ప్రముఖ ఐటీ సంస్థ ఇన్ఫోసిస్ (Infosys) తన ఉద్యోగులకు గుడ్న్యూస్ చెప్పింది. తొలి త్రైమాసికంలో మంచి ఆర్థిక ఫలితాలు నమోదు చేయడంతో, ఉద్యోగులకు సగటున 80 శాతం పనితీరు బోనస్ (Performance Bonus) ఇవ్వనున్నట్లు ప్రకటించింది. ఈ బోనస్ వ్యక్తిగత పనితీరు రేటింగ్ల ఆధారంగా ఉంటుందని కంపెనీ అంతర్గత మెమో ద్వారా తెలుస్తోంది.
మనీకంట్రోల్ నివేదిక ప్రకారం, బ్యాండ్ 6, అంతకంటే తక్కువ స్థాయిలోని ఉద్యోగులందరికీ ఈ త్రైమాసిక బోనస్ లభిస్తుంది. ఇందులో జూనియర్, మిడ్-లెవల్ ఉద్యోగులు ఉంటారు. గత ఏడాది ఇదే త్రైమాసికంలో సగటు బోనస్ 65 శాతం మాత్రమే కావడం గమనార్హం.
పనితీరు స్థాయి (performance level) ఆధారంగా బోనస్ శాతాన్ని నిర్ణయిస్తారు.
పీఎల్4 (PL4) ఉద్యోగులకు: వీరికి 80 నుంచి 89 శాతం వరకు బోనస్ లభిస్తుంది. 'అత్యుత్తమ' (Outstanding) పనితీరు కనబరిచిన వారికి 89 శాతం, 'మెరుగుదల అవసరమైన' (Needs Attention) కేటగిరీలో ఉన్నవారికి 80 శాతం బోనస్ వస్తుంది.
పీఎల్5 (PL5) ఉద్యోగులకు: వీరి బోనస్ 78 నుంచి 87 శాతం వరకు ఉంటుంది.
పీఎల్6 (PL6) ఉద్యోగులకు: వీరికి 75 నుంచి 85 శాతం వరకు బోనస్ లభిస్తుంది.
ఈ బోనస్కు సంబంధించిన వివరాలను ఉద్యోగుల 'ఈ-డాకెట్స్' లో అప్లోడ్ చేస్తారు. ఈ విషయంపై తాము వార్త రాసే సమయానికి ఇన్ఫోసిస్ నుంచి ఎలాంటి అధికారిక స్పందన రాలేదని ఆ రిపోర్ట్ పేర్కొంది.
ఆగస్టు 20న మార్కెట్ ప్రారంభం కాగానే ఐటీ రంగం షేర్లు మంచి లాభాలను నమోదు చేశాయి. నిఫ్టీ ఐటీ ఇండెక్స్ (Nifty IT Index) 2.70 శాతం పెరిగింది. ఇది మే 2025 తర్వాత ఒకే రోజులో నమోదైన అతిపెద్ద పెరుగుదల.
ఇన్ఫోసిస్ షేర్ 4 శాతం పెరిగి ₹1,497కి చేరి అగ్రస్థానంలో నిలిచింది. ఆ తర్వాత కోఫోర్జ్ 3.3 శాతం, ఎంఫసిస్ 3.2 శాతం లాభపడ్డాయి. టీసీఎస్, పర్సిస్టెంట్ సిస్టమ్స్, టెక్ మహీంద్రా, ఒరాకిల్ ఫైనాన్షియల్ సర్వీసెస్, విప్రో, ఎల్టీఐమైండ్ట్రీ, హెచ్సీఎల్ టెక్నాలజీస్ వంటి ఇతర ఐటీ షేర్లు కూడా 1.5 శాతం నుంచి 3 శాతం వరకు లాభాలతో ముగిశాయి.