Electric Vehicles : బడ్జెట్లో కీలక ప్రకటన.. ఇక తక్కువ ధరకే ఎలక్ట్రిక్ వాహనాలు!
Budget 2025 Electric Vehicles : ఇప్పటికే ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహించేందుకు కేంద్రం పథకాలను ప్రవేశపెట్టింది. తాజాగా బడ్జెట్లో ఈవీలకు సంబంధించి కీలక ప్రకటన చేశారు. దీనితో తక్కువ ధరకే ఎలక్ట్రిక్ వాహనాలు రానున్నాయి.
బడ్జెట్ 2025లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఎలక్ట్రిక్ వాహనాలకు సంబంధించి కీలక ప్రకటన చేశారు. ఎలక్ట్రిక్ వాహనాల బ్యాటరీల తయారీకి అవసరమైన కీలకమైన ఖనిజాలపై ప్రాథమిక కస్టమ్స్ సుంకాన్ని(BCD) తగ్గించాలని నిర్మలా సీతారామన్ ప్రతిపాదించారు. ఈ నిర్ణయంతో ఎలక్ట్రిక్ వాహనాలను మరింత తక్కువ ధరకు వచ్చేందుకు అవకాశం ఉంటుంది. 2030 నాటికి ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాలను పెంచాలని ప్రభుత్వం చూస్తోంది.

ఎలక్ట్రిక్ వాహనాల దేశీయ తయారీని ప్రోత్సహించడానికి.. కోబాల్ట్ పౌడర్, లిథియం-అయాన్ బ్యాటరీ వ్యర్థాలు, స్క్రాప్, సీసం, జింక్.., పన్నెండు ఇతర కీలకమైన ఖనిజాలపై ప్రాథమిక కస్టమ్స్ డ్యూటీ నుండి పూర్తి మినహాయింపుతో సహా పన్ను ప్రోత్సాహకాలను ప్రవేశపెట్టారు.
అవసరమైన బ్యాటరీ ఉత్పత్తి పరికరాలపై దిగుమతి సుంకాలను తగ్గించాలని ప్రభుత్వం అనుకుంటోంది. ఈవీ బ్యాటరీ ఖర్చులను తగ్గించడం ద్వారా ఎలక్ట్రిక్ వాహనాలను మరింత తక్కువ ధరకే వచ్చేలా చేయాడాన్ని లక్ష్యంగా పెట్టుకుంది ప్రభుత్వం. నిర్వహణ ఖర్చులలో తగ్గుదలతో భారతదేశంలో ఈవీ బ్యాటరీ పరిశ్రమ విస్తరణకు అవకాశం ఉంటుంది. బడ్జెట్లో తాజా నిర్ణయం దేశీయ ఉత్పత్తి సామర్థ్యాలను కూడా పెంచుతుంది.
స్థానికంగా బ్యాటరీ పరిశ్రమను పెంపొందించడం ద్వారా ఎలక్టిక్ వాహనాలు తక్కువ ధరకే రానున్నాయి. ఎలక్ట్రిక్ వాహనాల తయారీలో ఉపయోగించే పదార్థాలపై ఆధారపడే పరిశ్రమలకు ఖర్చులు తగ్గనున్నాయి. కేంద్ర ప్రభుత్వ నిర్ణయంతో ఈవీ బ్యాటరీలు తక్కువ ధరకే దొరుకుతాయి. ఇది ఉత్పత్తి ఖర్చులు తగ్గించి.. దేశీయ తయారీని పెంచుతుంది.
లిథియం-అయాన్ బ్యాటరీలపై కస్టమ్స్ డ్యూటీ తగ్గింపు, భారతదేశ ఈవీ వ్యవస్థను బలోపేతం చేయడంలో కీలకమైన ముందడుగు. ఈవీ బ్యాటరీ ఉత్పత్తిలో ఉపయోగించే 35 వస్తువులు, మొబైల్ ఫోన్ బ్యాటరీ తయారీకి 28 వస్తువులపై సుంకం తగ్గించడం కారణంగా కంపెనీలు ఇప్పుడు బ్యాటరీ ఉత్పత్తికి అవసరమైన యంత్రాలు, సాధనాలను అదనపు ఛార్జీలు లేకుండా దిగుమతి చేసుకోవచ్చు. ఈ విధానం భారతదేశంలో తమ తయారీ కార్యకలాపాలను విస్తరించడానికి ప్రధాన కంపెనీలను ప్రోత్సహిస్తుందని భావిస్తున్నారు.
బడ్జెట్లో ప్రకటించిన తాజా నిర్ణయంతో చౌక ధరలో ఈవీ బ్యాటరీలు దొరుకుతాయి. ఎలక్ట్రిక్ వాహనాలు వినియోగదారులకు తక్కువ ధరకే వస్తాయి. తక్కువ ఉత్పత్తి ఖర్చులు దేశీయ తయారీని పెంచుతాయి. ఉద్యోగాలను సృష్టిస్తాయి. చైనా వంటి దేశాల నుండి దిగుమతులపై భారతదేశం ఆధారపడటం తగ్గుతుంది.