HP layoffs: 6 వేల ఉద్యోగులపై హెచ్పీ వేటు.. అన్ని టెక్ కంపెనీలది అదే బాట
HP layoffs: హెచ్పీ కంపెనీ 6 వేల ఉద్యోగులను తొలగించనుంది. వ్యాపారం దెబ్బతినడంతో ఈ నిర్ణయం తీసుకుంది.
పర్సనల్ కంప్యూటర్లకు డిమాండ్ తగ్గడంతో రెవెన్యూ పడిపోయిన నేపథ్యంలో హ్యూలెట్-ప్యాకర్డ్ (హెచ్పీ) కంపెనీ 6 వేల ఉద్యోగులపై వేటు వేయనుంది. రానున్న మూడేళ్లలో ఈ లేఆఫ్ నిర్ణయం అమలు చేయనుంది. పర్సనల్ కంప్యూటర్స్ డిమాండ్ క్రమంగా పడిపోవడంతో హెచ్పీ సమస్యలు ఎదుర్కొంటోంది. కంపెనీ ప్రధాన ఆదాయ వనరు పర్సనల్ కంప్యూటర్స్ విభాగమే కావడం గమనార్హం. వ్యాపారం దెబ్బతినడంతో ఇప్పుడు ఉద్యోగులపై వేటు వేయాలని, అలాగే టెక్నాలజీపై ఖర్చు తగ్గించాలని హెచ్పీ చూస్తోంది. తొలుత తక్కువ స్థాయి కన్జ్యూమర్ గూడ్స్తో మొదలుపెట్టి మిగిలిన విభాగాల్లో కూడా కార్యాచరణ రూపొందించింది.
61 వేల వర్క్ఫోర్స్తో ఉన్న హెచ్పీ రానున్న మూడేళ్లలో 10 శాతం ఉద్యోగులపై వేటు వేయాలని నిర్ణయించినట్టు సీఈవో ఎన్రిక్ లారెస్ తెలిపారు. ఖర్చుల నియంత్రణ కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు. రీస్ట్రక్చరింగ్ వ్యయం 1 బిలియన్ డాలర్లుగా ఉండే అవకాశం ఉందని చెప్పారు. 60 శాతం ప్రస్తుత ఆర్తిక సంవత్సరంలోనే ఉండే అవకాశం ఉందని చెప్పారు. ఈ కార్యాచరణ వల్ల 2025 వరకు ఏటా 1.4 బిలియన్ డాలర్లు ఆదా అవుతాయని హెచ్పీ ఓ స్టేట్మెంట్లో తెలిపింది.
బ్లూమ్బెర్గ్ సేకరించిన డేటాను విశ్లేషించిన అనలిస్టులు ఎర్నింగ్స్ షేరుకు 3.20 డాలర్ల నుంచి 3.60 డాలర్ల మధ్య ఉంటాయని అంచనా వేశారు. ఫ్రీ క్యాష్ ఫ్లో 3.25 బిలియన్ డాలర్లుగా ఉంటుందని అంచనా వేశారు.
సీఈవో లారెస్ ప్రకారం సవాలుతో కూడిన మార్కెట్ వాతావరణాన్ని కంపెనీ ఎదుర్కొంటోంది. గత ఆర్థిక సంవత్సరంలో కంపెనీ సేల్స్ 10 శాతం పడిపోయాయి. మూడో క్వార్టర్లో ప్రపంచవ్యాప్తంగా పర్సనల్ కంప్యూటర్ షిప్మెంట్ సుమారు 20 శాతం పతనమైంది. మరోవైపు పర్సనల్ కంప్యూటర్ల విభాగం ద్వారా 55 శాతం రెవెన్యూ సాధించే డెల్ టెక్నాలజీస్ ప్రస్తుత క్వార్టర్లో అమ్మకాలు తగ్గుతాయని, భవిష్యత్తుపై వినియోగదారుల ఆందోళన ఇందుకు కారణమని అంచనా వేసింది.
గత కొన్ని వారాలుగా పలు ఐటీ కంపెనీలు తమ వర్క్ఫోర్స్ తగ్గించుకునే ఆలోచనలను వెల్లడించాయి. మెటా ప్లాట్ఫామ్స్ ఐఎన్సీ, అమెజాన్ 10 వేల మంది ఉద్యోగులపై వేటు వేయనున్నట్టు ప్రకటించాయి. అలాగే ట్విట్టర్ కూడా 3,750 మందికి పైగా ఉద్యోగులను తొలగించింది. సిస్కో సిస్టమ్స్ కూడా గత వారం ఉద్యోగుల తొలగింపుపై నిర్ణయం తీసుకుంది. కొన్ని కార్యాలయాలను మూసివేసింది. ఇక హార్డ్ డ్రైవ్ మాన్యుఫాక్చరర్ సీగేట్ టెక్నాలజీస్ కూడా 3 వేల ఉద్యోగులపై వేటు వేయనున్నట్టు ప్రకటించింది.