YS Sharmila : 'అసెంబ్లీకి వెళ్లేందుకు మొహం చెల్లదు' - జగన్ పై వైఎస్ షర్మిల తీవ్ర వ్యాఖ్యలు
టీడీపీ, వైసీపీలపై ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల విమర్శలు గుప్పించారు. సూపర్ సిక్స్ పథకాలపై చంద్రబాబు తన చిత్తశుద్ధి నిరూపించుకోవాలని డిమాండ్ చేశారు. అసెంబ్లీకి వెళ్ళని జగన్ కి, వైసీపీ ఎమ్మెల్యేలకు ప్రజా సమస్యల మీద మాట్లాడే నైతికత లేదని కామెంట్స్ చేశారు.

కూటమి ప్రభుత్వంపై ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల ఫైర్ అయ్యారు. చంద్రబాబు సూపర్ సిక్స్ హామీలు సూపర్ ఫ్లాప్ అని ఎద్దేవా చేశారు. పథకాల అమలు ఎప్పుడు అని అడిగితే 9 నెలల్లో 90 కారణాలు చెప్పారని విమర్శించారు. ఇప్పటికైనా ఇచ్చిన హామీలపై , సూపర్ సిక్స్ పథకాలపై మీ చిత్తశుద్ధి నిరూపించుకోవాలని చంద్రబాబుని డిమాండ్ చేశారు.
ఈనెల 28న ప్రవేశపెట్టే బడ్జెట్ లో సూపర్ సిక్స్ పథకాలకు అగ్రభాగం నిధులు కేటాయించాలని షర్మిల డిమాండ్ చేశారు. అన్ని పథకాలను ఈ ఏడాది నుంచే అమలు చేయాలని… ఇచ్చిన మాటను వెంటనే నిలబెట్టుకోవాలని కోరారు. కూటమి ప్రభుత్వంలోని పార్టీలు ఆ దిశగా పని చేయాలని హితవు పలికారు.
అసెంబ్లీకి వెళ్లే సమయం లేదా..? వైఎస్ షర్మిల
ఇక కూటమి ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని ప్రశ్నించాల్సిన వైసీపీకి అసెంబ్లీకి వెళ్ళే దమ్ములేదు. జగన్ మోహన్ రెడ్డి గారికి నేరస్థులను, దౌర్జన్యం చేసిన వాళ్ళను జైలుకెళ్లి పరామర్శించే సమయం ఉంటుంది కానీ… ప్రజల కోసం అసెంబ్లీకి వెళ్లేందుకు మాత్రం మొహం చెల్లదు. ప్రెస్ మీట్ లు పెట్టీ పురాణం అంతా చెప్పే తీరిక దొరుకుతుంది కానీ అసెంబ్లీలో పాలకపక్షాన్ని నిలదీసే ధైర్యం జగన్ గారికి లేదు" అంటూ వైఎస్ షర్మిల దుయ్యబట్టారు.
“ప్రజలు 11 మందిని గెలిపిస్తే శాసనసభకు రాకుండా మారం చేసే వైసీపీ అధ్యక్షుడికి, పార్టీ ఎమ్మెల్యేలకు ప్రజల మధ్య తిరిగే అర్హత లేదు. ప్రజల సమస్యల మీద మాట్లాడే నైతికత అసలే లేదు. వైసీపీ ఎమ్మెల్యేలు ఈ సారైనా అసెంబ్లీకి వెళ్ళాలని డిమాండ్ చేస్తున్నాం. సభా వేదికగా కూటమి ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టాలి. ఈ సారి కూడా అసెంబ్లీకి వెళ్ళే దమ్ము లేకుంటే వైసీపీ ఎమ్మెల్యేలు వెంటనే రాజీనామాలు చేయాలి” అని వైఎస్ షర్మిల డిమాండ్ చేశారు.
సంబంధిత కథనం