Vallabhaneni Vamsi Arrest : విత్డ్రా చేసుకున్న కేసులో అరెస్ట్ ఏంటి.. వంశీ వ్యవహారంపై వైసీపీ రియాక్షన్ ఇదే!
Vallabhaneni Vamsi Arrest : వల్లభనేని వంశీ అరెస్టుపై టీడీపీ, వైసీపీ మధ్య డైలాగ్ వార్ జరుగుతోంది. వంశీ అరెస్టును వైసీపీ నేతలు ఖండిస్తుంటే.. లోకేష్ రెడ్ బుక్ ఓపెన్ అయ్యిందని టీడీపీ నాయకులు స్పష్టం చేస్తున్నారు. లిస్టులో మరికొందరు ఉన్నట్టు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.
గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని హైదరాబాద్లో అరెస్టు చేశారు. కిడ్నాప్, దాడికి సంబంధించిన సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి.. వంశీకి నోటీసులు ఇచ్చారు. వంశీని అరెస్టు చేస్తున్నట్టు ఆయన భార్యకు పోలీసులు తెలియజేశారు. అయితే ఈ వ్యవహారంపై వైసీపీ, టీడీపీ మధ్య డైలాగ్ వార్ జరుగుతోంది. వంశీ అరెస్టును వైసీపీ ఖండించగా.. టీడీపీ నాయకులు సమర్థిస్తున్నారు.
ఖంచిండిన వైసీపీ..
'వంశీ అరెస్ట్ను ఖండిస్తున్నాం. ఉపసంహరించుకున్న కేసులో అరెస్ట్ ఏంటి. కక్షపూరిత రాజకీయాలు ఉండకూడదు. ఇలాంటి రాజకీయాలు మంచిది కాదు' అని మాజీమంత్రి బొత్స సత్యనారాయణ వ్యాఖ్యానించారు. 'రాష్ట్రంలో రెడ్ బుక్ పాలనకి వల్లభనేని వంశీ అక్రమ అరెస్ట్ ప్రత్యక్ష ఉదాహరణ. టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో ఫిర్యాదుదారుడు కేసు వెనక్కి తీసుకున్నాడు. అయినా అక్రమంగా వంశీని అరెస్ట్ చేయడమేంటి? వంశీ అరెస్ట్ను తీవ్రంగా ఖండిస్తున్నాం' అని పలువురు వైసీపీ నేతలు స్పష్టం చేశారు.
వేట మొదలైంది..
'వల్లభనేని వంశీ లాంటి వారిని వేటాడే ఆట మొదలైంది. వంశీ, దేవినేని అవినాష్, కొడాలి నాని చీడపురుగులు. కన్నతల్లి లాంటి పార్టీ కార్యాలయంపై దాడి చేశారు. ఎన్టీఆర్ కుమార్తె నారా భువనేశ్వరిని ఇష్టం వచ్చినట్టు మాట్లాడిన వంశీకి తగిన శాస్తి జరిగింది. వంశీ అరెస్టుతో కూటమికి ఓటేసిన ప్రజలంతా హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు. లోకేష్ రెడ్ బుక్ ఓపెన్ అయితే రిజల్ట్ ఎలా ఉంటుందో ఈరోజు నుంచి తెలుస్తుంది. వంశీ, అతని అనుచరులు నా ఇంటి పైన దాడికి వచ్చిన సందర్భంలో ఆనాడు తాడేపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాను. నేను ఇచ్చిన ఫిర్యాదుపై తక్షణమే పోలీసులు చర్యలు తీసుకోవాలి' అని టీడీపీ స్టేట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ నాదెండ్ల బ్రహ్మం డిమాండ్ చేశారు.
నేనేమైనా కోడినా..
అటు వల్లభనేని వంశీ భార్యను కూడా అదుపులోకి తీసుకుని పోలీసులు విచారిస్తున్నారు. సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో ప్రమేయంపై ఆరా తీస్తున్నారు. వంశీని అరెస్టు చేసిన పోలీసులు విజయవాడ తీసుకెళ్లారు. ముందుగా భవానీపురం పీఎస్కు తరలించారు. వాహనాన్ని మార్చి మరో చోటుకు తరలిస్తున్నారు. మార్గమధ్యలో పోలీసులతో వంశీ వాగ్వాదానికి దిగినట్టు తెలిసింది. 'నేనేమైనా కోడినా ఏంటి? లోపల పెట్టి పార్శిల్ చేయడానికి' అంటూ పోలీసులతో వంశీ వాగ్వాదానికి దిగినట్టు సమాచారం.
కేసు ఏంటీ..
రెండేళ్ల కిందట గన్నవరంలోని టీడీపీ ఆఫీసుపై దాడి జరిగింది. రాళ్లు, కర్రలతో కొందరు దాడికి తెగబడ్డారు. ఓ కారును ధ్వంసం చేశారు. ఈ ఘటనపై పార్టీ ఆఫీసులో కంప్యూటర్ ఆపరేటర్గా పనిచేసే సత్యవర్థన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే.. అతన్ని బెదిరించి, కిడ్నాప్ చేసి.. దాడి చేసినట్టు వంశీపై ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే.. వంశీని విజయవాడ పోలీసులు హైదరాబాద్లో అరెస్టు చేశారు.