AP Liquor Policy : వాట్సాప్‌ లిక్కర్‌ డెలివరీ సక్సెస్‌.. కూటమి ప్రభుత్వంపై కాకాణి సెటైర్లు!-ysrcp leader kakani govardhan reddy satires on liquor door delivery ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Ap Liquor Policy : వాట్సాప్‌ లిక్కర్‌ డెలివరీ సక్సెస్‌.. కూటమి ప్రభుత్వంపై కాకాణి సెటైర్లు!

AP Liquor Policy : వాట్సాప్‌ లిక్కర్‌ డెలివరీ సక్సెస్‌.. కూటమి ప్రభుత్వంపై కాకాణి సెటైర్లు!

Basani Shiva Kumar HT Telugu
Published Feb 11, 2025 05:48 PM IST

AP Liquor Policy : ఏలూరు జిల్లాలో లిక్కర్ డోర్ డెలివరీ చేస్తున్నారంటూ.. ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీనిపై వైసీపీ స్పందించింది. కాకాణి గోవర్ధన్ రెడ్డి కూటమి ప్రభుత్వంపై సెటైర్లు పేల్చారు. తమ హయాంలో రేషన్ సరుకులు డోర్ డెలివరీ చేస్తే.. ఇప్పుడు లిక్కర్ సరఫరా చేస్తున్నారని విమర్శించారు.

కాకాణి గోవర్ధన్ రెడ్డి
కాకాణి గోవర్ధన్ రెడ్డి

లోకేష్‌ చెప్పిన వాట్సాప్‌ గవర్నెన్స్‌ ఫెయిలైనా.. వాట్సాప్‌ లిక్కర్‌ డెలివరీ మాత్రం విజయవంతం అయ్యిందని.. వైసీపీ నేత కాకాణి గోవర్ధన్ రెడ్డి ఎద్దేవా చేశారు. ఎలాంటి ఇబ్బందులు లేకుండా మద్యం అమ్మకాలు చేసుకుంటున్నారని విమర్శించారు. వైసీపీ పాలనలో బెల్డ్‌ షాపులను పూర్తిగా మూసేశామని.. పర్మిట్‌ రూమ్‌లు రద్దు చేశామని చెప్పారు. మద్యం విక్రయ వేళలు కుదించడంతో పాటు మద్యం షాపులు, బార్లను తగ్గించామని వివరించారు.

బెడ్ లిక్కర్ దొరికేలా..

'కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పగలు రాత్రి తేడా లేకుండా.. ఉదయం 6 గంటలకు మొదలుపెట్టి అర్థరాత్రి వరకు మద్యం అమ్ముతున్నారు. పట్టణాల్లో, గ్రామాల్లో బెల్ట్‌ షాపులు తెరిచి మద్యం ఏరులై పారిస్తున్నారు. నిద్ర లేవగానే బెడ్‌ లిక్కర్‌ దొరికేలా సరఫరా చేస్తున్నారు. ఆఖరికి మద్యం డోర్‌ డెలివరీ చేస్తున్నారు. మద్యం షాపులు లక్కీ డిప్‌ కూపన్లు ఇవ్వడం చూస్తుంటే.. రాష్ట్రం ఎంత అధోగతి పాలైందో అర్థమవుతుంది' అని కాకాణి వ్యాఖ్యానించారు.

దోపిడీకి డోర్లు తెరిచారు..

'షాపులు మూసేయాలన్న మహిళల ఆక్రందనలను చంద్రబాబు చెవికెక్కించుకోవడం లేదు. ఎక్కడ చూసినా పేకాట క్లబ్బులు, అనుమతి లేని మద్యం షాపులు, బార్లు నడుస్తున్నాయి. నెల్లూరులో జరుగుతున్న వ్యవహారాలపై పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదు. అధికారంలోకి వస్తూనే.. చంద్రబాబు ప్రైవేటుపరం చేసి తన వారికి కట్టబెట్టడం ద్వారా దోపిడీకి డోర్లు తెరిచారు. ఎమ్మార్పీ ధరలు పెంచి అమ్ముకునే విధంగా తీసుకున్న నిర్ణయం.. చరిత్రలో నిలబడిపోయే అవినీతి' అని గోవర్ధన్ రెడ్డి ఆరోపించారు.

అడుగడుగునా వైఫల్యాలే..

'9 నెలలుగా బాబు పాలనలో అడుగడుగునా వైఫల్యాలు, అవినీతి, అసమర్థత కనిపిస్తూనే ఉంది. తక్కువ ధరకు నాణ్యమైన మద్యం ఇస్తామని చెప్పిన చంద్రబాబు.. లిక్కర్‌ రేట్లు పెంచి మద్యం మీద కూడా బాదుడు మొదలుపెట్టాడు. జగన్‌ పాలనలో ఉన్న బ్రాండ్లకే రేట్లు పెంచి చంద్రబాబు దోచుకుంటున్నారు. బాటిల్‌ మీద రూ.10 నుంచి రూ.50 వరకు పెంచేసి దోపిడీకి తలుపులు తెరిచారు. మందుబాబుల జేబులు కొట్టి.. ఉండవల్లి నివాసానికి నోట్ల కట్టలు పారిస్తున్నారు' అని కాకాణి గోవర్ధన్ విమర్శించారు.

ఆదాయానికి గండికొట్టారు..

'సవరణ చేసి మార్జిన్‌ 14 శాతానికి పెంచడం ద్వారా.. ఏకంగా రూ.1000 కోట్లు తన ఇంటికి వెళ్లేలా చంద్రబాబు రూట్‌ మ్యాప్‌ వేసుకున్నారు. మార్జిన్‌ పెంపు ద్వారా ప్రభుత్వ ఆదాయానికి రూ.3 వేల కోట్లు గండి కొట్టారు. ఆ డబ్బంతా ఎల్లో సిండికేట్‌ జేబుల్లోకే వెళ్లేలా ప్లాన్‌ చేశారు. ఎన్నికల ముందు చంద్రబాబు చెప్పిన సంపద సృష్టి ఇదేనా. మొబిలైజేషన్‌ అడ్వాన్సుల పేరుతో కాంట్రాక్టర్ల నుంచి కమీషన్లు తీసుకుంటూ.. పొలిటికల్‌ గవర్నెన్స్‌కి తెర తీశారు' అని కాకాణి ఆరోపించారు.

కాంట్రాక్టర్ల నుంచి కమీషన్లు..

'గతంలో ఏ పని కేటాయించాలన్న ఒక పద్ధతి ప్రకారం జరిగేది. ఈరోజు జ్యుడీషియల్‌ ప్రివ్యూలు లేవు. రివర్స్‌ టెండరింగ్‌ విధానం లేదు. మొబిలైజేషన్‌ అడ్వాన్సులు ఇస్తున్నారు. ఉచిత ఇసుక పేరుతో ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టేశారు. మొబిలైజేషన్‌ అడ్వాన్స్‌ పేరుతో అవినీతిని చంద్రబాబు స్ట్రీమ్‌లైన్‌ చేసేశారు. పనులు మొదలు కాకుండానే ప్రజల సొమ్మును కాంట్రాకర్ల నుంచి కమీషన్‌ రూపంలో తీసుకుంటున్నారు. ఇదే చంద్రబాబు చెప్పిన పొలిటికల్‌ గవర్నెన్స్‌' అని కాకాణి గోవర్ధన్ రెడ్డి ఆరోపించారు.

Basani Shiva Kumar

eMail
Whats_app_banner