Subsidy spends: 2025 ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు ప్రభుత్వం సబ్సిడీల కోసం మొత్తం రూ .3.07 లక్షల కోట్లు ఖర్చు చేసింది. అందులో ఆహార సబ్సిడీలే 50 శాతం పైగా ఉన్నాయి. బ్యాంక్ ఆఫ్ బరోడా నివేదిక ప్రకారం, 2025 ఆర్థిక సంవత్సరం మొదటి తొమ్మిది నెలల్లో ప్రభుత్వం చేసిన మొత్తం సబ్సిడీ వ్యయంలో ఆహార సబ్సిడీ 50 శాతానికి పైగా ఉంది.
ఈ ఆర్థిక సంవత్సరం మొదటి 9 నెలల్లో మొత్తం సబ్సీడీ వ్యయం రూ.3.07 లక్షల కోట్లు. గత ఆర్థిక ఏడాది ఇదే సమయంలో కేంద్రం ఖర్చు చేసిన దానికంటే ఇది చాలా ఎక్కువ. 2024 ఆర్థిక సంవత్సరం మొదటి తొమ్మిది నెలల్లో కేంద్ర ప్రభుత్వ సబ్సిడీ వ్యయం రూ.2.77 లక్షల కోట్లుగా ఉంది. అయితే, 2022 ఆర్థిక సంవత్సరం ఏప్రిల్-డిసెంబర్ లో ఖర్చు చేసిన రూ .3.51 లక్షల కోట్ల కంటే ఇది తక్కువగానే ఉంది.
ప్రభుత్వం మొత్తం సబ్సిడీ వ్యయంలో ఆహార సబ్సిడీల ఖర్చు చాలా ఎక్కువ. బ్యాంక్ ఆఫ్ బరోడా నివేదిక ప్రకారం 2025 ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు కేంద్రం ఆహార సబ్సిడీల కోసం రూ .1.64 లక్షల కోట్లు కేటాయించింది. ఇది గత ఏడాది ఇదే కాలంలో వెచ్చించిన రూ .1.34 లక్షల కోట్లతో పోలిస్తే ఎక్కువ, కానీ 2022 ఏప్రిల్-డిసెంబర్లో నమోదైన రూ .1.68 లక్షల కోట్ల కంటే కొంచెం తక్కువ.
ప్రభుత్వం ఆహార సబ్సిడీలపై వ్యయాన్ని పెంచినప్పటికీ, ఎరువుల విషయంలో పరిస్థితి భిన్నంగా ఉంది. 2025 ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు ఎరువుల సబ్సిడీలపై వ్యయం కొద్దిగా తగ్గింది. 2024 ఏప్రిల్-డిసెంబర్ మధ్య ప్రభుత్వం ఎరువుల సబ్సిడీల కోసం రూ .1.36 లక్షల కోట్లు ఖర్చు చేసింది. అంతకుముందు సంవత్సరంలో రూ .1.41 లక్షల కోట్లు, 2022 ఏప్రిల్-డిసెంబర్ లో రూ .1.81 లక్షల కోట్లు కేంద్రం ఖర్చు చేసింది.