డబ్బు సంపాదించడం అంతా తేలికైన విషయం కాదు. ఈ డిజిటల్ యుగంలో ఉన్న డబ్బును కాపాడుకోవడం కూడా చాలా పెద్ద టాస్క్. డబ్బు ఊరికే మంచులా కరిగిపోతుంది. అంటే ఖర్చు అయిపోతుంది. ఎలా అయిపోతుందో కూడా మీకు తెలియదు. పెట్టుబడి పెట్టడానికి మార్గాలను వెతకాలి. కానీ అందులోనూ తెలిసి తెలియక తప్పులు చేయకూడదు. కొన్ని తప్పుల వల్ల డబ్బు వృథా అవుతుంది. మళ్లీ సున్నా నుంచి మెుదలుపెట్టాలి. మీకు ఈ కింది ఎగ్జాంపుల్స్ ఉపయోగపడతాయి చదవండి..
మహేంద్ర వయస్సు 29 తనకు జీతం వస్తుంది కదా అని.. జీరో వడ్డీ ఈఎంఐ ప్లాన్లతో అనేక వస్తువులను కొనుగోలు చేశాడు. కారు, మొబైల్, టీవీ ఇలా మొదలైనవి. కానీ అతడు అనుకోకుండా ఉద్యోగం కోల్పోయాడు. ఈఎంఐ చెల్లింపులు ఆలస్యం అయ్యాయి. ఫలితంగా క్రెడిట్ స్కోరు దెబ్బతింది. కొత్త ఉద్యోగం పొందిన తర్వాత హోమ్ లోన్ కోసం అప్లై చేస్తే.. తిరస్కరించారు. డబ్బు నిర్వహణలో అత్యవసర నిధి అనే ఆయుధం లేకుండా ఉండకూడదు. ఏదైనా చిన్న ఆర్థిక సమస్య పెద్ద విపత్తుగా మారవచ్చు. ఎమర్జెన్సీ ఫండ్ ముఖ్యం.
ప్రకాశ్ చాలా నెలలుగా మ్యూచువల్ ఫండ్లో సిప్ ప్రారంభించాలని అనుకున్నాడు. ప్రతి నెలా యాప్ను తెరిచి క్లోజ్ చేస్తున్నాడు. అతని సహోద్యోగి రామ్.. 2019లో నెలకు రూ5,000 సిప్ను ప్రారంభించాడు. 2025 నాటికి రూ.6.5 లక్షలకు పైగా సంపాదించాడు. ప్రకాశ్ ఇంకా మెుదలుపెట్టలేదు. ఇప్పుడు పెడితే ఎప్పుడో వస్తాయి అన్నట్టుగా ఉండేవాడు.
సంజీవ్ అనేక వ్యక్తి వయసు 27 ఏళ్లు.. టెలిగ్రామ్ గ్రూప్లో వచ్చిన టిప్స్తో మొదటి పెట్టుబడి పెట్టాడు. ఈ స్టాక్ రూ. 200కి అమ్ముడవుతోంది, ఇప్పుడే కొనండి.. త్వరలో పెరిగే అవకాశం ఉంది.. అని ఒక సందేశాన్ని చూశాడు. ఆలోచించకుండా.. తన దగ్గర ఉన్న రూ.30 వేలు పెట్టుబడి పెట్టాడు. మొదట్లో స్టాక్ పెరిగినట్లు కనిపించింది. కానీ కొన్ని రోజుల్లోనే అది క్రాష్ అయింది. కొనుగోలుదారులు ఎవరూ లేరు. కాబట్టి అమ్మకం జరగలేదు. టిప్ ఇచ్చిన గ్రూప్ కూడా మళ్లీ కనిపించలేదు. సంజీవ్కి రూ.30 వేలు లాస్.
ఇది భావోద్వేగ ఉచ్చులో పడటం వల్ల జరిగింది. కంపెనీ నేపథ్యాన్ని చెక్ చేయకుండా తొందరపడి నిర్ణయం తీసుకుంటే భారీ నష్టం కలుగుతుంది. పెట్టుబడి పెట్టేముందు రిసెర్చ్ చేయాలి. చిట్కాలను చూసి పెట్టుబడి పెట్టకూడదు.
డబ్బు విషయంలో భావోద్వేగాల ఉచ్చులో పడటం మీ జీవితాన్ని నాశనం చేస్తుంది. పైన చెప్పిన ఉదాహరణల్లో తమ భావోద్వేగాల ఆధారంగా నిర్ణయాలు తీసుకున్నారు. మనీ విషయంలో ప్రాక్టికల్గా ఆలోచించి, క్రమశిక్షణతో ఉంటేనే మంచిది.