ఆలూ లేదు.. చూలు లేదు.. కొడుకు పేరు సోమలింగం అన్నట్లుంది ఏపీ సీఎం చంద్రబాబు తీరు.. అని ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల ఎద్దేవా చేశారు. రాజధాని అమరావతి పేరుతో సేకరించిన 34 వేల ఎకరాల్లో అభివృద్ధికే దిక్కులేదని విమర్శించారు. పునరుజ్జీవనం పేరుతో ఇప్పుడు మరో 44 వేల ఎకరాలు అర్జెంటుగా అవసరం వచ్చిందట.. అందులో అద్భుత ప్రపంచం కడతాడట.. అని ఎద్దేవా చేశారు.
'అరచేతిలో వైకుంఠం చూపించడం, ఏఐ పేరుతో గ్రాఫిక్స్ మాయ చేయడం, లేనిది ఉన్నట్లు నమ్మించడం ఒక్క బాబుకే తెలిసిన విద్య. రాజధాని విస్తరణ పేరుతో, విలువైన రైతుల భూములను మళ్లి అగ్గువకే కాజేసి.. తన అనుయాయులకు కట్టబెట్టి, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయాలని చూసే కుట్ర తప్పా మరోటి కాదు. కూటమి ప్రభుత్వానికి భూదోపిడిపై పెట్టే శ్రద్ధ.. ప్రజా రాజధాని అమరావతి నిర్మాణంపై పెట్టడం లేదు. సేకరించిన భూముల్లో ముందు రాజధాని కట్టాలన్న చిత్తశుద్ధి అసలే లేదు' అని షర్మిల విమర్శించారు.
'ముఖ్యమంత్రి చంద్రబాబును కాంగ్రెస్ పార్టీ పక్షాన సూటిగా ప్రశ్నిస్తున్నాం. రాజధాని విస్తరణకు భూములు సేకరించడం తప్పు కాదు. అఖండ అమరావతికి మోకాలడ్డు మా ఉద్దేశ్యం అంతకన్నా కాదు. కానీ సేకరించిన 34 వేల ఎకరాల్లో అసలు రాజధాని ఎక్కడ? కూలిపోయే స్థాయిలో ఉన్న తాత్కాలిక కట్టడాలు, ఎటు చూసినా పడావుబడిన భూములు ఇదేనా ఆంధ్రుల ఆత్మగౌరవం? సింగపూర్ తలదన్నే ఆకాశ హర్మ్యాలు ఎక్కడ?' అని వైఎస్ షర్మిల ప్రశ్నించారు.
'రాజధానిని ముందు నిలబెట్టకుండా.. ఒక రూపం అంటూ తీసుకురాకుండా..చిత్రాలతో విచిత్రాలు చేస్తూ.. ఇప్పుడే 44 వేల ఎకరాలు అదనంగా గుంజుకోవడం అంటే మరో నాలుగు మండలాల రైతులను మోసం చేస్తున్నట్లు కాదా? ఫేజ్ 1 లో సేకరించిన 34 వేల ఎకరాల్లో 2 వేల ఎకరాలు మిగలడం ఏంటి? సీడ్ క్యాపిటల్ కి పోను మిగిలిన 20 వేలకు పైగా ఎకరాలు, 15 వేల ఎకరాల ప్రభుత్వ భూమి ఎవరికిచ్చారు? ఏ సంస్థలకు కేటాయించారు? ఏ ప్రాతిపదికన భూములు ఇచ్చారు? చంద్రబాబు సమాధానం చెప్పాలి. 34 వేల ఎకరాలపై వెంటనే పూర్తి స్థాయి శ్వేతపత్రం విడుదల చేయాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది' అని షర్మిల ట్వీట్ చేశారు.
రాజధాని నగరం అమరావతి కోసం 44,676 ఎకరాల భూమిని సమీకరణలో సేకరించాలని ప్రభుత్వం భావిస్తోంది. 2014-19 మధ్య కాలంలో 29 గ్రామాల్లో 34వేల ఎకరాలను రాజధాని కోసం సేకరించారు. ఈ భూమిలో తొలి దశలో రాజధాని నిర్మాణ పనులు చేపట్టారు. రాజధాని విస్తరణ, భవిష్యత్తు అవసరాల కోసం అమరావతిలో మరో 44వేల ఎకరాలను సమీకరించాలని ప్రభుత్వం భావిస్తోంది.
సంబంధిత కథనం