ఫ్లాష్! ఫ్లాష్! గత కొన్ని నెలలుగా విపరీతంగా పెరుగుతున్న బంగారం ధరలు మరోసారి రికార్డు స్థాయిని తాకాయి. దేశంలో 10 గ్రాముల (24 క్యారెట్) బంగారం ధర రూ. 1లక్ష మార్క్ని మంగళవారం హిట్ చేసింది. విపరీతంగా పెరిగిపోయిన పసిడి ధరలు చూస్తున్న భారత మధ్యతరగతి ప్రజలు గుండెలు పట్టుకుంటున్నారు. పెళ్లిళ్ల సీజన్, అక్షయ తృతీయ వేళ బంగారం ధరలు ఈ స్థాయికి చేరడం ప్రజలను భయపెడుతోంది. బంగారం ఇంతలా పెరగడానికి అమెరికాలో కొనసాగుతున్న అనిశ్చితి ప్రధాన కారణం అని నిపుణులు చెబుతున్నారు.
దేశ రాజధాని దిల్లీలోని రిటైల్ మార్కెట్లో బంగారం ధరలు మంగళవారం 10 గ్రాములకు రూ .1 లక్షకు చారిత్రక గరిష్టానికి చేరుకున్నాయి. ఇక మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ (ఎంసీఎక్స్)లో బంగారం ధరలు తొలిసారి రూ.99,000 మార్కును దాటాయి.
ఎంసీఎక్స్ గోల్డ్ రేటు 10 గ్రాములకు రూ.98,753 వద్ద ప్రారంభమైంది. ఈ సెషన్లో బంగారం ధరలు రూ .1,899/ 1.95 శాతం పెరిగి, 10 గ్రాములకు రూ .99,178 వద్ద కొత్త ఆల్టైమ్ గరిష్టాన్ని తాకాయి.
ఇండియాలో బంగారం ధర రూ. 1లక్షను తాకడం దేశంలోని మధ్యతరగతిలో ప్రకంపనలు సృష్టిస్తోంది. ఏప్రిల్ 30న అక్షయ తృతీయ నాడు సెంటిమెంట్గా పసిడిని కొనుగోలు చేద్దామనుకుంటున్న వారికి ధరల పెరుగుదల షాక్ని ఇచ్చింది. ఇప్పుడు చాలా మంది పసిడిలో పెట్టుబడి పెట్టడానికి మరింత కష్టపడాల్సి వస్తుంది.
స్పాట్ గోల్డ్ ధర ఔన్స్కి 1.7 శాతం పెరుగుదలతో 3,482.26 డాలర్లకు వెళ్లింది. యూఎస్ గోల్డ్ ఫ్యూచర్స్ 2 శాతం పెరిగి 3,492.60 డాలర్లకు చేరుకుంది.
బంగారం ధర ఈ స్థాయిలో పెరగడానికి కారణంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ‘టారీఫ్’ల పేరుతో ఆయన సృష్టిస్తున్న ఆర్థిక అనిశ్చితి! తాజాగా ఫెడరల్ రిజర్వ్ ఛైర్మన్ జెరోమ్ పావెల్పై ట్రంప్ ఫైర్ అవ్వడం, ఆయన్ని ఆ పదవి నుంచి తొలగించేస్తారేమో అన్న భయాలు పెరగడంతో బంగారం ధరలు మంగళవారం మరింత పైకి వెళ్లాయి. ఇలాంటి అనిశ్చితిని ఇష్టపడని మదుపర్లు.. అమెరికా స్టాక్స్, బాండ్లు, డాలర్ నుంచి వైదొలుగుతూ బంగారంలోకి పెట్టుబడులు పెడుతున్నారు. ఫలితంగా గోల్డ్ ప్రైజ్ పెరిగి ఆల్ టైమ్ గరిష్టాన్ని తాకింది.
అమెరికా ఆర్థిక వ్యవస్థ మందగమనాన్ని ఎదుర్కొంటుందని హెచ్చరిస్తూ వడ్డీ రేట్లను తక్షణమే తగ్గించాలని ట్రంప్ సోమవారం తన పిలుపును పునరుద్ఘాటించారు. టారిఫ్ ప్రణాళికల ద్రవ్యోల్బణ ప్రభావంపై స్పష్టత వచ్చే వరకు రేట్లను యథాతథంగా ఉంచాలన్న పావెల్ వైఖరిని విమర్శించారు.
మరోవైపు, అనేక దేశాలు కూడా డాలర్కి ప్రత్యామ్నాయంగా తమ గోల్డ్ రిజర్వ్లను పెంచుకుంటుడటంతో బంగారం ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి.