గత ఐదేళ్లలో మల్టీబ్యాగర్ రాబడులను అందించిన స్మాల్-క్యాప్ స్టాక్ కెల్టన్ టెక్ సొల్యూషన్స్ (Kellton Tech Solutions) నుంచి ఇప్పుడు ఒక బిగ్ అప్డేట్ వచ్చింది! స్టాక్ స్ల్పిట్, ఫండర్ రైజింగ్ ప్రణాళికలను సంస్థ తాజాగా ప్రకటించింది. ఫలితంగా సోమవారం ట్రేడింగ్ సెషన్లో ఈ స్టాక్ ఫోకస్లో ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.
వారెంట్లను జారీ చేసి కేటాయించడం ద్వారా నిధులు సమీకరించాలని జూన్ 14, 2025 శనివారం జరిగిన కంపెనీ బోర్డు డైరెక్టర్ల సమావేశంలో నిర్ణయించారు. అలాగే, 1:5 నిష్పత్తిలో స్టాక్ స్ల్పిట్ను సైతం సిఫార్సు చేశారు. ఈ విషయాలపై వాటాదారుల ఆమోదం పొందేందుకు జులై 11, 2025 శుక్రవారం కంపెనీ ఎక్స్ట్రా- ఆర్డినర్ జనరల్ మీటింగ్ (ఈజీఎం)ని నిర్వహించనున్నారు.
కంపెనీ బోర్డు 1:5 నిష్పత్తిలో స్టాక్ స్ల్పిట్కు ఆమోదం తెలిపింది. దీని అర్థం, రూ.5 ముఖ విలువ కలిగిన ప్రతి షేరు, రూ1 ముఖ విలువ కలిగిన ఐదు ఈక్విటీ షేర్లుగా డివైడ్ అవుతుంది. ఇవి ఫుల్లీ పెయిడ్ షేర్లు.
ఈజీఎం ద్వారా వాటాదారుల ఆమోదం పొందిన తర్వాత షేర్ల సబ్డివిజన్ కోసం రికార్డు తేదీని నిర్ణయిస్తారు.
స్టాక్ స్ల్పిట్ ముఖ్య ఉద్దేశం.. కంపెనీ ఈక్విటీ షేర్ల లిక్విడిటీని పెంచడం. అలాగే షేర్లను మరింత సరసమైనవిగా చేయడం ద్వారా చిన్న, రిటైల్ పెట్టుబడిదారుల విస్తృత భాగస్వామ్యాన్ని ప్రోత్సహించడం!
ప్రస్తుతం 12 కోట్ల షేర్లుగా (ఒక్కొక్కటి రూ. 5 ముఖ విలువ) ఉన్న కంపెనీ అధీకృత వాటా మూలధనం ప్రతిపాదిత స్టాక్ స్ల్పిట్ తర్వాత ఒక్కొక్కటి రూ.1 ముఖ విలువ కలిగిన 60 కోట్ల షేర్లకు పెరుగుతుంది. అయితే, మొత్తం అధీకృత మూలధనం రూ.60 కోట్లుగా ఎటువంటి మార్పు లేకుండా ఉంటుంది.
కంపెనీ కొన్ని ప్రమోటర్, నాన్-ప్రమోటర్ పెట్టుబడిదారులకు ప్రాధాన్యత ప్రాతిపదికన 55 లక్షల వారెంట్లను జారీ చేసి కేటాయించడం ద్వారా నిధులు సమీకరించాలని ప్రతిపాదించింది.
మొత్తం నిధుల సమీకరణ రూ.69.3 కోట్లు వరకు ఉంటుంది. అయితే, దీనికి నియంత్రణ, చట్టబద్ధమైన అధికారులు, అలాగే రాబోయే ఈజీఎంలో కంపెనీ సభ్యుల ఆమోదం అవసరం.
కన్వర్టిబుల్ వారెంట్ల జారీ తర్వాత, కంపెనీలో ప్రమోటర్ మాట్నిక్ ఫిన్వెస్ట్ ఎల్ఎల్పీ వాటా 35.74 శాతం నుంచి 38.20 శాతానికి పెరుగుతుంది. నాన్-ప్రమోటర్ పెట్టుబడిదారులలో, కరంజిత్ సింగ్ వాటా 0.10 శాతం నుంచి 0.77 శాతానికి పెరుగుతుంది, శ్రీనివాస్ పోట్లూరి వాటా 0.34 శాతం నుంచి 0.62 శాతానికి పెరుగుతుంది.
కెల్టన్ టెక్ సొల్యూషన్స్ షేర్ ధర గత ఐదేళ్లలో 742 శాతం గణనీయమైన మల్టీబ్యాగర్ రాబడిని ఇచ్చింది. గత సంవత్సరంలో, ఈ స్మాల్-క్యాప్ స్టాక్ 30 శాతం పెరిగింది!
ఈ స్టాక్ ఈ ఏడాది ఏప్రిల్ 7న రూ.95.05 వద్ద 52 వారాల కనిష్ట స్థాయిని తాకింది. గత ఏడాది జులై 15న రూ.184.30 వద్ద 52 వారాల గరిష్ట స్థాయిని నమోదు చేసింది. శుక్రవారం ట్రేడింగ్ సెషన్ ముగిసే సమయానికి కంపెనీ షేరు రూ. 131 వద్ద ముగిసింది.
సంబంధిత కథనం