కస్టమర్లు అప్రమత్తంగా ఉండండి! మీ ఏటీఎం లావాదేవీ ఛార్జీలు మే 1 నుండి పెరగనున్నాయి. బ్యాంకులు నెలవారీ పరిమితికి మించిన అన్ని లావాదేవీలపై ఈ ఛార్జీల భారం పడుతుంది. ఉచిత వినియోగానికి మించిన లావాదేవీలకు ఏటీఎం ఉపసంహరణ ఛార్జీలను పెంచడానికి బ్యాంకులను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇప్పటికే అనుమతినిచ్చింది. ‘‘ఉచిత ట్రాన్సాక్షన్లకు మించి ఒక్కో లావాదేవీకి గరిష్ఠంగా రూ.23 ఫీజు వసూలు చేయవచ్చు. ఇది మే 1, 2025 నుంచి అమల్లోకి వస్తుంది’’ అని ఆర్బీఐ మార్చి 28న జారీ చేసిన సర్క్యులర్లో పేర్కొంది. ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు, సహకార బ్యాంకులు, అధీకృత ఏటీఎం నెట్ వర్క్ ఆపరేటర్లు, కార్డు చెల్లింపు నెట్ వర్క్ ఆపరేటర్లు, వైట్-లేబుల్ ఏటీఎం ఆపరేటర్లతో సహా అన్ని వాణిజ్య బ్యాంకులకు ఈ ఆర్బిఐ సర్క్యులర్ వర్తిస్తుంది.
నెలవారీ ఉచిత వినియోగానికి మించి బ్యాంకు ఏటీఎంల నుంచి అన్ని లావాదేవీలు/ ఉపసంహరణలపై ఇకపై రూ.21కి బదులు రూ.23 చెల్లించాల్సి ఉంటుంది. జనవరి 2025 నాటికి, 1,30,902 ఆన్-సైట్ ఏటీఎంలు, క్యాష్ రీసైక్లర్ యంత్రాలు (CRM), 85,804 ఆఫ్-సైట్ ఏటీఎంలు, సిఆర్ఎంలు ఉన్నాయి.
ప్రస్తుతం, మీ ఖాతా ఉన్న బ్యాంకు ఏటీఎంల నుండి ఐదు ఉచిత నెలవారీ విత్ డ్రాలు, లేదా లావాదేవీలకు అనుమతి ఉంది. అలాగే, మెట్రో నగరాల్లోని ఇతర బ్యాంకుల నుండి మరో మూడు ఉచిత ఉపసంహరణలను అనుమతి ఉంది. నాన్ మెట్రో నగరాల్లో సొంత బ్యాంకులో ఐదు ఉచిత ఏటీఎం ట్రాన్సాక్షన్స్ కాకుండా ఇతర బ్యాంకుల ఏటీఎం ల నుంచి మరో ఐదు ట్రాన్సాక్షన్లు ఉచితంగా చేసుకోవచ్చు. ఫైనాన్షియల్ (డబ్బు ఉపసంహరణ, డిపాజిట్ మొదలైనవి), ఆర్థికేతర లావాదేవీలు (బ్యాలెన్స్ చెక్ చేయడం, PIN మార్పు మొదలైనవి) నెలవారీ ఉచిత లావాదేవీలలో భాగంగా ఉంటాయి.
తప్పనిసరి ఉచిత వినియోగానికి మించి చేసే ఏటీఎం లావాదేవీలపై ఛార్జీల విధింపును ఆర్ బిఐ ఎప్పటికప్పుడు అప్ డేట్ చేస్తుంది. ఇది ఆ సవరణ ప్రక్రియలో భాగం. ఈ పెంపు వల్ల ఏటీఎం వినియోగదారులపై భారం పడవచ్చు. ‘ఏటీఎం ఉపసంహరణలు ఖరీదైనవిగా మారడంతో, వినియోగదారులు - ముఖ్యంగా గ్రామీణ, సెమీ-అర్బన్ ప్రాంతాలలో - లావాదేవీలకు రుసుము లేకుండా ఉండే మైక్రో ఏటీఎమ్ లు, బీసీ నెట్ వర్క్ ల వైపు ఎక్కువగా మొగ్గు చూపుతారు" అని నిపుణులు భావిస్తున్నారు. అలాగే డిజిటల్ పేమెంట్స్ కూడా పెరుగుతాయని వివరించారు.
సంబంధిత కథనం