టీడీపీ కార్యకర్తపై దాడి కేసులో వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేష్ ను పోలీసులు అరెస్టు చేశారు. ఆయనను తుళ్లూరు పోలీస్ స్టేషన్ కు తరలించారు. టీడీపీ నేత ఇసకపల్లి రాజుపై దాడి ఘటనపై నందిగం సురేష్ పై కేసు నమోదు అయింది.
టీడీపీ కార్యకర్త ఇసకపల్లి రాజుపై దాడి కేసులో వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేష్ ను పోలీసులు అరెస్టు చేశారు. గుంటూరు జిల్లా ఉద్దండరాయునిపాలెంలో శనివారం రాత్రి రాజుపై నందిగం సురేష్, ఆయన సోదరుడు ప్రభు దాసు, బంధువులు మూకుమ్మడిగా దాడి చేశారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన రాజు మంగళగిరి ఎయిమ్స్ లో చికిత్స పొందుతున్నాడు.
ఈ ఘటనపై రాజు కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు ఉద్దండరాయునిపాలెంలో నందిగం సురేష్ ను అదుపులోకి తీసుకున్నారు.
శనివారం రాత్రి ఉద్దండరాయునిపాలెంలో ఓ కారు వేగంగా దూసుకొచ్చింది. అతివేగంపై కారు నడపడంపై డ్రైవర్ను రాజు మందలించారు. కాసేపటికి నందిగం సురేష్ తన అనుచరులు అక్కడికి వచ్చారు. రాజుపై దాడి చేశారు.
అనంతరం రాజును సురేష్ తన ఇంటికి తీసుకెళ్లారు. అక్కడ మరోసారి సురేష్, అతడి సోదరుడు ప్రభుదాసు, బంధువులు అనుచరులు...టీడీపీ కార్యకర్త రాజుపై దాడి చేశారు.
దాడిలో గాయాలపాలైన రాజును కుటుంబ సభ్యులు మంగళగిరి ఎయిమ్స్ కు తరలించారు. రాజు కుటుంబ సభ్యులు సురేష్, అతని సోదరుడు, బంధువులపై ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుపై కేసు నమోదు చేసిన పోలీసులు...సురేష్ ను అరెస్టు చేశారు. అతడి అన్న ప్రభుదాసు, బంధువుల కోసం పోలీసులు గాలిస్తున్నారు.
ఇసుకపల్లి రాజు శనివారం రాత్రి నందిగం సురేష్ ఇంటి దగ్గర మద్యం తాగి వీరంగం సృష్టించాడు. నందిగం సురేష్ కుటుంబ సభ్యులను దూషించాడు. సురేష్ను చంపేస్తే తన ఆస్తుల్లో కొంత భాగం రాసిస్తానంటూ హడావుడి చేశారని వైసీపీ ఆరోపించింది.
నందిగం సురేష్ కార్లపైన రాజు దాడి చేశాడని, ఎందుకు వీరంగం చేస్తున్నావని రాజును నందిగం సురేష్ అనుచరులు ప్రశ్నించారు. దీంతో రాజు, సురేష్ అనుచరులకు మధ్య గొడవ జరిగింది.
ఇదిలా ఉంటే తనపై దాడి చేశారంటూ రాజు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. తమ కారులపై దాడి చేసి, కుటుంబ సభ్యులను దూషించాడని నందిగామ సురేష్ భార్య కూడా పోలీసులకు ఫిర్యాదు చేశారు.
అయితే నందిగం సురేష్ సతీమణి ఫిర్యాదును పోలీసులు పట్టించుకోలేదని వైసీపీ ఆరోపిస్తుంది. రాజు ఇచ్చిన ఫిర్యాదుతో నందిగం సురేష్ను అక్రమంగా అరెస్ట్ చేశారని విమర్శించింది.
సంబంధిత కథనం