కొత్త ప్రభుత్వం ఏర్పడిన తరువాత ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ నెలాఖరులో 2024-25 కేంద్ర బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు. ఈ ఏడాది ఆరంభం నుంచి వేతన జీవులు పన్ను విషయంలో కొంత ఉపశమనం, రాయితీలు ఆశిస్తున్నారు. అయితే మధ్యంతర బడ్జెట్ లో శ్రామికులకు నిరాశే ఎదురైంది.
వేతన పన్ను చెల్లింపుదారులకు పన్ను ఉపశమనం కల్పించడం వల్ల వ్యయం పెరుగుతుందని, అంతిమంగా వినియోగం పెరుగుతుందని నిపుణులు భావిస్తున్నారు. పన్ను ఉపశమన చర్యలను ప్రభుత్వం పరిశీలిస్తోందని, బడ్జెట్ సమర్పణకు ముందే తుది నిర్ణయం వెలువడే అవకాశం ఉందని ఆర్థిక మంత్రిత్వ శాఖ వర్గాలు సూచించాయి. అయితే ఈసారి బడ్జెట్లో ఉద్యోగస్తులకు లబ్ధి చేకూరేలా మూడు ప్రకటనలు వెలువడే అవకాశం ఉంది. అవి ఏంటో చూద్దాం..
1. కొత్త పన్ను విధానంలో పన్ను చెల్లింపుదారులకు స్టాండర్డ్ డిడక్షన్ పరిమితిని పెంచే అవకాశాలను ఆర్థిక మంత్రిత్వ శాఖ పరిశీలిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే, పాత పన్ను విధానంలో ఈ విషయంలో మార్పు వస్తుందనే ఆశలు పెద్దగా లేవు. వేతన జీవులు వాస్తవ ఖర్చులకు రుజువులు ఇవ్వకుండా పన్ను కింద వచ్చే ఆదాయం నుంచి మినహాయించుకునే నిర్ణీత మొత్తం ఇది.
2. మీడియా నివేదికల ప్రకారం, వ్యక్తిగత పన్ను చెల్లింపుదారులకు ఉపశమనం కలిగించడానికి ప్రభుత్వం పన్ను శ్లాబులను క్రమబద్ధీకరించవచ్చు. పన్నులను తగ్గించవచ్చు. ప్రస్తుతం కొత్త విధానంలో ఆదాయ స్థాయిని బట్టి పన్ను రేట్లు 5-30 శాతం వరకు ఉన్నాయి.
3. కేంద్ర బడ్జెట్ 2023 కొత్త వ్యక్తిగత పన్ను విధానంలోని పన్ను శ్లాబుల్లో గణనీయమైన మార్పులను తీసుకువచ్చినట్లు డెలాయిట్ ఇండియా నివేదించింది. బేసిక్ మినహాయింపు పరిమితిని రూ.2.5 లక్షల నుంచి రూ.3 లక్షలకు పెంచడం, రూ.5 కోట్లకు పైగా ఆదాయం ఉన్నవారికి సర్ఛార్జీని 37 శాతం నుంచి 25 శాతానికి తగ్గించడం ఇందులో ఉన్నాయి. కొత్త పన్ను విధానం ఆకర్షణను పెంచేందుకు ఈ సర్దుబాట్లు అమలు చేశారు. అయితే పాత పన్ను విధానంలో పన్ను రేట్లు యథాతథంగా కొనసాగుతాయి.