ఉద్యోగుల భవిష్య నిధిపై వడ్డీ రేటును 2025 ఆర్థిక సంవత్సరానికి 8.25 శాతంగా ఈపీఎఫ్ఓ నిర్ధారించింది. ఈపీఎఫ్ఓ ప్రతిపాదనకు శనివారం కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. రిటైర్మెంట్ ఫండ్ బాడీ అయిన ఈపీఎఫ్ఓకు 7 కోట్లకు పైగా చందాదారులున్నారు. వారి ఖాతాల్లో ఈ వార్షిక వడ్డీరేటుతో వడ్డీని జమ చేయనున్నారు.
2024-25 ఆర్థిక సంవత్సరానికి ఉద్యోగుల భవిష్య నిధి (ఈపీఎఫ్) డిపాజిట్లపై 8.25 శాతం వడ్డీ రేటును కొనసాగించాలని ఫిబ్రవరి 28న ఈపీఎఫ్ఓ నిర్ణయించింది. ఫిబ్రవరి 28న ఢిల్లీలో కేంద్ర కార్మిక, ఉపాధి కల్పన శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ అధ్యక్షతన జరిగిన ఈపీఎఫ్ఓ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ 237వ సమావేశంలో వడ్డీ రేట్లపై నిర్ణయం తీసుకున్నారు. అనంతరం, 2024-25 సంవత్సరానికి ఆమోదం పొందిన ఆ ఆ ప్రతిపాదిత వడ్డీ రేటును ఆర్థిక మంత్రిత్వ శాఖ సమ్మతి కోసం పంపారు.
2024-25 ఆర్థిక సంవత్సరానికి ఈపీఎఫ్ పై 8.25 శాతం వడ్డీ రేటుకు ఆర్థిక మంత్రిత్వ శాఖ అంగీకారం తెలిపిందని, దీనికి సంబంధించిన సమాచారాన్ని కార్మిక మంత్రిత్వ శాఖ గురువారం ఈపీఎఫ్ఓకు పంపిందని కార్మిక మంత్రిత్వ శాఖ అధికారి శనివారం వెల్లడించారు. ఇప్పుడు 2025 ఆర్థిక సంవత్సరానికి ఆమోదించిన రేటు ప్రకారం వడ్డీ మొత్తాన్ని ఈపీఎఫ్ఓ లోని ఏడు కోట్లకు పైగా చందాదారుల ఖాతాలలో జమ చేస్తారు. అనేక స్థిర ఆదాయ సాధనాలతో పోలిస్తే ఈపీఎఫ్ సాపేక్షంగా అధిక, స్థిరమైన రాబడిని అందిస్తుంది. పదవీ విరమణ అనంతర పొదుపుపై స్థిరమైన వృద్ధిని నిర్ధారిస్తుంది.
2022-23 లో ఈపీఎఫ్ పై వడ్డీ రేటు 8.15 శాతంగా ఉంది. దీనిని 2023-24 ఆర్థిక సంవత్సరానికి 8.25 శాతానికి పెంచారు. అంతకుముందు, 2020-21 లో 8.5 శాతంగా ఉన్న వడ్డీ రేటును 2021-22 సంవత్సరానికి గానూ 8.1 శాతానికి తగ్గించారు. ఇది గత నాలుగు దశాబ్దాలలో అత్యంత కనిష్టం. సుమారు నాలుగు దశాబ్దాల క్రితం, అంటే 1977-78 లో ఈపీఎఫ్ వడ్డీ రేటు 8 శాతంగా ఉంది.
సంబంధిత కథనం