ఏప్రిల్ 1 నుండి కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభమైంది. పన్ను చెల్లింపుదారులు గత సంవత్సరానికి తమ ఆదాయపు పన్ను రిటర్న్లను(ఐటీఆర్) దాఖలు చేయడానికి సిద్ధమవుతున్నారు. 2024-25 ఆర్థిక సంవత్సరం లేదా 2025-26 అసెస్మెంట్ సంవత్సరానికి సమర్పించాల్సిన ఫారమ్లను ఐటీ శాఖ త్వరలో తెలియజేస్తుంది. గడువు సమీపిస్తున్న కొద్దీ పన్ను చెల్లింపుదారులు ఐటీఆర్ దాఖలు చేయడానికి అన్ని రకాల పత్రాలను సిద్ధంగా ఉంచుకోవాలి. ఫారమ్-16 అనేది జీతం పొందే ఉద్యోగులకు అత్యంత ముఖ్యమైన పత్రాలలో ఒకటి. ఈ ఫారమ్ మీరు పనిచేసే కంపెనీ యాజమాన్యం ద్వారా జారీ అవుతుంది. ఈసారి ఫారమ్-16 ఫార్మాట్ మారుతుంది.
ఫారమ్ 16 ఉద్యోగి జీతం, దాని నుంచి డిడక్ట్ చేసిన టీడీఎస్ వివరాలను కలిగి ఉంటుంది. ఫారమ్ 16, దానిలోని విషయాలు ఉద్యోగికి, కంపెనీ నిర్వహణకు చాలా ముఖ్యమైనవి. దీనితో ఐటీఆర్ ఫైలింగ్ ఎటువంటి లోపాలు లేకుండా చేయవచ్చు. ఈ ఫారమ్ను ఆదాయపు పన్ను శాఖకు సమర్పించాలి.
జీతం, వ్యాపారం నుండి ఆదాయం పొందే ఏ వ్యక్తి అయినా ఐటీఆర్ దాఖలు చేయడం చాలా ముఖ్యం. ఇందులో ఉద్యోగి మొత్తం ఆదాయం, పన్ను చెల్లింపుల వివరాలు ఉంటాయి. ఒక ఆర్థిక సంవత్సరంలోపు ఉద్యోగులు ఉద్యోగాలు మారినప్పుడు వారు రెండు కంపెనీల నుండి ఫారమ్ 16 పొందాలి. ఈ ఫారమ్లో పార్ట్ ఏ, పార్ట్ బీ అనే రెండు భాగాలు ఉన్నాయి.
అయితే ఫారమ్ 16లో ఆదాయపు పన్ను శాఖ ముఖ్యమైన మార్పులు చేయనుంది. పన్ను మినహాయింపుల స్వభావం, ఇతర అంశాలలో మార్పులు అవుతున్నాయి. కొత్త మార్పులు వివిధ పన్నులు, తగ్గింపులు, జీతాలపై మినహాయింపులు వంటి వివరాలను స్పష్టంగా వెల్లడిస్తాయి. ఫారమ్ 16 అప్డేట్ చేసిన వెర్షన్ పన్ను చెల్లింపుదారులు గతంలో కంటే సులభంగా మరింత సమాచారాన్ని పొందేందుకు అనుమతిస్తుంది.
గతంలో ఫారమ్ 16లో ప్రాథమిక సమాచారం మాత్రమే ఉండేది. అయితే కొత్త ఫార్మాట్లో సమగ్ర వివరాలు ఉంటాయి. దీని వలన పన్ను చెల్లింపుదారులు ఏ భత్యాలు పన్ను మినహాయింపు పొందారో, ఎంత తగ్గించుకున్నారో తెలుసుకోవచ్చు. ఇది ఏ పన్ను ప్రయోజనాలు పన్ను పరిధిలోకి వస్తాయో వివరిస్తుంది. ఐటీఆర్ ఫైలింగ్ సమయంలో సమస్యలను తొలగిస్తుంది.