ఎలక్ట్రిక్ కార్లకు రోజురోజుకు డిమాండ్ పెరుగుతుండటంతో మార్కెట్లో సందడి చేస్తున్నాయి. ప్రస్తుతం వివిధ దేశాల కంపెనీల కార్లు సైతం భారత మార్కెట్లో దుమ్ములేపుతున్నాయి. అందులో ఒకటి చైనాకు చెందిన బీవైడీ. BYD తన సీలియన్ 7 కారును భారత్ మొబిలిటీ ఎక్స్పో 2025లో ప్రదర్శించింది. తరువాత ఈ సంవత్సరం ఫిబ్రవరిలో భారతదేశంలో రూ. 48.90 లక్షల (ఎక్స్-షోరూమ్) ధరకు విడుదల చేసింది.
ఈ ఎలక్ట్రిక్ క్రాస్ఓవర్ ఇటీవల యూరో NCAP ద్వారా క్రాష్ టెస్ట్ చేశారు. 5 స్టార్ సేఫ్టీ రేటింగ్ను పొందింది. వయోజన ప్రయాణీకుల భద్రతలో 87 శాతం, పిల్లల ప్రయాణికుల భద్రతలో 93 శాతం స్కోర్ చేయడం ద్వారా అందరినీ ఆశ్చర్యపరిచింది.
బీవైడీ కారు ఆకట్టుకునే భద్రతా లక్షణాలను కలిగి ఉంది. అనేక ఇతర కార్ల మాదిరిగా కాకుండా ఈ కారులో 11 ఎయిర్బ్యాగ్లు అమర్చబడి ఉన్నాయి. బీవైడీ సీలియన్ 7 ఎలక్ట్రిక్ ఎస్యూవీ ప్రీమియం, పెర్ఫార్మెన్స్ అనే రెండు వేరియంట్లలో కొనుగోలుకు అందుబాటులో ఉంది. ప్రీమియం మోడల్ ధర రూ. 48.90 లక్షలు కాగా, పెర్ఫార్మెన్స్ మోడల్ ధర రూ. 54.90 లక్షలు(ఎక్స్-షోరూమ్). ప్రీమియం వేరియంట్ ఒక్కసారి ఛార్జ్ చేస్తే 567 కి.మీ వరకు ప్రయాణించగలదని, పెర్ఫార్మెన్స్ వేరియంట్ ఒక్కసారి ఛార్జ్ చేస్తే 542 కి.మీ దూరం ప్రయాణించగలదని కంపెనీ పేర్కొంది. ఈ కారు 11 ఎయిర్బ్యాగ్లు, లెవల్ 2 ఏడీఏఎస్ సూట్తో వస్తుంది. ఆటోమేటిక్ ఎమర్జెన్సీ బ్రేకింగ్, లేన్ కీప్ అసిస్ట్, అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్ ఉన్నాయి.
ప్రీమియం వేరియంట్లో సింగిల్ ఎలక్ట్రిక్ మోటార్, రియర్ వీల్ డ్రైవ్ సెటప్ 308బీహెచ్పీ పవర్, 380 ఎన్ఎం టార్క్ ఉన్నాయి. పెర్ఫార్మెన్స్ వేరియంట్ ఆల్-వీల్ డ్రైవ్ వ్యవస్థను కలిగి ఉంది. 523 బీహెచ్పీ శక్తిని, 690 ఎన్ఎం టార్క్ను ఉత్పత్తి చేస్తుంది.
కొత్త బీవైడీ సీలియన్ 7 ఎలక్ట్రిక్ ఎస్యూవీ క్యాబిన్లో ఫ్లాట్-బాటమ్ స్టీరింగ్ వీల్, 10.25-అంగుళాల పూర్తి డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, 15.6-అంగుళాల రొటేటింగ్ టచ్స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, నప్పా లెదర్ అప్ హోల్స్టర్, 12-స్పీకర్ ఆడియో సిస్టమ్ ఉన్నాయి. దీనితో పాటు కారులో పనోరమిక్ సన్రూఫ్, వెంటిలేషన్, సర్దుబాటు చేయగల ముందు సీట్లు, డ్యూయల్-జోన్ ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, హెడ్-అప్ డిస్ప్లే, ఏడీఏఎస్ సూట్ కూడా ఉన్నాయి.