ఎలోన్ మస్క్‌కు భారత్‌పై లేని ఇంట్రస్ట్.. ఇక్కడ టెస్లా ఎలక్ట్రిక్ కార్ల తయారీ లేనట్టే.. కానీ దానికి ఓకే!-elon musk tesla not ready to manufacturing electric cars in india interested in showrooms says union minister ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  ఎలోన్ మస్క్‌కు భారత్‌పై లేని ఇంట్రస్ట్.. ఇక్కడ టెస్లా ఎలక్ట్రిక్ కార్ల తయారీ లేనట్టే.. కానీ దానికి ఓకే!

ఎలోన్ మస్క్‌కు భారత్‌పై లేని ఇంట్రస్ట్.. ఇక్కడ టెస్లా ఎలక్ట్రిక్ కార్ల తయారీ లేనట్టే.. కానీ దానికి ఓకే!

Anand Sai HT Telugu

భారతదేశంలో కార్లను తయారు చేయడంపై టెస్లా ఆసక్తి చూపడం లేదు. ఎలోన్ మస్క్ కంపెనీ కేవలం షోరూమ్‌లు తెరిచేందదుకు మాత్రమే ఆలోచన చేస్తుంది.

టెస్లా కార్ల తయారీ

టెస్లా భారతదేశంలో ఎలక్ట్రిక్ కార్లను తయారు చేయడంలో ఆసక్తి చూపించడం లేదు. ఈ విషయాన్ని కేంద్ర మంత్రి హెచ్‌డీ కుమారస్వామి చెప్పారు. షోరూమ్‌లను తెరవడంపై మాత్రమే టెస్లాకు ఆసక్తి ఉందని అన్నారు. దేశంలో ఈవీల తయారీని పెంచడానికి కేంద్ర ప్రభుత్వం కంపెనీలకు రూ.4,150 కోట్ల విలువైన భారీ పెట్టుబడి ప్రణాళికను ప్రకటించింది. ఇది ప్రపంచ వాహన తయారీదారులను ఆకర్షించడం లక్ష్యంగా పెట్టుకుంది.

తయారీకి లేని ఆసక్తి

అయితే దీనిపై తాజాగా కేంద్ర భారీ పరిశ్రమల మంత్రి కుమారస్వామి మాట్లాడారు. భారతదేశంలో ఎలక్ట్రిక్ కార్లను తయారు చేయడంలో టెస్లాకు ఆసక్తి లేదని, షోరూమ్‌లను ఏర్పాటు చేయడంపై మాత్రమే ఆసక్తి చూపుతోందని అన్నారు. విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటే టెస్లా కార్ల ధర ఎక్కువగా ఉంటుంది. తక్కువ ధరకే అధిక నాణ్యత గల ఎలక్ట్రిక్ కారు లభిస్తుందని ఆశించిన వారికి ఇది చేదు వార్త అవుతుంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా ఎలోన్ మస్క్ యాజమాన్యంలోని టెస్లా కంపెనీ భారత్‌లో తయారీ ప్లాంట్ పెట్టడాన్ని వ్యతిరేకించారు.

గతంలో ట్రంప్ కామెంట్స్

మేక్ ఇన్ ఇండియా కింద భారతదేశంలో కార్లను అసెంబుల్ చేయడం లేదా తయారు చేయాలనే ప్రణాళికను విరమించుకోవాలని ట్రంప్ సూచించారు. భారతదేశంలో తయారీ స్థావరాన్ని ఏర్పాటు చేయడం చాలా అన్యాయం అని అన్నారు. టెస్లా ఇప్పటికే భారత మార్కెట్లోకి ప్రవేశించడానికి షోరూమ్ స్థానాలను సంపాదించింది. 25 కంటే ఎక్కువ మంది ఉద్యోగుల నియామకానికి ప్రకటన చేసింది.

ఈవీల ఉత్పత్తికి ప్లాన్

దేశవ్యాప్తంగా ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహించడానికి రూ.4,150 కోట్ల పెట్టుబడి అవసరమని కేంద్రం చెబుతోంది. ఎలక్ట్రిక్ వాహనాలను రోడ్లపైకి తీసుకురావడానికి, దేశంలో పెద్ద ఎత్తున ఎలక్ట్రిక్ కార్ల ఉత్పత్తిని ప్రోత్సహించడం ఈ పథకం లక్ష్యం. ఈ పథకంలో భాగంగా పెట్టుబడి పెట్టిన కంపెనీలకు దిగుమతి సుంకాల్లో కూడా కోత ఉంటుంది.

ఈ ప్రాజెక్ట్ కోసం అప్లికేషన్ పోర్టల్ త్వరలో తెరుస్తారు. ఇది ప్రారంభ దశలో 120 రోజులు తెరిచి ఉంటుంది. భవిష్యత్తులో అవసరమైనప్పుడు మంత్రిత్వ శాఖ దానిని తిరిగి తెరవవచ్చు. ఈ పథకం కింద దరఖాస్తులు మార్చి 15, 2026 వరకు స్వీకరిస్తారు.

ఆనంద్ సాయి హెచ్.టి తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్. నేషనల్, బిజినెస్ వార్తలు రాస్తారు. గతంలో ఎంటర్‌టైన్మెంట్, లైఫ్‌స్టైల్ రాసేవారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభం ఉంది. కాకతీయ యూనివర్సిటీలో మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం పీజీ చేశారు. గతంలో నవతెలంగాణ, ఈనాడు, ఈటీవీ భారత్, ఏబీపీ దేశంలో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. 2022లో హెచ్.టి తెలుగులో చేరారు.