SP Hinduja passes away: గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధ పడుతున్న హిందూజా గ్రూప్ (Hinduja Group) చైర్మన్ శ్రీ చంద్ పరమానంద్ హిందూజా (Srichand Parmanand Hinduja) బుధవారం లండన్ లో కన్నుమూశారు. ఆయన వయస్సు 87 ఏళ్లు. నలుగురు హిందూజా బ్రదర్స్ లో ఎస్పీ హిందూజా పెద్ద వాడు. హిందూజా గ్రూప్ కు ఆయన ప్రస్తుతం చైర్మన్ గా వ్యవహరిస్తున్నారు.
శ్రీచంద్ పరమానంద్ హిందూజా కు బ్రిటిష్ పౌరసత్వం ఉంది. హిందూజా గ్రూప్ (Hinduja Group) భారత్ సహా పలు దేశాల్లో వ్యాపార కార్యకలాపాలు నిర్వహిస్తుంటుంది. ఎస్పీ హిందూజా సోదరులు గోపీచంద్ హిందూజా, ప్రకాశ్ హిందూజా, అశోక్ హిందూజా కూడా హిందూజా గ్రూప్ (Hinduja Group) వ్యాపార కార్యకలాపాల్లో కీలక హోదాల్లో ఉన్నారు. శ్రీ చంద్ పరమానంద్ హిందూజా (Srichand Parmanand Hinduja) బ్రిటన్ లోని సంపన్నుల్లో ఒకరు. 87 ఏళ్ల శ్రీ చంద్ పరమానంద్ హిందూజా (Srichand Parmanand Hinduja) గత కొంతకాలంగా వృద్ధాప్య సంబంధ అనారోగ్యాలతో బాధపడుతున్నారు. బుధవారం లండన్ లోని తన నివాసంలో ఆయన తుది శ్వాస విడిచారు.
శ్రీ చంద్ పరమానంద్ హిందూజా (Srichand Parmanand Hinduja) 1935 లో ప్రస్తుత పాకిస్తాన్ లోని కరాచీలో జన్మించారు. చిన్న వయస్సులోనే తండ్రి వ్యాపార కార్యకలాపాల్లో పాలు పంచుకున్నారు. టెక్స్ టైల్, ట్రేడింగ్, ఐరన్ ఓర్ బిజినెస్ లలో రాణించారు. ఇరాన్ లోని టెహ్రాన్ కు భారత్ నుంచి ఉల్లిగడ్డలు, బంగాళాదుంపలు వంటి ఆహార పదార్ధాలను ఎగుమతి చేసి విశేషంగా లాభాలను ఆర్జించారు. ఆ తరువాత క్రమంగా తమ వ్యాపారాలను విస్తరించారు. బ్రిటిష్ లేలండ్ (British Leyland) ను కొనుగోలు చేసి అశోక్ లేలండ్ (Ashok Leyland) గా భారీ వాహన ఉత్పత్తి సంస్థగా తీర్చి దిద్దారు. అనంతరం గల్ఫ్ ఆయిల్ ను కొనుగోలు చేశారు. రాజీవ్ గాంధీ ప్రధాని గా ఉన్న సమయంలో ఆయనతో అత్యంత సన్నిహితంగా ఉండేవారు. ఈనేపథ్యంలోనే బోఫోర్స్ కుంభకోణంలో హిందూజా సోదరులు భారీగా లాభపడ్డారనే ఆరోపణలు వెల్లువెత్తాయి.