పలు సరిహద్దు జిల్లాలపై పాక్ సైన్యం దాడి చేసిన నేపథ్యంలో విమానాశ్రయాల్లో భద్రతా చర్యలను పెంచిన కారణంగా ప్రయాణికులు మూడు గంటల ముందుగానే విమానాశ్రయాలకు చేరుకోవాలని పిలుపునిస్తూ వాణిజ్య విమానయాన సంస్థలు గురువారం రాత్రి ఒక ప్రకటన విడుదల చేశాయి.
"విమానాశ్రయాల్లో మెరుగైన చర్యలపై బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ ఇచ్చిన ఆదేశాలను దృష్టిలో ఉంచుకుని, భారతదేశం అంతటా ఉన్న ప్రయాణీకులు ప్రయాణ సమయానికి కనీసం మూడు గంటల ముందుగానే ఆయా విమానాశ్రయాలకు చేరుకోవాలి. బయలుదేరడానికి 75 నిమిషాల ముందు చెక్-ఇన్ మూసివేసి ఉంటుంది..’ అని ఎయిర్ లైన్స్ సంస్థలు పేర్కొన్నాయి.
ఈ అసాధారణ సమయంలో అన్ని విమానాశ్రయాల్లో కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టినట్లు ఇండిగో తెలిపింది. ‘భద్రతా తనిఖీలు ఫార్మాలిటీలకు అనుగుణంగా మీ ప్రయాణానికి కొంత అదనపు సమయాన్ని అనుమతించాలని మేం మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాం. మీ అవగాహన, సహకారాన్ని అభినందిస్తున్నాం..’ అని ఇండిగో పేర్కొంది.
దేశంలోని అన్ని విమానయాన సంస్థలు, విమానాశ్రయాల్లో భద్రతా చర్యలను పెంచాలని బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ (బీసీఏఎస్) ఆదేశించింది.
అన్ని విమానాశ్రయాల్లో ప్రయాణికులందరూ సెకండరీ లాడర్ పాయింట్ సెక్యూరిటీ చెక్ (ఎల్పీఎస్సీ) చేయించుకోవాల్సి ఉంటుంది. టెర్మినల్ భవనాల్లోకి సందర్శకుల ప్రవేశాన్ని నిషేధించినట్టు, అందుకు అనుగుణంగా ఎయిర్ మార్షల్స్ ను నియమించనున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.
కాగా భారతదేశంలోని 28 విమానాశ్రయాలను శనివారం ఉదయం వరకు మూసివేస్తున్నట్లు ప్రకటించారు. అలాగే పలు విమాన సర్వీసులు నిలిచిపోయాయి. ఢిల్లీ విమానాశ్రయంలో గురువారం ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు 90 విమానాలు రద్దయ్యాయి.
గురువారం సాయంత్రం మొదట జమ్మూలో, ఆ తర్వాత పంజాబ్ లోని పలు జిల్లాల్లో వైమానిక దాడుల సైరన్లు, భారీ పేలుళ్ల శబ్దాలు వినిపించాయి.
పేలుళ్ల శబ్దాల నేపథ్యంలో జమ్ముకశ్మీర్, పంజాబ్, రాజస్థాన్, గుజరాత్ లోని కొన్ని ప్రాంతాల్లో పాక్ తో భారత సరిహద్దు వెంబడి బ్లాక్అవుట్లు విధించారు.
సత్వారీ, సాంబా, ఆర్ఎస్ పురా, అర్నియా వైపు వచ్చిన ఎనిమిది పాక్ క్షిపణులను భారత గగనతల రక్షణ వ్యవస్థలు అడ్డుకున్నాయని రక్షణ వర్గాలు ధృవీకరించాయి.
'అంతర్జాతీయ సరిహద్దుకు సమీపంలో ఉన్న జమ్మూ, పఠాన్ కోట్, ఉధంపూర్ సైనిక స్టేషన్లను క్షిపణులు, డ్రోన్ల ద్వారా పాక్ లక్ష్యంగా చేసుకుంది' అని ఇంటిగ్రేటెడ్ డిఫెన్స్ స్టాఫ్ ఎక్స్ అకౌంట్ పోస్ట్ చేసింది.
ఎస్ఓపీ ప్రకారం భారత సాయుధ దళాలు కైనెటిక్, నాన్ కైనెటిక్ మార్గాలతో ముప్పును తటస్థం చేస్తాయని తెలిపింది.