ఉద్యోగులు, పెన్షనర్లకు శుభవార్త.. 8వ వేతన సంఘం ఏర్పాటుపై కీలక అప్డేట్-good news for employees and pensioners key update on the formation of the 8th pay commission ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  ఉద్యోగులు, పెన్షనర్లకు శుభవార్త.. 8వ వేతన సంఘం ఏర్పాటుపై కీలక అప్డేట్

ఉద్యోగులు, పెన్షనర్లకు శుభవార్త.. 8వ వేతన సంఘం ఏర్పాటుపై కీలక అప్డేట్

Anand Sai HT Telugu

8వ వేతన సంఘం ఏర్పాటుకు ఛైర్మన్‌తో సహా వివిధ పోస్టుల భర్తీ ప్రక్రియను ప్రభుత్వం ప్రారంభించినట్టుగా తెలుస్తోంది. అధికారిక ప్రకటన త్వరలో వెలువడే అవకాశం ఉంది.

8వ వేతన సంఘం

8వ వేతన సంఘం ఏర్పాటుకు ప్రభుత్వం సన్నాహాలు వేగవంతం చేసింది. ఆర్థిక మంత్రిత్వ శాఖలోని వ్యయ విభాగం వివిధ పోస్టుల భర్తీ ప్రక్రియను ప్రారంభించింది. ఇందులో ఛైర్మన్, మరో ఇద్దరు సభ్యుల నియామకం కూడా ఉంది. ఛైర్మన్ సహా అత్యున్నత పదవులకు పేర్లు దాదాపుగా ఖరారు అయ్యాయని, త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉందని ఒక అధికారి తెలిపారు.

డిప్యుటేషన్ ప్రాతిపదికన

8వ వేతన సంఘం కోసం అధికారులను నియమించాలని ఆదేశిస్తూ వ్యయ శాఖ ఏప్రిల్ 21న రెండు వేర్వేరు సర్క్యులర్‌లను జారీ చేసింది. ఈ పోస్టుల్లో ఎక్కువ భాగాన్ని వివిధ ప్రభుత్వ విభాగాల అధికారులు డిప్యుటేషన్ ప్రాతిపదికన భర్తీ చేస్తారు. దీనితో పాటు, ఛైర్మన్, మరో ఇద్దరు ముఖ్యమైన సభ్యులను విడిగా ఎంపిక చేస్తారు. నియమించే అధికారులలో ఇద్దరు డైరెక్టర్లు/డిప్యూటీ సెక్రటరీలు, ముగ్గురు అండర్ సెక్రటరీలు, ఇతర సిబ్బంది ఉంటారు. నిబంధనలను ఖరారు చేసిన తర్వాత అవసరమైన సన్నాహాలు చేసే పనిని వారందరికీ అప్పగిస్తారు.

7వ వేతన సంఘం

మునుపటిది పరిశీలిస్తే.. 7వ వేతన సంఘంలో మొత్తం 45 మంది సభ్యులు ఉన్నారు. ఇందులో ఛైర్మన్, 18 మంది సెక్రటేరియట్ సిబ్బంది, 16 మంది సలహాదారులు, 7 మంది ఇతర సిబ్బంది ఉన్నారు. 7వ వేతన సంఘానికి జస్టిస్ అశోక్ కుమార్ మాథుర్ నేతృత్వం వహించారు.

మెమోరాండం

జాతీయ మండలి(జేసీఎం) సిబ్బంది కూడా 8వ వేతన సంఘానికి సమర్పించాల్సిన మెమోరాండంను సిద్ధం చేయడం ప్రారంభించింది. ఏప్రిల్ 22న జరిగిన స్టాండింగ్ కమిటీ సమావేశం తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ సమావేశంలో కనీస వేతనం, పే స్కేల్, ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్, అలవెన్సులు, పదోన్నతి విధానం, పెన్షన్ ప్రయోజనాలు వంటి అనేక ముఖ్యమైన అంశాలపై చర్చించారు.

అన్ని ప్రధాన ఉద్యోగి సంస్థల నుండి సూచనలను తీసుకున్న తర్వాత మెమోరాండంను సిద్ధం చేయడానికి ఒక ముసాయిదా కమిటీని ఏర్పాటు చేశారు. ఈ సంస్థలు తమ ప్రతినిధుల పేర్లను ఏప్రిల్ 30, 2025 నాటికి పంపుతాయి. అన్ని సంస్థల సూచనల ఆధారంగా మే 20, 2025 నాటికి తుది మెమోరాండం తయారు అవుతుంది.

అధికారిక ప్రకటన ఎప్పుడో?

ప్రభుత్వం ఇంకా అధికారికంగా 8వ వేతన సంఘాన్ని ప్రకటించలేదు. దాని నిబంధనలను జారీ చేయలేదు. కానీ నిరంతరం జారీ అవుతున్న సర్క్యులర్లు, అంతర్గత సమావేశాలు చూస్తుంటే.. పని వేగంగా అవుతుందని తెలుస్తోంది. రాబోయే కొన్ని నెలల్లో కమిషన్ పనిచేయడం ప్రారంభిస్తుందని భావిస్తున్నారు. 8వ వేతన సంఘం గడువు తేదీని రెండు నుండి మూడు వారాల్లో తెలియజేస్తామని అధికారిక వర్గాలు తెలిపాయి.

ఆనంద్ సాయి హెచ్.టి తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్. నేషనల్, బిజినెస్ వార్తలు రాస్తారు. గతంలో ఎంటర్‌టైన్మెంట్, లైఫ్‌స్టైల్ రాసేవారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభం ఉంది. కాకతీయ యూనివర్సిటీలో మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం పీజీ చేశారు. గతంలో నవతెలంగాణ, ఈనాడు, ఈటీవీ భారత్, ఏబీపీ దేశంలో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. 2022లో హెచ్.టి తెలుగులో చేరారు.