తన ఎక్స్ (ట్విట్టర్)ని టెక్ బిలియనీర్ ఎలాన్ మస్క్ అమ్మేశారు. అయితే అది మరొకరికి కాదు! తన సొంత ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) కంపెనీ అయిన ఎక్స్ ఏఐ (xAI)కి విక్రయించారు మస్క్. ఆల్ స్టాక్ డీల్లో భాగంగా ఎక్స్ని 33 బిలియన్ డాలర్లకు అమ్మేసినట్టు మస్క్ ప్రకటించారు.
"ఎక్స్ఏఐ, ఎక్స్ ఫ్యూచర్ ఒకదానితో మరొకటి ముడిపడి ఉంది. డేటా, మోడల్స్, కంప్యూటింగ్, డిస్ట్రిబ్యూషన్, టాలెంట్ని కలపడానికి మేము ఈ రోజు అధికారికంగా చర్య తీసుకుంటాము," అని మస్క్ గతంలో ట్విట్టర్గా పిలిచే ఎక్స్లో పోస్ట్ చేశారు.
ఎక్స్ఏఐ- ఎక్స్ కోసం 45 బిలియన్ డాలర్లు చెల్లిస్తుంది. ఇది 2022లో మస్క్ చెల్లించిన దానికంటే కొంచెం ఎక్కువ. కానీ కొత్త ఒప్పందంలో 12 బిలియన్ డాలర్ల రుణం ఉంది.
ఈ చర్య "ఎక్స్ఎఐ అధునాతన ఏఐ సామర్థ్యాన్ని, నైపుణ్యాన్ని ఎక్స్కి చెందిన భారీ పరిధితో కలపడం ద్వారా అపారమైన సామర్థ్యాన్ని ఓపెన్ చేస్తుంది," అని మస్క్ అన్నారు. ఈ డీల్ భాగంగా ఎక్స్ఏఐని 80 బిలియన్ డాలర్లు, ఎక్స్ని 33 బిలియన్ డాలర్ల వద్ద వాల్యూ చేసినట్టు వెల్లడించారు. రెండేళ్ల క్రితం స్థాపించినప్పటి నుంచి ఎక్స్ఏఐ ప్రపంచంలోనే ప్రముఖ ఏఐ ల్యాబ్లలో ఒకటిగా అవతరించిందని, మునుపెన్నడూ లేనంత వేగంగా మోడల్స్, డేటా సెంటర్లను నిర్మిస్తోందని స్పష్టం చేశారు.
స్పేస్ఎక్స్ సీఈఓగా, అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు సలహాదారుగా ఉన్న మస్క్ 2022లో 44 బిలియన్ డాలర్లకు ట్విట్టర్ని కొనుగోలు చేసి, దానికి ఎక్స్ అని పేరు మార్చారు. పేరు మాత్రమే కాదు సంస్థలో అనేక మార్పులు తీసుకొచ్చారు. విద్వేషపూరిత ప్రసంగం, తప్పుడు సమాచారం, యూజర్ వెరిఫికేషన్ వంటి పాలసీలను రూపొందించారు. 80 శాతం మంది ఉద్యోగులను తొలగించారు.
తాజా ప్రకటనో ఎక్స్ అనే సంస్థ- ఎక్స్ఏఐ స్టార్టప్ కిందకు చేరుతుంది. ఓపెన్ఏఐతో పోటీ పడేందుకు 2023లో ఎక్స్ఏఐని మస్క్ స్థాపించారు.
కాగా ఎక్స్లో తక్షణ మార్పులను ఎలాన్ మస్క్ ప్రకటించలేదు. అయినప్పటికీ ఎక్స్ఎఐ గ్రోక్ చాట్బాట్ ఇప్పటికే ఎక్స్తో ఇంటిగ్రేట్ అయిపోయిందని సమాచారం.
ఈ చర్య ఎక్స్ వినియోగదారులను ప్రభావితం చేస్తుందో లేదో స్పష్టంగా తెలియదు. ఎక్స్ఏఐ ఇప్పటికే తన కృత్రిమ మేధస్సు నమూనాలకు శిక్షణ ఇవ్వడానికి ఎక్స్ యూజర్ పోస్టుల నుంచి డేటాను ఉపయోగిస్తుంది. ఎక్స్ వినియోగదారులకు దాని ఏఐ చాట్బాట్ గ్రోక్కు యాక్సెస్ లభిస్తుంది.
1 ట్రిలియన్ డాలర్ల భారీ తగ్గింపును పర్యవేక్షించిన మస్క్ మే నెలాఖరులో డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫీషియెన్సీ (డీఓజీ)లో తన బాధ్యతల నుంచి వైదొలగాలని యోచిస్తున్నట్లు ప్రకటించిన కొద్ది గంటల్లోనే మస్క్ ఈ విలీన ప్రకటన చేయడం గమనార్హం. 130 రోజుల కాలానికి 'ప్రత్యేక ప్రభుత్వ ఉద్యోగి'గా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నేతృత్వంలోని అమెరికా ప్రభుత్వం తీసుకొచ్చిన మస్క్ డీవోజీ చీఫ్గా ప్రభుత్వ వ్యయాన్ని తగ్గించే ప్రయత్నాలకు నేతృత్వం వహిస్తున్నారు.
ట్రంప్ పరిపాలనకు, టెక్ పరిశ్రమకు పెద్ద కేంద్ర బిందువైన కృత్రిమ మేధ రంగంలో అగ్రగామిగా నిలదొక్కుకునేందుకు మస్క్ కృషి చేస్తున్నారు. ఈ ఏడాది ప్రారంభంలో, చాట్జీపీటీ తయారీదారు ఓపెన్ఎఐని దాదాపు 100 బిలియన్ డాలర్లకు కొనుగోలు చేయడానికి ప్రయత్నిస్తున్న పెట్టుబడిదారుల బృందానికి మస్క్ నేతృత్వం వహించారు. ఇది మస్క్- ఓపెన్ఏఐ సీఈఓ శామ్ ఆల్ట్మన్ మధ్య దీర్ఘకాలిక పోటీకి దారి తీసింది.
సంబంధిత కథనం