కియా ఇండియా రికార్డు.. అనంతపురం ప్లాంట్‌లో 1.5 మిలియన్ కార్ల తయారీ!-kia india records 1 5 million make in india vehicles manufactured milestone at anantapur plant will launch new carens ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  కియా ఇండియా రికార్డు.. అనంతపురం ప్లాంట్‌లో 1.5 మిలియన్ కార్ల తయారీ!

కియా ఇండియా రికార్డు.. అనంతపురం ప్లాంట్‌లో 1.5 మిలియన్ కార్ల తయారీ!

Anand Sai HT Telugu

కియా ఇండియా చరిత్ర సృష్టించింది. 5 సంవత్సరాలలో అనంతపురం ప్లాంట్ నుండి 1.5 మిలియన్ కార్లను కంపెనీ ఉత్పత్తి చేసింది. ఇక్కడి మేకిన్ ఇండియా కార్లు విదేశీ మార్కెట్‌కు చేరుకుంటున్నాయి.

కియా ఇండియా రికార్డు

భారతీయ ఆటోమొబైల్ పరిశ్రమలో కొత్త చరిత్రను సృష్టించింది కియా ఇండియా. తన 1.5 మిలియన్ల మేక్ ఇన్ ఇండియా వాహనాలను అనంతపురంలోని తయారీ ప్లాంట్ నుండి ఉత్పత్తి చేసింది. ఈ విజయం కేవలం గణాంకాలు మాత్రమే కాదని, భారతీయ వినియోగదారులలో కియాకు పెరుగుతున్న ప్రజాదరణ, నమ్మకానికి నిదర్శనమని కంపెనీ పేర్కొంది.

కియా కారెన్స్

ఈ ప్రత్యేక సందర్భంలో కంపెనీ విలాసవంతమైన ఎమ్‌పీవీ కియా కారెన్స్ మీద కూడా అప్డేట్ వచ్చింది. మే 8వ తేదీన కియా ఇండియా కొత్త కారెన్స్ కారును అధికారికంగా ఆవిష్కరించనున్నట్లు ప్రకటించింది. కొత్త కారెన్స్ ప్రస్తుత మోడల్ కంటే సురక్షితమైనది, ఫీచర్-రిచ్‌గా ఉండబోతోంది.

కియా ఇండియా సీఈఓ గ్వాంగ్గు లీ మాట్లాడుతూ.. '1.5 మిలియన్ల మేకిన్ ఇండియా వాహనాలను ఉత్పత్తి చేయడం మాకు గర్వకారణం, భావోద్వేగ క్షణం. మొదటి సెల్టోస్ నుండి నేటి కారెన్స్ వరకు ప్రతి వాహనం మా వినియోగదారులు, భాగస్వాముల ప్రేమ, మద్దతుకు నిదర్శనం. మా సంకల్పం ఆవిష్కరణలను ప్రోత్సహించడం.' అని చెప్పారు.

కియా ఇండియా 2019 ఆగస్టులో సెల్టోస్‌ను లాంచ్ చేసింది. అప్పటి నుంచి ఆ సంస్థ వెనక్కి తిరిగి చూసుకోలేదు. నేడు, కియా తన పోర్ట్‌ఫోలియోలో అనేక విభిన్న సెగ్మెంట్ల వాహనాలను కలిగి ఉంది. సోనెట్, కారెన్స్, కార్నివాల్‌లాంటి కార్లు ఉన్నాయి.

కీలక గణాంకాలు

సెల్టోస్ : 7,00,668 యూనిట్లు (46.7 శాతం)

సోనెట్ : 5,19,064 యూనిట్లు (34.6శాతం)

కారెన్స్: 2,41,582 యూనిట్లు (16.1శాతం)

సైరోస్: 23,036 యూనిట్లు (1.5శాతం)

కార్నివాల్: 16,172 యూనిట్లు (1.1శాతం)

అనంతపురం నుంచి ఎగుమతులు

ఈ కార్లు భారతీయ వినియోగదారులలో అత్యధికంగా తీసుకున్నారు. ఆంధ్రప్రదేశ్ లోని అనంతపురంలో ఉన్న కియా ప్లాంట్ 536 ఎకరాల్లో విస్తరించి ఉంది. ఇది భారతదేశంలోని అత్యంత ఆధునిక ఆటోమొబైల్ ప్లాంట్లలో ఒకటి. దేశీయ మార్కెట్ కోసం కార్లను ఉత్పత్తి చేయడమే కాకుండా 90కి పైగా దేశాలకు ఎగుమతి చేస్తోంది. హై క్వాలిటీ ప్రొడక్షన్, అత్యాధునిక టెక్నాలజీ, కస్టమర్ సెంట్రిక్ ఇన్నోవేషన్ కియా ఇండియా విజయానికి మూలస్తంభాలు.

ఆనంద్ సాయి హెచ్.టి తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్. నేషనల్, బిజినెస్ వార్తలు రాస్తారు. గతంలో ఎంటర్‌టైన్మెంట్, లైఫ్‌స్టైల్ రాసేవారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభం ఉంది. కాకతీయ యూనివర్సిటీలో మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం పీజీ చేశారు. గతంలో నవతెలంగాణ, ఈనాడు, ఈటీవీ భారత్, ఏబీపీ దేశంలో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. 2022లో హెచ్.టి తెలుగులో చేరారు.