ఇండియాలో బెస్ట్ సెల్లింగ్ ఫ్యామిలీ ఎలక్ట్రిక్ స్కూటర్ అయిన ఏథర్ రిజ్టాపై బిగ్ అప్డేట్! ఈ ఈ-స్కూటర్ని లాంచ్ చేసిన ఏడాదిలోనే భారత మార్కెట్లో లక్ష యూనిట్లకు పైగా అమ్ముడుపోయినట్టు సంస్థ ప్రకటించింది. రిజ్టా అనేది.. బ్రాండ్కి మొదటి ఫ్యామిలీ ఎలక్ట్రిక్ స్కూటర్. గత ఏడాది లాంచ్ అయిన తర్వాత ఏథర్ మొత్తం అమ్మకాల పరిమాణంలో రిజ్టా వాటా 60 శాతంగా ఉందని ఏథర్ ఎనర్జీ తెలిపింది. ఈ నేపథ్యంలో ఏథర్ రిజ్టా వివరాలపై ఇక్కడ ఒక లుక్కేయండి..
ఏప్రిల్ 2024లో ఏథర్ కమ్యూనిటీ డే నాడు రిజ్టాను మొదటిసారిగా ఆవిష్కరించింది సంస్థ. దేశవ్యాప్తంగా జూన్ 2024 నుంచి ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ రిటైల్స్ ప్రారంభమయ్యాయి.
దేశ 2 వీలర్ ఈవీ సెగ్మెంట్లో ఏథర్ తన మార్కెట్ షేరును పెంచుకునేందుకు ఈ రిజ్టా దోహదపడింది. 2025 ఆర్థిక సంవత్సరం రెండొవ త్రైమాసికంలో డెలివరీల పెరుగుదల తరువాత గుజరాత్, రాజస్థాన్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఒడిశా, ఛత్తీస్గఢ్ వంటి ముఖ్యమైన రాష్ట్రాల్లో ఏథర్ మార్కెట్ వాటాలో గణనీయమైన పెరుగుదల నమోదైంది. అదనంగా, రిజ్టా, ఏథర్ 450 సిరీస్తో కలిసి క్యూ 4 ఎఫ్వై25 నాటికి దక్షిణ భారతదేశంలో ప్రముఖ బ్రాండ్ స్థానానికి ఎథర్ ఎదగడానికి దోహదపడిందని వాహన్ డేటా తెలిపింది.
ఈ మైలురాయిపై ఏథర్ ఎనర్జీ చీఫ్ బిజినెస్ ఆఫీసర్ రవ్నీత్ ఫొకేలా మాట్లాడుతూ.. “రిజ్టాతో లక్ష మైలురాయిని అందుకోవడం మాకు గొప్ప క్షణం. భారతీయ కుటుంబాల అవసరాలను తీర్చడంపై దృష్టి సారించి స్క్రాచ్ నుంచి నిర్మించిన రిజ్టా, మా పరిధిని విస్తరించడంలో, మరింత విస్తృతమైన వినియోగదారులతో కనెక్ట్ కావడంలో కీలక పాత్ర పోషించింది. ఇది కుటుంబ స్కూటర్కి అవసరమైన ప్రతిదాన్ని ఆచరణాత్మకంగా మిళితం చేస్తుంది. విశాలమైన, సౌకర్యవంతమైన సీటు, తగినంత స్టోరేజ్, భద్రతా లక్షణాలు, రోజువారీ ప్రయాణాన్ని అప్రయత్నంగా చేయడానికి విశ్వసనీయత.. అథర్కు ప్రసిద్ధి చెందిన గొప్ప డిజైన్లో ప్యాక్ చేయడం జరిగింది. ప్రారంభించిన ఒక సంవత్సరం కంటే తక్కువ సమయంలోనే, రిజ్టా బహుళ రాష్ట్రాల్లో మా మార్కెట్ వాటాను గణనీయంగా పెంచడానికి, మా వినియోగదారుల ప్రొఫైల్ని విస్తరించడానికి మాకు సహాయపడింది,” అని అన్నారు.
ఫ్యామిలీ ఎలక్ట్రిక్ స్కూటర్ ఏథర్ రిజ్టా ధర రూ.1.10 లక్షల నుంచి ప్రారంభమై రూ.1.49 లక్షల వరకు ఉంటుంది. రెండు ధరలు ఎక్స్-షోరూమ్.
ఏథర్ ఎనర్జీ రిజ్టాలో 2.9 కిలోవాట్ల బ్యాటరీని అమర్చింది. దీనిని ఒక్కసారి ఛార్జ్ చేస్తే 123 కిలోమీటర్ల రేంజ్ని ఇస్తుంది. ఇక 3.7 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్ ఉన్న వెర్షన్ 159 కిలోమీటర్ల రేంజ్ని అందిస్తుంది. రెండు మోడళ్లు 450 ఎస్ ఎలక్ట్రిక్ స్కూటర్లో ఉపయోగించిన ఒకే పీఎంఎస్ ఎలక్ట్రిక్ మోటారుతో పనిచేస్తాయి. రిజ్టాలోని మోటారు కేవలం 3.7 సెకన్లలో 0 నుంచి 40 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. గరిష్టంగా గంటకు 80 కిలోమీటర్ల వేగాన్ని చేరుకోగలదు.
స్టాండర్డ్ ఛార్జర్లను ఉపయోగించినప్పుడు 2.9 కిలోవాట్ల బ్యాటరీని పూర్తిగా క్షీణించిన స్థితి నుంచి 5 గంటల 45 నిమిషాల్లో 80 శాతానికి ఛార్జ్ చేయవచ్చని, 3.7 కిలోవాట్ల వేరియంట్ పూర్తి ఛార్జ్ చేయడానికి 4 గంటల 30 నిమిషాలు పడుతుందని ఏథర్ వెల్లడించింది.
అంతేకాక, పెద్ద బ్యాటరీ ఫాస్ట్ ఛార్జింగ్ సామర్థ్యాలను కలిగి ఉంటుంది. ఏథర్ గ్రిడ్ని ఉపయోగించడం ద్వారా వినియోగదారులు కేవలం 10 నిమిషాల్లో 15 కిలోమీటర్ల పరిధిని భర్తీ చేయవచ్చు.
అంతేకాదు.. సెగ్మెంట్లోనే భారీ సీటింగ్ కెపాసిటీతో నిజమైన ఫ్యామిలీ ఎలక్ట్రిక్ స్కూటర్గా దూసుకెళుతోంది ఈ ఏథర్ రిజ్టా.
సంబంధిత కథనం