కూటమి ప్రభుత్వం ప్రభుత్వ వైద్య కళాశాలలను ప్రైవేటీకరించడాన్ని నిరసిస్తూ వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ ఇవాళ అనకాపల్లి జిల్లాలోని నర్సీపట్నం వైద్య కళాశాలను సందర్శించారు.
ఈ సందర్భంగా మాట్లాడిన వైఎస్ జగన్ కూటమి ప్రభుత్వ తీరుపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. మెడికల్ కాలేజీలను ప్రైవేట్పరం చేస్తే పేదోడికి వైద్యం ఎలా అందుతుంది.? అని ప్రశ్నించారు.నర్సీపట్నంలో 52 ఎకరాల్లో మెడికల్ కాలేజీ నిర్మాణం చేపట్టామని చెప్పారు. 2022, డిసెంబర్ 30న శంకుస్థాపన చేశామని గుర్తు చేశారు. కొవిడ్ పరిస్థితులను అధిగమించి రూ. 500 కోట్లతో ఈ మెడికల్ కాలేజీకి శంకుస్థాపన చేశామన్నారు. ఈ కాలేజీ పూర్తి అయి ఉంటే పరిస్థితులు మారేవి. పక్కనే ఉన్న పార్వతీపురం మెడికల్ కాలేజీ పూర్తయి ఉంటే….అస్వస్థతకు గురైన గిరిజన విద్యార్థులకు వైద్యం అందించే వారు కదా అని నిలదీశారు.
అసలు ఆధునిక దేవాలయాలైన మెడికల్ కాలేజీలను ఎందుకు ప్రైవేటీకరణ చేస్తున్నారని వైఎస్ జగన్ ప్రశ్నించారు. పేదవారు దగపడకుండా ఎలా ఆపుతారని నిలదీశారు. ప్రైవేటు వాళ్లు అధిక ఛార్జీలు వేస్తే పేదవాళ్లు ఎలా తట్టుకుంటారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
“నర్సీపట్నంకి చెందిన అయ్యన్నపాత్రుడు స్పీకర్గా ఉన్నా.. అబద్ధాలు చెబుతున్నారు. మెడికల్ కాలేజీకి జీవో లేదు అంటారా? ఇదిగో జీవో నెంబరు 204. జీవో లేదంటూ అబద్ధాలు చెప్పిన మీరు స్పీకర్ పదవికి అర్హుడివా అయ్యన్న…?” అని వైఎస్ జగన్ ప్రశ్నించారు.
చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల 10 కొత్త ప్రభుత్వ వైద్య కళాశాలలను పబ్లిక్ ప్రైవేట్ పార్టనర్షిప్ (పీపీపీ) కింద అభివృద్ధి చేయాలని నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ వైసీపీ… కొద్దిరోజులుగా ఆందోళనలు చేస్తోంది. ఇందులో భాగంగా ఇవాళ నర్సీపట్నం మెడికల్ కాలేజీని జగన్ సందర్శించారు.
విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ (వీఎస్పీ) ఉద్యోగులతో సహా పలువురు జగన్ కు వినతిపత్రాలను ఇచ్చారు. ఎన్నికలకు ముందు స్టీల్ ప్లాంట్ ను కాపాడతామని హామీ ఇచ్చిన టీడీపీ కూటమి… తమను మోసం చేస్తోందని చెప్పారు. తమ తరపున పోరాటం చేయాలని కోరారు.కార్మికుల విజ్ఞప్తికి జగన్ సానుకూలంగా స్పందించారు. అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా తమ వైఖరి ఎప్పుడూ ఒకేలా ఉంటుందని, విశాఖ స్టీల్ ప్లాంట్ ను కాపాడాలన్నదే అని వైసీపీ వర్గాలు స్పష్టం చేశాయి.
సంబంధిత కథనం