చైనా వస్తువులపై అమెరికా మరోసారి సుంకాలను పెంచింది. తాజా పెంపుతో చైనా ఉత్పత్తులపై యూఎస్ విధించిన సుంకాలు 245 శాతానికి పెరిగాయి. టారిఫ్ లపై చర్చలకు రావాలని అమెరికా, ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చైనాపై ఒత్తిడి పెంచుతున్నారు. 'బంతి చైనా కోర్టులో ఉంది. చైనా మనతో ఒప్పందం చేసుకోవాల్సిన అవసరం ఉంది. వారితో ఒప్పందం కుదుర్చుకోవాల్సిన అవసరం మనకు లేదు' అని వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లీవిట్ అన్నారు.
అమెరికాతో చర్చలు జరిపి సుంకాలపై ఒప్పందం కుదుర్చుకోవాల్సిన అవసరం చైనాకే ఉందని అమెరికా వ్యాఖ్యానించింది. తమకు మిగతా దేశాల మాదిరిగానే చైనా కూడా అని, ఆ దేశంతో తమ వాణిజ్యంతో ప్రత్యేకత ఏమీ లేదని స్పష్టం చేసింది.
చైనా ఉత్పత్తులపై అమెరికా సుంకాలను మరోసారి పెంచడంపై చైనా స్పందించారు. అమెరికా నిజంగా చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకోవాలనుకుంటే, తమపై ఒత్తిడిని ఉపయోగించడం మానేయాలి. బెదిరింపులు, బ్లాక్ మెయిల్ లను ఆపాలి’’ అని చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి లిన్ జియాన్ వ్యాఖ్యానించారు. ఏ చర్చ జరగాలన్నా అది సమానత్వం, గౌరవం, పరస్పర ప్రయోజనం ప్రాతిపదికలుగా ఉండాలని లిన్ అన్నారు.
అంతర్జాతీయ వాణిజ్య సంప్రదింపుల ప్రతినిధి, ఉప వాణిజ్య మంత్రిగా లీ చెంగ్ గాంగ్టోను చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ నియమించారు. ట్రంప్ తొలి టర్మ్ లో వాణిజ్య చర్చల్లో ప్రధాన పాత్ర పోషించిన వాంగ్ షౌవెన్ స్థానంలో ఆయన నియమితులయ్యారు. అమెరికా కంటే రాజకీయంగా, ఆర్థికంగా సుస్థిర భాగస్వామిగా తనను తాను ప్రమోట్ చేసుకునేందుకు చైనా ప్రపంచ వ్యాప్తంగా దూకుడు ప్రదర్శిస్తోంది. ఆ మిషన్ ను దృష్టిలో ఉంచుకుని చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ ప్రస్తుతం వారం రోజుల పాటు ఆగ్నేయాసియాలో పర్యటిస్తున్నారు. అమెరికాకు బోయింగ్ జెట్ ల డెలివరీలను చేపట్టవద్దని విమానయాన సంస్థలను బీజింగ్ మంగళవారం ఆదేశించింది.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వాణిజ్య లోటు ఉన్న డజన్ల కొద్దీ దేశాలపై పరస్పర సుంకాలు విధించారు. వాణిజ్య ఒప్పందం కోసం పలు దేశాలు అమెరికా యంత్రాంగంతో చర్చలు ప్రారంభించడంతో 90 రోజుల పాటు సుంకాలను నిలిపివేయాలని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిర్ణయించారు. కొత్త వాణిజ్య ఒప్పందాలపై చర్చించేందుకు ఇప్పటికే 75కు పైగా దేశాలు సంప్రదించాయని వైట్ హౌస్ ఫ్యాక్ట్ షీట్ తెలిపింది. ప్రస్తుతానికి అమెరికా దిగుమతులపై 10 శాతం బేస్ లైన్ టారిఫ్ వర్తిస్తుంది.
సంబంధిత కథనం