బ్యాంకులు సమ్మె బాట పట్టే అవకాశం ఉంది! తమ డిమాండ్లను నెరవేర్చాలని, లేదా రెండు రోజుల పాటు బ్యాంకులు మూసివేస్తామని ఏఐబీఓసీ (ఆల్ ఇండియా బ్యాంక్ ఆఫీసర్స్ కాన్ఫెడరేషన్) తేల్చిచెప్పింది.
2025 ఫిబ్రవరి 24, 25 తేదీల్లో భారత దేశంలోని ప్రభుత్వ రంగ బ్యాంకులు బంద్ పాటించే అవకాశం ఉందని పీటీఐ నివేదిక పేర్కొంది.
వారానికి ఐదు రోజుల పనిదినాలు, అన్ని కేడర్లలో తగిన నియామకాలతో పాటు ఇతర డిమాండ్ల కోసం ఫిబ్రవరి 24, 25 తేదీల్లో రెండు రోజుల పాటు దేశవ్యాప్త సమ్మెకు పిలుపునిస్తామని ఆల్ ఇండియా బ్యాంక్ ఆఫీసర్స్ కాన్ఫెడరేషన్ (ఏఐబీఓసీ) హెచ్చరించింది.
విధానపరమైన విషయాల్లో ప్రభుత్వ రంగ బ్యాంకుల (పీఎస్బీ)లను డీఎఫ్ఎస్ సూక్ష్మ నిర్వహణ చేయడం ఆయా బోర్డుల స్వయంప్రతిపత్తిని దెబ్బతీస్తుందని యూనియన్ ఆరోపించింది.
వచ్చే నెల 24,25 తేదీల్లో రెండు రోజుల పాటు, అంటే సోమ-మంగళవారాలు దేశవ్యాప్త సమ్మె నిర్వహించాలని తమ కార్యవర్గం ప్రతిపాదించిందని ఆల్ ఇండియా బ్యాంక్ ఆఫీసర్స్ కాన్ఫెడరేషన్ ఒక ప్రకటనలో తెలిపింది.
అవసరమైతే మరింత కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉందని తెలిపింది. ఈ నెలలో సమ్మె నోటీసు అందిన వెంటనే ఆందోళన కార్యక్రమాలు ప్రారంభమవుతాయని స్పష్టం చేసింది.
మరి ఈ వ్యవహారం ఎంత తీవ్రమవుతుందో చూడాలి! ఒకవేళ బ్యాంక్లు నిజంగానే సమ్మెకు దిగితే ప్రైవేటు సంస్థలు కూడా పాల్గొంటాయా? లేదా? అన్నది చూడాలి. ఏదిఏమైనా బ్యాంకు సమ్మె అంటే ప్రజలకు తీవ్ర ఇబ్బందులు తప్పవు! పైగా ఫిబ్రవరి 22 (నాలుగో శనివారం), 23 (ఆధివారం) కూడా సెలవులే వచ్చాయి. అంటే ఒకవేళ 24, 25 తేదీల్లో సమ్మె జరిగితే.. బ్యాంకులు వరుసగా 4 రోజులు మూతపడి ఉంటాయి.
సంబంధిత కథనం