YCP Sajjala: టీడీపీకి బలముంటే అన్ని చోట్ల ఎందుకు పోటీ చేయట్లేదన్న సజ్జల
YCP Sajjala: ఎమ్మెల్సీ ఎన్నికల్లో మూడు స్థానాల్లో గెలిచిన తెలుగు దేశం పార్టీ 175 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేస్తానని ఎందుకు చెప్పలేకపోతోందని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ప్రశ్నించారు. ప్రజాస్వామ్యాన్ని హత్య చేసేది, ఆరోపణలు చేసేది చంద్రబాబేనని సజ్జల ఆరోపించారు.
YCP Sajjala: ప్రభుత్వ వ్యవస్థల్లోకి వైరస్లా దూరడం చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్యేనని సజ్జల రామకృష్ణారెడ్డి ఆరోపించారు. ఎన్నికల ఫలితాలు వెలువడకుండా సీఎంఓ నుంచి ఒత్తిడి చేసి ఉంటే.. ఫలితం అలా ఎందుకు ఉంటుందన్నారు.
ట్రెండింగ్ వార్తలు
అధికారులు మా అడుగులకు మడుగులు ఒత్తితే బాబు హయాంలో మాదిరిగా "స్కిల్ స్కామ్"లు జరిగేవని సజ్జల ఎద్దేవా చేశారు. పశ్చిమ రాయలసీమ ఎమ్మెల్సీ ఎన్నికలో అక్రమాలు జరిగాయని ఆధారాలతో సహా మేం నిరూపించామని, ఆధారం ఉంది కాబట్టే.. రీకౌంటింగ్ అడిగాం... నిబంధనల మేరకు అడగటం మా హక్కు అన్నారు. సరైన ఆధారాలు చూపించినా అక్కడ చర్యలు తీసుకోలేదన్నారు. టీడీపీలోని పెద్ద నాయకులు ఏజెంట్లగా కూర్చుని అధికారులను దబాయించారని, ప్రతిపక్షంలో ఉన్నా, అధికారంలో ఉన్నా దబాయించడం చంద్రబాబు లక్షణమన్నారు.
మేం ప్రతిపక్షంలో ఉన్నా, అధికారంలో ఉన్నా హక్కుల కోసం పోరాడాల్సి వస్తోందని, ప్రజాస్వామ్యయుతంగా ధర్మయుద్ధం చేయడమే వైఎస్సార్సీపీకి తెలుసన్నారు. పశ్చిమ రాయలసీమ కౌంటింగ్పై లీగల్గా వెళ్లేందుకు ఉన్న అవకాశాలను పరిశీలిస్తున్నామని చెప్పారు. ఎన్నికల ఫలితాలపై వచ్చిన తీర్పును గౌరవిస్తామని, చంద్రబాబుతో చెప్పించుకునే పరిస్థితి మాకు లేదన్నారు.
"ప్రజలు చంద్రబాబు కోసం వేయి కళ్లతో నిరీక్షిస్తున్నారు.. " అని ఆయన అనుకుంటే.. రాబోయే ఎన్నికల్లో 175 స్థానాలకూ పోటీ పెడతానని ఎందుకు అనలేకపోతున్నాడన్నారు. దత్తపుత్రడు లేకుండా అడుగు బయటకు వేయలేనని ఎందుకు అనుకుంటున్నాడని సజ్జల ప్రశ్నించారు. మాట్లాడటానికి దేనికైనా ఒక లాజిక్, ప్రాతిపదిక ఉండాలని, ఈ ఫలితాలు చూసి ధైర్యం వచ్చిందనుకుంటే 175 స్థానాలకూ పోటీ చేస్తామని చెప్పాలన్నారు.
ఎమ్మెల్సీ ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడితే ఫలితాలు అలా ఎందుకు ఉంటాయని ప్రశ్నించారు. అధికార పార్టీ అక్రమాలకు పాల్పడేదే అయితే అక్కడి ఫలితాలు అలా ఎందుకు వస్తాయన్నారు. కౌంటింగ్ మూడు రోజులు కాదు...ముప్పై రోజులు జరుగొచ్చన్నారు.
కుప్పంలో వైసీపీ కొట్టిన దెబ్బకి పులివెందుల పోయిందని ఆనందం పొందుతున్నారని మండిపడ్డారు. కుప్పంలో కొట్టిన దెబ్బ నుంచి తెరుకోలేక.. ఇప్పుడు పులివెందులలో విజయం అంటూ బాబు చెప్పుకుంటున్నారని మండి పడ్డారు. ఎమ్మెల్సీ కౌంటింగు మూడు జిల్లాలకు సంబంధించినదని, ఒక్క పులివెందులదే అని ఎలా చెబుతారన్నారు.
కుప్పంలో ఎంపీటీసీ, జడ్పీటీసీ, మున్సిపల్ ఎన్నికలు స్థానికంగా ఉండేవని, . వాటన్నింట్లో గెలిచామని చెప్పారు. మూడు పాత జిల్లాలు కలిపి కౌంటింగు చేస్తే... ఈయనకు పులివెందుల కనిపించిందని ఎద్దేవా చేశారు.