ఈపీఎఫ్ఓలోని ఉద్యోగుల పెన్షన్ పథకం కింద కనీస పెన్షన్ మొత్తాన్ని పెంచే అవకాశం ఉందని వార్తలు వినిపిస్తున్నాయి. మే 2025లో దీనిపై ఒక ప్రకటన వెలువడే అవకాశం ఉందని తెలుస్తోంది. అయితే, ఈపీఎస్ కనీస పెన్షన్ పెంపు ఎంత ఉంటుందనే విషయంపై వేర్వేరు ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి. కనీస పెన్షన్ పెంపు రూ. 3,000 ఉండొచ్చని కొందరు, రూ. 7,500 లేదా రూ. 9,000 వరకు ఉంటుందని మరి కొందరు ఆశిస్తున్నారు.
అయితే, ఈ ఈపీఎస్ కనీస పెన్షన్ పెంపునకు సంబంధించిన వార్తలు ఊహాగానాలు, అంచనాలు మాత్రమేనని గుర్తించాలి. ఇప్పటివరకు భారత ప్రభుత్వం నుంచి కానీ, లేదా ఈపీఎఫ్ఓ నుంచి కానీ ఎటువంటి అధికారిక ప్రకటన రాలేదన్న విషయం గమనించాలి.
ఈపీఎస్ కింద ప్రస్తుత కనీస పెన్షన్ పెన్షనర్లకు నెలకు రూ.1,000 నుండి రూ.2,000 వరకు ఉంది. ఇది సెప్టెంబర్ 1, 2014నుంచి అమల్లో ఉంది. కాగా, ఈపీఎస్ పథకం దాదాపు మూడు దశాబ్దాలుగా అమలులో ఉంది. నవంబర్ 16, 1995న దీనిని ప్రారంభించారు. అన్ని వ్యవస్థీకృత రంగాలలోని ఉద్యోగుల కోసం ఈపీఎఫ్ఓ ద్వారా ఈపీఎస్ ను అమలు చేస్తారు. ఈపీఎస్ కింద, యజమాని ప్రతి నెలా ఉద్యోగి జీతంలో 8.33%ని ఈపీఎస్ ఖాతాకు జమ చేయాలి. అంతేకాకుండా, కేంద్ర ప్రభుత్వం కూడా ఈ నిధులకు 1.16% రేటును అందించాల్సిన బాధ్యత ఉంది. ఈపీఎస్ పథకానికి సవరణ జరిగి దాదాపు దశాబ్దం గడిచింది. కనీస పెన్షన్ సవరణ జరిగి దాదాపు దశాబ్దం గడిచినందున, ట్రేడ్ యూనియన్లు మరియు ఇతర సంఘాలు ఈపీఎస్ పెంపును డిమాండ్ చేస్తున్నాయి.
ఈపీఎస్ 95 పథకాన్ని థర్డ్ పార్టీ రివ్యూ ద్వారా సమీక్షించి అవసరమైన మార్పులు సూచించడానికి ఈపీఎఫ్ఓ ఒక పార్లమెంటరీ కమిటీని నియమించినట్లు సమాచారం. స్వతంత్ర నిపుణులను నియమించి, వారి అధ్యయనం, సిఫారసులను పొందడం ఈ థర్డ్ పార్టీ రివ్యూ ఉద్దేశం. ఈ కమిటీ బిజెపి ఎంపీ బసవరాజ్ బాంబే నేతృత్వంలో పని చేస్తోంది.
కనీస పెన్షన్ను రూ. 2 వేలకు పెంచాలని 2020 లోనే ప్రతిపాదనలు వచ్చాయి. అయితే, కొన్ని కారణాలు చూపుతూ ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆ ప్రతిపాదనలను తిరస్కరించింది. ప్రస్తుత ద్రవ్యోల్బణ పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని ఈపీఎస్ కనీస పెన్షన్ ను రూ. 9000 చేయాలన్న డిమాండ్ ప్రస్తుతం ఈపీఎస్ చందాదారుల నుంచి ఉంది. ప్రస్తుత పెరిగిన ఖర్చుల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకోవాలని పెన్షనర్లు డిమాండ్ చేస్తున్నారు.
సంబంధిత కథనం
టాపిక్