YS Jagan : చట్టానికి, న్యాయానికి చోటు లేదు.. వల్లభనేని వంశీ అరెస్టుపై జగన్ రియాక్షన్ ఇదే!-ys jagan sensational comments on vallabhaneni vamsi arrest ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Ys Jagan : చట్టానికి, న్యాయానికి చోటు లేదు.. వల్లభనేని వంశీ అరెస్టుపై జగన్ రియాక్షన్ ఇదే!

YS Jagan : చట్టానికి, న్యాయానికి చోటు లేదు.. వల్లభనేని వంశీ అరెస్టుపై జగన్ రియాక్షన్ ఇదే!

Basani Shiva Kumar HT Telugu
Published Feb 14, 2025 04:03 PM IST

YS Jagan : వల్లభనేని వంశీ అరెస్టు ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. ఈ వ్యవహారంపై టీడీపీ, వైసీపీ మధ్య వార్ జరుగుతోంది. వంశీ అక్రమాలు చేశాడంటూ టీడీపీ ఆరోపిస్తుంటే.. ఆయనకు మద్దతుగా నిలుస్తోంది వైసీపీ. తాజాగా ఇదే అంశంపై స్పందించారు వైఎస్ జగన్. చట్టానికి, న్యాయానికి చోటు లేదని ఆవేదన వ్యక్తం చేశారు.

వైఎస్ జగన్
వైఎస్ జగన్

రాష్ట్రంలో చట్టానికి, న్యాయానికి చోటు లేకుండా పోయిందని.. వైసీపీ చీఫ్ జగన్ వ్యాఖ్యానించారు. తీవ్ర అధికార దుర్వినియోగంతో రెడ్‌బుక్‌ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారని విమర్శించారు. అక్రమ అరెస్టులు చేస్తూ.. అసలు రాజ్యాంగానికి తూట్లు పొడుస్తున్నారని ఆరోపించారు. మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ విషయంలో కూటమి సర్కార్‌ వ్యవహరిస్తున్న తీరు అత్యంత అన్యాయంగా ఉందని ట్వీట్ చేశారు.

తప్పులను తట్టుకోలేక..

'గన్నవరం కేసులో తనపై టీడీపీ వారు ఒత్తిడి తెచ్చి.. తప్పుడు కేసు పెట్టించారంటూ సాక్షాత్తూ జడ్జి ముందు దళిత యువకుడు వాంగ్మూలం ఇచ్చాడు. అధికార పార్టీ కుట్రను బట్టబయలు చేస్తే.. తమ బండారం బయటపడిందని, తమ తప్పులు బయటకు వస్తున్నాయని తట్టుకోలేక.. దాన్నికూడా మార్చేయడానికి చంద్రబాబు దుర్మార్గాలు చేస్తున్నారు' చేస్తున్నారని జగన్ ఆరోపించారు.

ఎంతవరకు కరెక్టు..

'సత్యానికి కట్టుబడి నిజాలు చెప్పినందుకు దళిత యువకుడ్ని పోలీసులను పంపించి మరీ వేధించడం ఎంతవరకు కరెక్టు? వాంగ్మూలం ఇచ్చిన రోజే ఆ దళిత యువకుడి కుటుంబంపైకి పోలీసులు, టీడీపీ కార్యకర్తలు వెళ్లి వారిని బెదిరించి, భయపెట్టడం కరెక్టేనా? ఇది ప్రజాస్వామ్య ప్రభుత్వమేనా? మీ కక్షలు తీర్చుకోవడానికి ఇన్నిరకాలుగా వ్యవస్థలను వాడుకుని దుర్మార్గాలు చేస్తారా?' అని జగన్ ప్రశ్నించారు.

మీదే బాధ్యత..

'సుప్రీంకోర్టు దృష్టిలో ఉన్న ఈ కేసులో.. వారి ఆదేశాలను అనుసరించి దిగువ కోర్టు క్షుణ్నంగా కేసును విచారిస్తున్నాయి. పెట్టింది తప్పుడు కేసంటూ వాస్తవాలు బయటకు వస్తుంటే.. మొత్తం దర్యాప్తును, విచారణను, చివరకు జడ్జిని, న్యాయ ప్రక్రియను అపహాస్యం చేస్తున్నారు. అధికారముందనే అహంకారంతో మీరు చేస్తున్న‌ది అరాచకం కాదా ఇది? అధికార దుర్వినియోగం కాదా? వంశీ అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నాను. వంశీ భద్రతకు ఎలాంటి సమస్య వచ్చినా ఈ ప్రభుత్వమే పూర్తిగా బాధ్యత వహించాల్సి ఉంటుంది' అని జగన్ స్పష్టం చేశారు.

బాధితులపైన కేసులా..

'దెందులూరు మాజీ ఎమ్మెల్యే కొఠారు అబ్బయ్య చౌదరిపై తప్పుడు కేసును తీవ్రంగా ఖండిస్తున్నాను. కళ్యాణ మండపం ప్రాంగణంలో అబ్బయ్య చౌదరి డ్రైవర్‌‌ను టీడీపీ ఎమ్మెల్యే బూతులు తిట్టారు. తిరిగి అబ్బయ్య చౌదరిపై ఎస్సీ, ఎస్టీ కేసు పెట్టడం దుర్మార్గం. టీడీపీ ఎమ్మెల్యే ఏం తిట్టారో ఆ వీడియోను కోట్లమంది ప్రజలు చూశారు. మరి ఎవరిపై చర్యలు తీసుకోవాలి? తప్పులు టీడీపీ వారు చేసి, వారిపై చర్య తీసుకోమని కోరితే.. పోలీసులు ఎదురు కేసులు పెట్టి అన్యాయంగా వ్యవహరిస్తున్నారు. అందులోనూ 307, అంటే హత్యాయత్నం కేసులు పెట్టడం ఏంటి? అందులోనూ బాధితులపైన. రాష్ట్రంలో దిగజారిన వ్యవస్థలకు ఈ ఘటన నిదర్శనం కాదా?' అని జగన్ నిలదీశారు.

ప్రజల డైరీల్లో రికార్డు..

'చంద్రబాబుగారూ! ప్రజలకు ఇచ్చిన సూపర్‌-6, సహా ఇచ్చిన 143 హామీలు నిలబెట్టుకోలేక.. ఒక్కదాన్నీ కూడా అమలు చేయక, అంతకుముందున్న పథకాలను సైతం రద్దుచేసి, ప్రజలను సంక్షోభంలోకి నెట్టారు. ప్రజల దృష్టిని మళ్లించడానికి మా పార్టీకి చెందిన నాయకులను, కార్యకర్తలను లక్ష్యంగా చేసుకుని తప్పుడు కేసులు, తప్పుడు సాక్షులుతో అక్రమ అరెస్టులకు దిగుతున్నారు. మీ తప్పులను ప్రజలే తమ డైరీల్లో రికార్డు చేసుకుంటూనే ఉన్నారు. తగిన మూల్యం చెల్లించక తప్పదని హెచ్చరిస్తున్నాం' అని జగన్ ట్వీట్ చేశారు.

Basani Shiva Kumar

eMail
Whats_app_banner