అంతర్జాతీయ ద్రవ్య నిధి (IMF) పాకిస్థాన్ కు 100 కోట్ల డాలర్లను తక్షణమే రుణంగా అందించేందుకు ఆమోదం తెలిపింది. ఎక్స్టెండెడ్ ఫండ్ ఫెసిలిటీ (EFF) ఏర్పాటు కింద పాకిస్తాన్ ఆర్థిక సంస్కరణల కార్యక్రమం ప్రారంభ సమీక్షను తమ ఎగ్జిక్యూటివ్ బోర్డు ముగించిందని వాషింగ్టన్ కు చెందిన ఐఎంఎఫ్ శనివారం ఒక ప్రకటనలో తెలిపింది.
ఈ నిర్ణయంతో పాకిస్తాన్ కు సుమారు 1 బిలియన్ డాలర్ల (SDR 760 million) తక్షణమే రుణంగా అందుతాయి. ఈ ఒప్పందం కింద మొత్తం సుమారు 2.1 బిలియన్ డాలర్లు (SDR 1.52 billion) పాకిస్తాన్ కు రుణంగా అందుతుంది’ అని ఐఎంఎఫ్ తెలిపింది. అదనంగా, రెజిలియన్స్ అండ్ సస్టెయినబిలిటీ ఫెసిలిటీ (RSF) కింద సుమారు 1.4 బిలియన్ డాలర్లు ఇవ్వాలన్న పాకిస్తాన్ అధికారుల అభ్యర్థనను ఐఎంఎఫ్ ఎగ్జిక్యూటివ్ బోర్డు ఆమోదించింది.
పాకిస్తాన్ 37 నెలల ఎక్స్టెండెడ్ ఫండ్ ఫెసిలిటీ ని సెప్టెంబర్ 25, 2024 న ఆమోదించామని ఐఎంఎఫ్ తెలిపింది. ఆర్థిక సుస్థిరతతో, స్థిరమైన వృద్ధి లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఐఎంఎఫ్ ఒక ప్రకటనలో తెలిపింది. ప్రకృతి వైపరీత్యాల వల్ల కలిగే నష్టాలను తగ్గించడానికి, ఆర్థిక, వాతావరణ స్థితిస్థాపకతను పెంపొందించడానికి పాకిస్తాన్ చేస్తున్న ప్రయత్నాలకు ఆర్ఎస్ఎఫ్ మద్దతు ఇస్తుందని తెలిపింది.
ఐఎంఎఫ్ కార్యక్రమాల అమలు సమర్థతపై, పాకిస్తాన్ ట్రాక్ రికార్డ్ సరిగా లేనందున, ప్రభుత్వ ప్రాయోజిత సీమాంతర ఉగ్రవాదానికి ఐఎంఎఫ్ అందిస్తున్న ఈ రుణ నిధులు దుర్వినియోగం అయ్యే అవకాశం ఉందని భారత్ ఆందోళన వ్యక్తం చేసింది. పాకిస్తాన్ కు 2.3 బిలియన్ డాలర్ల తాజా రుణాలను ఇవ్వాలన్న ఐఎంఎఫ్ ప్రతిపాదనను భారత్ వ్యతిరేకించింది. ప్రభుత్వ ప్రాయోజిత సీమాంతర ఉగ్రవాదానికి నిధులు సమకూర్చడానికి వాటిని దుర్వినియోగం చేసే అవకాశం ఉందని పేర్కొంది. పాకిస్థాన్ కు ఈఎఫ్ ఎఫ్ రుణ కార్యక్రమాన్ని సమీక్షించేందుకు శుక్రవారం సమావేశమైన ఐఎంఎఫ్ బోర్డులో భారత్ తన నిరసనను తెలియజేసింది. కీలకమైన ఐఎంఎఫ్ సమావేశంలో ఓటింగ్ కు భారత్ గైర్హాజరైంది.
సంబంధిత కథనం