క్యూ4 ఫలితాలు ప్రకటించిన ఇన్ఫోసిస్; తగ్గిన లాభాలు; డివిడెండ్ ఎంతంటే?-infosys q4 result 5 key highlights of march quarter infosys earnings ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  క్యూ4 ఫలితాలు ప్రకటించిన ఇన్ఫోసిస్; తగ్గిన లాభాలు; డివిడెండ్ ఎంతంటే?

క్యూ4 ఫలితాలు ప్రకటించిన ఇన్ఫోసిస్; తగ్గిన లాభాలు; డివిడెండ్ ఎంతంటే?

Sudarshan V HT Telugu

గత ఆర్థిక సంవత్సరం క్యూ4 ఫలితాలను ఇన్ఫోసిస్ గురువారం ప్రకటించింది. క్యూ4 ఎఫ్వై 25లో ఇన్ఫోసిస్ నికర లాభం రూ.7,969 కోట్ల నుంచి 11.75 శాతం క్షీణించి రూ.7,033 కోట్లకు పరిమితమైంది. కార్యకలాపాల ద్వారా వచ్చే ఆదాయం రూ.37,923 కోట్ల నుంచి 8 శాతం పెరిగి రూ.40,925 కోట్లకు చేరింది.

ఇన్ఫోసిస్ క్యూ4 ఫలితాలు

2025 మార్చితో ముగిసినన గత ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికంలో ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ నికర లాభం తగ్గింది. క్యూ4 లో ఇన్ఫోసిస్ ఏకీకృత నికర లాభం 11.75 శాతం క్షీణించి రూ.7,033 కోట్లకు పరిమితమైంది. అంతక్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో కంపెనీ లాభం రూ.7,969 కోట్లుగా ఉంది. మార్చితో ముగిసిన త్రైమాసికంలో కార్యకలాపాల ద్వారా కంపెనీ ఆదాయం 8 శాతం పెరిగి రూ.37,923 కోట్ల నుంచి రూ.40,925 కోట్లకు పెరిగింది.

పనితీరు బాగుంది..

‘‘ఆదాయం, నిర్వహణ మార్జిన్ల విస్తరణ, అత్యధిక ఉచిత నగదు ఉత్పత్తి పరంగా ఈ ఏడాది మా పనితీరు పటిష్టంగా ఉంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, క్లౌడ్, డిజిటల్లో మా లోతు, కాస్ట్ ఎఫిషియెన్సీ, ఆటోమేషన్, కన్సాలిడేషన్లో బలం మా క్లయింట్ల అవసరాలకు బాగా సరిపోతాయి" అని ఇన్ఫోసిస్ సీఈఓ, ఎండీ సలీల్ పరేఖ్ అన్నారు. ఇన్ఫోసిస్ మార్చి త్రైమాసిక స్కోర్కార్డులోని ఐదు కీలక అంశాలను పరిశీలిద్దాం.

ఇన్ఫోసిస్ క్యూ4: కీలకాంశాలు

1. ఇన్ఫోసిస్ క్యూ4 కీలక గణాంకాలు

స్థిర కరెన్సీలో కంపెనీ ఆదాయం అంతకుముందు సంవత్సరం క్యూ4 తో పోలిస్తే 4.8 శాతం వృద్ధి చెందగా, క్యూ 3 తో పోలిస్తే 3.5 శాతం క్షీణించింది. ఈ త్రైమాసికంలో ఆపరేటింగ్ మార్జిన్ అంతకముందు సంవత్సరం క్యూ 4 కన్నా 0.9 శాతం పెరిగింది. "2025 ఆర్థిక సంవత్సరం నిర్వహణ మార్జిన్లు 0.5 శాతం పెరిగాయి. ఇవి సవాలుతో కూడిన స్థూల వాతావరణంలో బహుళ ప్రతికూలతలను అధిగమించిన సాధించిన ఫలితాలు’’ అని ఇన్ఫోసిస్ సీఎఫ్ వో జయేశ్ సంఘ్ రాజ్కా తెలిపారు.

2. ఇన్ఫోసిస్ క్యూ4 డివిడెండ్

అర్హులైన షేర్ హోల్డర్లకు గత ఆర్థిక సంవత్సరం తుది డివిడెండ్ గా ఒక్కో ఈక్విటీ షేరుపై రూ. 22 ఇవ్వాలని ఇన్ఫోసిస్ బోర్డు నిర్ణయించింది. తుది డివిడెండ్ చెల్లింపునకు రికార్డు తేదీ మే 30, 2025 గా ఉంది. 2025 జూన్ 30 నాటికి అర్హులైన షేర్ హోల్డర్లకు డివిడెండ్ చెల్లించనున్నట్లు ఇన్ఫోసిస్ తెలిపింది.

3. ఇన్ఫోసిస్ క్యూ4 విభాగం, క్లయింట్ భౌగోళిక ఆదాయం

కంపెనీ ఎక్సేంజ్ ఫైలింగ్ ప్రకారం స్థిర కరెన్సీ లో 'ఫైనాన్షియల్ సర్వీసెస్' విభాగం ఆదాయం 12.6 శాతం, 'తయారీ' విభాగం ఆదాయం 14 శాతం పెరిగాయి. వివిధ భౌగోళిక ప్రాంతాల్లో భారత మార్కెట్ నుంచి వచ్చే ఆదాయం సీసీ పరంగా 43.7 శాతం పెరిగింది. యూరప్ నుంచి వచ్చే ఆదాయం 15 శాతం పెరిగింది. ఉత్తర అమెరికా నుంచి వచ్చే ఆదాయం 0.4 శాతం క్షీణించింది. మిగతా దేశాలతో పోలిస్తే సీసీలో ఆదాయం 2.2 శాతం పడిపోయింది.

4. హెడ్ కౌంట్

క్యూ4ఎఫ్ వై25 ముగిసేనాటికి ఇన్ఫోసిస్ లోని మొత్తం ఉద్యోగుల సంఖ్య 3,23,578 కాగా, క్యూ4ఎఫ్ వై24 ముగిసే సమయానికి 3,17,240గా ఉంది. ఐటీ సేవల స్వచ్ఛంద అట్రిషన్ 12.6 శాతం నుంచి 14.1 శాతానికి పెరిగింది.

సూచన: ఈ కథనానికి సంబంధించిన డేటాను ఇన్ఫోసిస్ ఎక్స్ఛేంజ్ ఫైలింగ్స్ నుంచి తీసుకున్నారు. ఈ కథనం కేవలం సమాచారం కోసం మాత్రమే. ఏదైనా పెట్టుబడి నిర్ణయాలు తీసుకునే ముందు సర్టిఫైడ్ నిపుణులను సంప్రదించాలని మేము పెట్టుబడిదారులకు సలహా ఇస్తున్నాము.

వి. సుదర్శన్ గత 3 సంవత్సరాల నుండి హిందూస్తాన్ టైమ్స్ డిజిటల్ మీడియా తెలుగు విభాగంలో న్యూస్ ఎడిటర్ గా ఉన్నారు. గతంలో, ఆయన ఈనాడు, సాక్షి వంటి ప్రముఖ తెలుగు దినపత్రికలతో వివిధ సంపాదకీయ హోదాలలో పనిచేశారు. జాతీయ అంతర్జాతీయ రాజకీయ పరిణామాలు, ఎన్నికలు, బడ్జెట్స్, ఆర్థిక రంగ పరిణామాలను రిపోర్ట్ చేయడంలో, రాజకీయ విశ్లేషణల్లో దాదాపు 20 సంవత్సరాల అనుభవం ఉంది. వి. సుదర్శన్ ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఎంబీఏ, ఎల్ఎల్ బీ చేశారు.

సంబంధిత కథనం