అదానీ గ్రూప్ వ్యవస్థాపకుడు గౌతమ్ అదానీ ఎఫ్వై25 జీతానికి సంబంధించిన వార్త ఒకటి బయటకు వచ్చింది. భారత దేశ సంపన్నుల జాబితాలో రెండో స్థాంలో ఉన్న అదానీ వేతనం.. ఇతర కంపెనీల వ్యవస్థాపకులతో పాటు తన సొంత కంపెనీల్లోని కీలక ఉద్యోగుల కన్నా చాలా తక్కువ అని ఇది సూచిస్తోంది.
బ్లూమ్బర్గ్ బిలియనీర్ ఇండెక్స్ ప్రకారం గౌతమ్ అదానీ సంపద 82.5 బిలియన్ డాలర్లు. ఇక ప్రపంచ ధనవంతుల జాబితా 2025లో ఆయన 20వ స్థానంలో ఉన్నారు.
అదానీ తనకున్న అనేక కంపెనీల్లో కేవలం రెండింటి నుంచే జీతాలు తీసుకుంటున్నారు.
గౌతమ్ అదానీ ఎఫ్వై2025 (మార్చ్ 31, 2025తో ముగిసిన ఆర్థిక సంవత్సరం)లో మొత్తం రూ .10.41 కోట్ల వేతనాన్ని అందుకున్నట్లు గ్రూప్ కంపెనీల తాజా వార్షిక నివేదికలు చెబుతున్నాయి. అదానీ ఎంటర్ప్రైజెస్ (ఏఈఎల్) నుంచి గౌతమ్ అదానీ రూ.2.54 కోట్లు జీతంగా తీసుకున్నారు. ఇక అదానీ పోర్ట్స్ అండ్ స్పెషల్ ఎకనామిక్ జోన్ (అదానీ పోర్ట్స్ లేదా ఏపీఎస్ఈజెడ్) నుంచి రూ.1.8 కోట్ల జీతం+ రూ.6.07 కోట్ల కమీషన్.. మొత్తం కలిపి రూ.7.87 కోట్లు పొందారు.
గత ఆర్థిక సంవత్సరం (2024 ఆర్థిక సంవత్సరం)లో అదానీ ఎంటర్ప్రైజ్(రూ.2.46 కోట్లు), అదానీ పోర్ట్స్ (రూ.6.8 కోట్లు) నుంచి తీసుకున్న రూ.9.26 కోట్ల ప్యాకేజీతో పోలిస్తే ఇది 12 శాతం అధికం!
కాగా.. ఇతర ప్రమోటర్ల మాదిరిగానే గౌతమ్ అదానీ కూడా గ్రూప్ కంపెనీలు ప్రతి సంవత్సరం రాబడులపై చెల్లించే డివిడెండ్ల ద్వారా కూడా సంపాదిస్తుండటం గమనార్హం.
గౌతమ్ అదానీ వేతనం భారతదేశంలోని ఇతర సహచరులు లేదా పెద్ద కుటుంబ యాజమాన్యంలోని సంస్థల అధిపతులతో పోలిస్తే చాలా తక్కువ!
రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముకేశ్ అంబానీ 2019 లో కోవిడ్ -19 మహమ్మారి నుంచి జీతం తీసుకోవడం లేదు. అయితే, అంతకు ముందు ఆయన తన ప్యాకేజీని రూ.15 కోట్లకు పరిమితం చేశారు.
భారతీ ఎయిర్టెల్ అధిపతి సునీల్ భారతి మిట్టల్ 2024 ఆర్థిక సంవత్సరంలో రూ .32.27 కోట్లు పొందారు (2025 ఆర్థిక సంవత్సరం వార్షిక నివేదిక ఇంకా విడుదల కాలేదు).
బజాజ్ ఇండస్ట్రీస్కి చెందిన రాజీవ్ బజాజ్ 2024 ఆర్థిక సంవత్సరంలో రూ .53.75 కోట్లు పొందారు (ఎఫ్వై 25 వార్షిక నివేదిక ఇంకా విడుదల కాలేదు).
హీరో మోటోకార్ప్కి చెందిన పవన్ ముంజాల్ 2024 ఆర్థిక సంవత్సరంలో రూ .109 కోట్ల వేతనాన్ని పొందారు.
2025 ఆర్థిక సంవత్సరంలో ఎల్ అండ్ టీ చైర్మన్ ఎస్ఎన్ సుబ్రహ్మణ్యన్ రూ.76.25 కోట్లు, ఇన్ఫోసిస్ సీఈఓ సలీల్ ఎస్ పరేఖ్ రూ.80.62 కోట్లను జీతంగా అందుకున్నారు.
ఈ అంకెల్లో డివిడెండ్ల నుంచి వచ్చే ఆదాయం లేదు.
గౌతమ్ అదానీ జీతం.. తన గ్రూప్ కంపెనీలకు చెందిన కనీసం ఒకరిద్దరు చీఫ్ ఎగ్జిక్యూటివ్ల కంటే తక్కువగా ఉందని ఓ నివేదిక పేర్కొంది. అదానీ ఎంటర్ప్రైజ్ సీఈఓ వినయ్ ప్రకాశ్కి రూ.69.34 కోట్ల వేతనం (4 కోట్ల జీతం+ 65 కోట్ల వరకు అలొవెన్స్లు) ఉంటుంది.
పునరుత్పాదక ఇంధన సంస్థ అదానీ గ్రీన్ ఎనర్జీ (ఏజీఈఎల్) ఎండీ వనీత్ ఎస్ జైన్కి రూ.11.23 కోట్లు, గ్రూప్ సీఎఫ్ఓ జుగేషిందర్ సింగ్కి రూ.10.4 కోట్లు జీతాలుగా లభించాయి. గౌతమ్ అదానీ కుమారుడు కరణ్ అదానీ ఏపీఎస్ఈజెడ్ నుంచి రూ.7.09 కోట్లు, కంపెనీ సీఈవో అశ్వనీ గుప్తా రూ.10.34 కోట్లు అందుకున్నారు.
సంబంధిత కథనం