ఐపీఓకు ఎలక్ట్రిక్ వాహనాలు తయారుచేసే కంపెనీ.. గ్రే మార్కెట్‌లో ఎంత?-ather energy ipo know what is the price in grey market check out details ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  ఐపీఓకు ఎలక్ట్రిక్ వాహనాలు తయారుచేసే కంపెనీ.. గ్రే మార్కెట్‌లో ఎంత?

ఐపీఓకు ఎలక్ట్రిక్ వాహనాలు తయారుచేసే కంపెనీ.. గ్రే మార్కెట్‌లో ఎంత?

Anand Sai HT Telugu

ఏథర్ ఎనర్జీ ఐపీఓకు వస్తుంది. ఏప్రిల్ 28 నుంచి ఏప్రిల్ 30 వరకు ఈ ఐపీఓలో ఇన్వెస్ట్ చేయొచ్చు. ఈ ఐపీఓ గురించి తెలుసుకుందాం..

ఏథర్ ఎనర్జీ ఐపీఓ

ఎలక్ట్రిక్ వాహన రంగంపై నమ్మకం ఉంటే ఏథర్ ఎనర్జీ ఐపీఓపై ఓ కన్నేసి ఉంచండి. ఒక్కో షేరు ధరను రూ.304 నుంచి రూ.321గా కంపెనీ నిర్ణయించింది. ఏప్రిల్ 28 నుంచి ఏప్రిల్ 30 వరకు ఈ ఐపీఓలో ఇన్వెస్ట్ చేయొచ్చు. అదే సమయంలో యాంకర్ ఇన్వెస్టర్లకు ఏప్రిల్ 25న షేర్లు లభిస్తాయి. ప్రస్తుతం గ్రే మార్కెట్లో ఏథర్ షేర్ల ధర (జీఎంపీ) ఐపీఓ ధర కంటే 15-20 శాతం ఎక్కువగా ఉంది.

మే 5న రీఫండ్

లాట్ సైజు చూస్తే.. 1 లాట్‌కు 46 షేర్లు. అంటే కనీసం 46 షేర్లను కొనుగోలు చేయాలి. పెద్ద ఇన్వెస్టర్లకు (క్యూఐబీలు) 75 శాతం, హెచ్ఎన్ఐలు/ నాన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్లకు 15 శాతం, చిన్న ఇన్వెస్టర్లకు (రిటైల్) 10 శాతం వాటాగా నిర్ణయించారు. ఉద్యోగులు రూ.30 తగ్గింపుతో షేర్లను కొనుగోలు చేయవచ్చు.

షేర్లను ఎవరు అందుకున్నారో, ఎవరు అందుకోలేదో మే 2న ఇన్వెస్టర్లకు తెలుస్తుంది. షేర్లు కేటాయించని ఇన్వెస్టర్లకు మే 5న రీఫండ్ చేస్తారు. మే 6న ఈ ఐపీఓ లిస్ట్ కానుంది. ఈ రోజు ఈ షేరు బీఎస్ఈ, ఎన్ఎస్ఈలో ట్రేడింగ్‌ను ప్రారంభిస్తుంది.

ఏథర్ ఎనర్జీ గురించి

ఏథర్ ఎనర్జీ అనేది బెంగళూరుకు చెందిన ఒక సంస్థ. ఇది ఎలక్ట్రిక్ స్కూటర్లను తయారు చేస్తుంది. అంతేకాకుండా సొంతంగా ఛార్జింగ్ నెట్‌వర్క్, సాఫ్ట్‌వేర్‌ను కూడా అభివృద్ధి చేస్తోంది. అంతక్రితం ఏడాదితో పోలిస్తే నష్టాలను తగ్గించుకుని అమ్మకాలు పెరిగాయి. ఇది హీరో మోటోకార్ప్, బజాజ్ ఆటో, టీవీఎస్ మోటార్స్ వంటి కంపెనీలతో పోటీపడుతుంది.

ఐపీఓ ద్వారా వచ్చే డబ్బును మహారాష్ట్రలో రూ.927 కోట్లతో ఫ్యాక్టరీ పెట్టేందుకు, రూ.40 కోట్లు రుణ చెల్లింపు కోసం కంపెనీ వాడుకోనుంది. ఆర్‌అండ్‌డీకి రూ.750 కోట్లు, బ్రాండింగ్‌కు రూ.300 కోట్లు ఖర్చు చేయనున్నారు.

గమనిక : ఇది పెట్టుబడి సలహా కాదు. కేవలం ఐపీఓ గురించి మాత్రమే. స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడి పెట్టడం రిస్క్‌తో కూడుకున్నది.

ఆనంద్ సాయి హెచ్.టి తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్. నేషనల్, బిజినెస్ వార్తలు రాస్తారు. గతంలో ఎంటర్‌టైన్మెంట్, లైఫ్‌స్టైల్ రాసేవారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభం ఉంది. కాకతీయ యూనివర్సిటీలో మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం పీజీ చేశారు. గతంలో నవతెలంగాణ, ఈనాడు, ఈటీవీ భారత్, ఏబీపీ దేశంలో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. 2022లో హెచ్.టి తెలుగులో చేరారు.