉంటుంది.
అయితే ఇళ్లల్లో వంటలకు వినియోగించే 14 కేజీల గ్యాస్ సిలిండర్ ధరలు మాత్రం మారలేదు. 2024 అగస్ట్ 1 నుంచి డొమెస్టిక్ సిలిండర్ ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి.
గత కొంతకాలంగా 19 కేజీల కమర్షియల్ సిలిండర్ ధరలను పెంచుతూ వస్తున్న చమురు మార్కెటింగ్ సంస్థలు.. సరిగ్గా బడ్జెట్ 2025కి ముందు రేట్లను కట్ చేయడం విశేషం. పేదలు, మధ్యతరగతి వారిపై లక్ష్మీ దేవి కటాక్షం ఉండాలని ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో బడ్జెట్లో ప్రజలకు ఉపశమనం ఉంటుందని అంచనాలు మరింత పెరిగాయి. ఈ నేపథ్యంలో, ఇప్పుడు సిలిండర్ ధరలు సైతం దిగిరావడం మరింత సానుకూల విషయం.
ఇండియన్ ఆయిల్ విడుదల చేసిన తాజా రేటు ప్రకారం.. దిల్లీలో 19 కిలోల ఎల్పీజీ సిలిండర్ ధర రూ .1797 కు చేరింది. జనవరిలో ఇది రూ.1804గా ఉంది. కోల్కతాలో అదే కమర్షియల్ సిలిండర్ ఇప్పుడు రూ. 1911 కు బదులుగా రూ .1907కు లభిస్తుంది. ముంబైలో ఈ సిలిండర్ ధర ఇప్పుడు రూ .1749.50 గా ఉంది. ఇక్కడ ఈ వాణిజ్య ఎల్పీజీ సిలిండర్.. జనవరిలో రూ .1756 ధరకు అందుబాటులో ఉండేది.
ఇక హైదరాబాద్లో 19 కేజీల వాణిజ్య ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధర రూ. 2,023గా ఉంది. 14 కేజీల డొమెస్టిక్ సిలిండర్ ధర రూ. 855గా కొనసాగుతోంది.
విజయవాడలో 19 కేజీల కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర రూ. 1964గా ఉంది. 14 కేజీల సిలిండ్ రేటు రూ. 827.50గా కొనసాగుతోంది.
అంతర్జాతీయ పరిస్థితుల బట్టి ప్రతి నెల సిలిండర్ ధరలను ఓఎంసీలు సవరిస్తుంటాయి. ఒక్కోసారి ధరలను పెంచుతాయి, ఇంకోసారి తగ్గిస్తాయి. లేదా యాథతథంగా వదిలేస్తాయి.
సంబంధిత కథనం