Airtel 5G Cities: 25 నగరాల్లో ఎయిర్టెల్ 5జీ.. పూర్తి లిస్ట్ ఇదే
Airtel 5G Plus Cities: ఎయిర్టెల్ 5జీ నెట్వర్క్ (Airtel 5G Network) ఇప్పటి వరకు దేశంలోని 25 నగరాల్లో అందుబాటులోకి వచ్చింది. తెలుగు రాష్ట్రాల్లోని రెండు సిటీల్లోనూ ప్రస్తుతం ఎయిర్టెల్ 5జీ ఉంది. ఎయిర్టెల్ 5జీ సిటీల ఫుల్ లిస్ట్ వివరాలు ఇవే.
Airtel 5G Plus Cities: ప్రముఖ టెలికం సంస్థ ఎయిర్టెల్ క్రమంగా దేశంలో 5జీ నెట్వర్క్ను విస్తరిస్తోంది. గతేడాది నవంబర్లో 5జీ సర్వీస్లను లాంచ్ చేసిన ఆ సంస్థ.. ముందుగా ప్రధాన నగరాలకు అందుబాటులోకి తెస్తోంది. ఇప్పటి వరకు దేశంలోని 25 నగరాల్లో 5జీ నెట్వర్క్ను అందిస్తోంది ఎయిర్టెల్. 2024 మార్చి కల్లా దేశమంతా 5జీ నెట్వర్క్ను విస్తరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. కాగా, ప్రస్తుతం ఎయిర్టెల్ 5జీ ప్లస్ అందుబాటులో ఉన్న 25 నగరాలు ఏవో ఇక్కడ తెలుసుకోండి.
ప్రస్తుతం ఈ సిటీల్లో ఎయిర్టెల్ 5జీ ప్లస్
Airtel 5G Plus Cities: హైదరాబాద్, విశాఖపట్నం, ఢిల్లీ, ముంబై, గువహటి, పట్నా, అహ్మదాబాద్, గురుగ్రామ్, పానిపట్, సిమ్లా, జమ్ము, శ్రీనగర్, బెంగళూరు, పుణె, నాగ్పూర్, ఇండోర్, ఇంపాల్, చెన్నై, వారణాసి, లక్నో, సిలిగుడి, హిసార్, రోహ్తక్, గాంధీనగర్, భోపాల్లో ప్రస్తుతం ఎయిర్టెల్ 5జీ ప్లస్ నెట్వర్క్ అందుబాటులో ఉంది.
గతేడాది నవంబర్లో 5జీ నెట్వర్క్ను ఎయిర్టెల్ ప్రారంభించింది. ముందుగా 8 నగరాల్లో లాంచ్ చేసింది. క్రమంగా విస్తరిస్తూ.. ప్రస్తుతం 25 నగరాల్లో అందుబాటులోకి తెచ్చింది. వచ్చే ఏడాది మార్చి కల్లా దేశంలోని అన్ని ప్రాంతాలకు 5జీ సర్వీస్ను అందుబాటులోకి తేవాలని ప్రణాళిక రచించుకుంది.
ఇప్పటి వరకు 5జీ కోసం ఎయిర్టెల్ ప్రత్యేక ప్లాన్లను ప్రవేశపెట్టలేదు. 4జీ ప్లాన్లతోనే 5జీ నెట్వర్క్ను వాడుకోవచ్చు. అలాగే యూజర్లు.. 5జీ కోసం ప్రత్యేకంగా సిమ్ తీసుకోవాల్సిన అవసరం లేదు. 4జీ సిమ్ 5జీ నెట్వర్క్కు కూడా సపోర్ట్ చేస్తుంది. అయితే, 5జీ సపోర్ట్ ఉండే ఫోన్ ఉండాలి. ఇప్పటికే చాలా మొబైల్ తయారీ సంస్థలు 5జీని ఎనేబుల్ చేసే అప్డేట్లను కూడా 5జీ మొబైళ్లకు ఇచ్చాయి.
మరోవైపు, 4జీతో పోలిస్తే 5జీ నెట్వర్క్లో డేటా స్పీడ్ 20 నుంచి 30 రెట్లు ఎక్కువ ఉంటుందని ఎయిర్టెల్ చెబుతోంది. ప్రస్తుతం గరిష్ఠంగా ఎయిర్టెల్ 5జీలో 500 ఎంబీపీఎస్ వరకు వేగం వస్తోంది. అయితే, ఎయిర్టెల్ ఇంకా 5జీ నెట్వర్క్ను ఆప్టిమైజ్ చేస్తోంది. దీంతో స్పీడ్లో కాస్త హెచ్చుతగ్గులు ఉంటాయి.
Reliance Jio 5G: దేశంలోనే అతిపెద్ద టెలికం సంస్థ రిలయన్స్ జియో.. ఇప్పటి వరకు దేశంలోని 85 నగరాల్లో 5జీ నెట్వర్క్ను లాంచ్ చేసింది. తెలుగు రాష్ట్రాల్లోని హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ, తిరుమల, గుంటూరులో గత నెల ట్రూ 5జీ సర్వీస్లను జియో అందుబాటులోకి తీసుకురాగా.. నెల్లూరు, తిరుపతిలో సోమవారమే (జనవరి 9)న ప్రారంభించింది.