FASTag new rules : అలర్ట్! ఆ ఫాస్టాగ్స్ని మార్చాల్సిందే- రేపటి నుంచి కొత్త రూల్స్ అమలు..
FASTag alert : ఫాస్టాగ్ యూజర్స్కి అలర్ట్! ఆగస్టు 1 నుంచి కొత్త ఫాస్టాగ్ రూల్స్ అమల్లోకి రానున్నాయి. పూర్తి వివరాలను ఇక్కడ తెలుసుకోండి.
టోల్ చెల్లింపు ప్రక్రియను మెరుగుపరిచేందుకు, టోల్ ప్లాజాల వద్ద రద్దీని తగ్గించేందుకు కొత్త నిబంధనలు ఆగస్ట్ 1న అమల్లోకి రానున్నాయి. ఈ రూల్స్ ప్రకారం ఫాస్టాగ్కి కచ్చితంగా కేవైసీ (నో యువర్ కస్టమర్) తప్పనిసరి. ఇందులో అక్టోబర్ 31 వరకు గడువు ఉంది. ఫాస్టాగ్ సేవలను అందించే సంస్థలు ఈ గడువులోగా మూడు నుంచి ఐదేళ్ల క్రితం జారీ చేసిన అన్ని ఫాస్టాగ్స్కి కేవైసీ పూర్తి చేయాల్సి ఉంటుంది.

ఫాస్టాగ్కు సంబంధించి నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పీసీఐ) కొత్త మార్గదర్శకాలను జారీ చేసింది. ఇందులో ముఖ్యమైనది ఫాస్టాగ్ కేవైసీ. ఈ ప్రక్రియ ఆగస్టు 1న ప్రారంభమవుతుంది. ఫాస్టాగ్ కస్టమర్లు ఎన్పీసీఐ మార్గదర్శకాలకు అనుగుణంగా ఈ వ్యవధిలో వారి కేవైసీని అప్డేట్ చేసేలా చూసుకోవాలి.
ఆగస్టు 1 నుంచి కొత్త ఫాస్టాగ్ నిబంధనలు..
ఐదేళ్లకు పైబడిన ఫాస్టాగ్లను కచ్చితంగా మార్చాలి.
మూడేళ్ల ఫాస్టాగ్లకు కేవైసీ అప్డేట్: మూడేళ్ల క్రితం జారీ చేసిన ఫాస్టాగ్ లకు కేవైసీని అప్డేట్ చేయాలి.
వాహన వివరాల అనుసంధానం: వాహన రిజిస్ట్రేషన్ నంబర్, ఛాసిస్ నంబర్ తప్పనిసరిగా ఫాస్టాగ్తో అనుసంధానం చేయాలి.
కొత్త వాహన రిజిస్ట్రేషన్ అప్డేట్: కొత్త వాహనాన్ని కొనుగోలు చేసిన 90 రోజుల్లోపు రిజిస్ట్రేషన్ నంబర్ని అప్డేట్ చేయండి.
డేటాబేస్ వెరిఫికేషన్: ఫాస్టాగ్ ప్రొవైడర్లు తమ డేటాబేస్లను వెరిఫై చేయాలి.
ఇదీ చూడండి:- FASTag : కారు అమ్మేస్తుంటే.. ఫాస్టాగ్ని ఏం చేయాలో తెలుసా?
ఫోటో అప్లోడ్ ఆవశ్యకత: కారు ముందువైపు, వెనుకవైపు స్పష్టమైన ఫోటోలను అప్లోడ్ చేయాలి.
మొబైల్ నంబర్ లింకింగ్: ఫాస్టాగ్ తప్పనిసరిగా మొబైల్ నంబర్కు లింక్ అయి ఉండాలి.
ఆగస్టు 1వ తేదీ నుంచి కంపెనీలు ఎన్పీసీఐ ఆదేశాలకు కట్టుబడి ఉండాలని, మూడు నుంచి ఐదేళ్లు దాటిన ఫాస్టాగ్లకు కేవైసీని అప్డేట్ చేయాలని, అక్టోబర్ 31లోగా ఐదేళ్లకు పైబడిన వాటిని భర్తీ చేయాలని కంపెనీలకు ఎన్హెచ్ఏఐ కోరింది. వాహన యజమానులు కూడా 2024 అక్టోబర్ 31లోగా తమ కేవైసీని పూర్తి చేయాల్సి ఉంటుంది.
ఇలా చేయకపోతే రెట్టింపు ఛార్జీలు..!
టోల్ వసూలుపై నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎన్హెచ్ఏఐ) కొన్ని రోజుల క్రితం కొత్త మార్గదర్శకాలను ప్రకటించింది. విండ్స్క్రీన్ మీద ఫాస్టాగ్ని అతికించని వాహనాలకు ఇకపై రెట్టింపు టోల్ ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. అంటే ఇక నుంచి ఫాస్టాగ్ని కచ్చితంగా విండ్స్క్రీన్కి అతికించాలి.
మూడేళ్ల క్రితం ప్రవేశపెట్టిన ఆర్ఎఫ్ఐడీ ఆధారిత టోల్ కలెక్షన్ సిస్టెమ్ ఫాస్టాగ్ జాతీయ రహదారులపై అన్ని వాహనాలు టోల్ ప్లాజాలను దాటడానికి తప్పనిసరి. విండ్ స్క్రీన్పై ఫాస్టాగ్లు లేని వాహనాలు టోల్ ప్లాజాల వద్ద ఆలస్యాన్ని కలిగిస్తాయని, ఇతరులకు అసౌకర్యాన్ని కలిగిస్తాయని ఎన్హెచ్ఏఐ తెలిపింది. అందుకే ఛార్జీలను రెట్టింపు చేయాలన్న నిర్ణయం తీసుకున్నట్టు వివరించింది.
భారతదేశంలోని జాతీయ రహదారులపై ఉన్న అన్ని టోల్ ప్లాజాలు ఈ మార్గదర్శకాలను అమలు చేయాల్సి ఉంటుంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
సంబంధిత కథనం