కూటమి ప్రభుత్వంలో రైతుల పరిస్థితి దారుణం, ఏ పంటకు మద్దతు ధర లేదు - వైఎస్ షర్మిల-ys sharmila shocking remarks farmers plight under coalition govt no msp for any crop ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  కూటమి ప్రభుత్వంలో రైతుల పరిస్థితి దారుణం, ఏ పంటకు మద్దతు ధర లేదు - వైఎస్ షర్మిల

కూటమి ప్రభుత్వంలో రైతుల పరిస్థితి దారుణం, ఏ పంటకు మద్దతు ధర లేదు - వైఎస్ షర్మిల

అకాల వర్షాలతో దాదాపుగా 5 లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగిందని ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అన్నారు. ఇంత నష్టం జరిగినా ప్రభుత్వం అధికారిక లెక్కలు తీయలేదని ఆరోపించారు. రైతుల పరిస్థితి దారుణంగా ఉందన్నారు.

కూటమి ప్రభుత్వంలో రైతుల పరిస్థితి దారుణం, ఏ పంటకు మద్దతు ధర లేదు - వైఎస్ షర్మిల

రాష్ట్రంలో అకాల వర్షాల వలన ఆస్తి, ప్రాణ, పంట నష్టం తీవ్రంగా జరిగిందని ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అన్నారు. ఎక్కడ చూసినా తడిచిన ధాన్యం, రాలిపోయిన మామిడి, కూలిపోయిన అరటి కనిపిస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. దాదాపు 5 లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగిందన్నారు. ఇప్పటి వరకు ఎంత నష్టం జరిగిందనేది ప్రభుత్వం లెక్కలు కూడా తీయలేదని ఆరోపించారు.

కొనుగోలు చేసింది 13 లక్షల మెట్రిక్ టన్నులే

"ఈ సీజన్ లో దాదాపు 30 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం పండింది. కానీ ప్రభుత్వం కొన్నది మాత్రం కేవలం 13 లక్షల మెట్రిక్ టన్నులే. ఇంకా 17 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం రైతుల దగ్గరే ఉంది. ఇప్పుడు ఆ ధాన్యం ఎవరు కొనాలి? చివరి గింజ వరకు కొంటాం అని ఇచ్చిన హామీ ఏమయింది?

తెలంగాణలో ఇదే పరిస్థితి ఏర్పడితే... అక్కడ ప్రభుత్వం విదేశాలకు నేరుగా బియ్యం ఎక్స్ పోర్ట్ చేస్తుంది. ఫిలిప్పీన్స్, మలేషియా దేశాలతో తెలంగాణ ప్రభుత్వం MOU చేసుకుంది. ఈ ప్రభుత్వం మిల్లర్ల మీద ఒత్తిడి చేయకుండా.. నేరుగా విదేశాలకు బియ్యం ఎక్స్పోర్ట్ చేయొచ్చు కదా? మీ నిర్లక్ష్యం రైతుల పాలిట శాపం కావాలా?" -వైఎస్ షర్మిల

ధరల స్థిరీకరణ-రైతులను దగా

"రాష్ట్రంలో రైతుల పరిస్థితి దారుణంగా ఉంది. కూటమి ప్రభుత్వం వచ్చాక రైతులను మోసం చేసింది. ఏ పంటకు మద్దతు ధర లేదు. కనీస మద్దతు ధర అందక రైతులు నష్టపోతున్నారు. ఈ కూటమి ప్రభుత్వం ఇప్పటికైనా కళ్ళు తెరవాలి. రైతులను దగా చేస్తూ.. వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు.

ధరల స్థిరీకరణ కింద రూ.6 వేల కోట్లు ఇప్పటి వరకు ఖర్చు చేశారట. ఇదంతా పచ్చి అబద్ధం. మీరు అధికారంలో వచ్చి 10 నెలలు కాలేదు. 10 నెలల్లో రూ.6 వేల కోట్లు ధరల స్థిరీకరణ కింద ఎలా ఖర్చు చేశారు? రూ.6 వేల కోట్లపై వ్యవసాయ శాఖ వెంటనే శ్వేతపత్రం ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ తరపున డిమాండ్ చేస్తున్నాం"- వైఎస్ షర్మిల

ఇది రాహుల్ గాంధీ విజయం

"కులగణనపై బీజేపీకి జ్ఞానోదయం అయ్యింది. కులగణనపై కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం. ఇది రాహుల్ గాంధీ విజయం. సామాజిక న్యాయం కోసం కులగణన చేయాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. కులగణన చేసి రిజర్వేషన్లు పెంచాల్సి వస్తే పెంచాలని రాహుల్ అన్నారు. ప్రతి 10 ఏళ్లకు కులగణన చేయాలి"- వైఎస్ షర్మిల

కులగణనకి తెలంగాణ, కర్ణాటక ఆదర్శం

"1951 నుంచి ప్రతి 10 ఏళ్లకు జనగణన జరుగుతుంది. 2011 లో చివరి సారి జరిగింది. 2021 లో జనగణన జరగాలి. బీజేపీ జనగణనతో పాటు కులగణన పై నిర్లక్ష్యం చేసింది. కాంగ్రెస్ ఒత్తిడితో ఇప్పుడు తప్పనిసరి అయ్యింది. కులగణన చేయడం బీజేపీ సిద్ధాంతానికి వ్యతిరేకం. బీజేపీ సిద్ధాంతం మత గణన. కులగణనలో తెలంగాణ,కర్ణాటక ఆదర్శం"- వైఎస్ షర్మిల

బీజేపీ వాళ్లు కౌరవులు

"బీజేపీ వాళ్లు నన్ను గాంధారి అంటే... బీజేపీ వాళ్లను నేను కౌరవులు అంటాను. వాళ్లు నిజంగా కౌరవులతో సమానమే, ఈ రాష్ట్రానికి మోదీ ఏం చేశారో చెప్తే నేను గాంధారి అని ఒప్పుకుంటా. ఎటు చూసినా అన్యాయమే. ఒక్క మేలు జరగలేదు. ప్రత్యేక హోదా మోసమే, పోలవరం ప్రాజెక్టుకు అన్యాయమే. కడప స్టీల్ లేదు..విశాఖ స్టీల్ కి దిక్కులేదు. విభజన హామీలు అన్ని మోసం చేసి..ఇప్పుడు అమరావతికి అండగా ఉంటాం అంటే నమ్మాలా? అందుకే బీజేపీ వాళ్ళు కౌరవులు"- వైఎస్ షర్మిల

సత్యప్రసాద్ బండారు హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలు, పొలిటికల్ వార్తలను రాస్తారు. జర్నలిజంలో 6 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఆంధ్ర యూనివర్సిటీలో జర్నలిజం(MJMC) పీజీ చేశారు. గతంలో ఈటీవీ భారత్, ఇన్ షార్ట్స్, ఏబీపీ దేశంలో కంటెంట్ రైటర్‌గా పనిచేశారు. సత్యప్రసాద్ 2023లో హెచ్.టి.తెలుగులో చేరారు.

సంబంధిత కథనం