ఏపీలో ప్రతి మూడు బాటిళ్లలో ఒకటి కల్తీ మందే.. తయారు చేస్తున్నది టీడీపీ వాళ్లే : వైఎస్ జగన్-ys jagan comments on cm chandrababu over fake liquor case in annamayya district ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  ఏపీలో ప్రతి మూడు బాటిళ్లలో ఒకటి కల్తీ మందే.. తయారు చేస్తున్నది టీడీపీ వాళ్లే : వైఎస్ జగన్

ఏపీలో ప్రతి మూడు బాటిళ్లలో ఒకటి కల్తీ మందే.. తయారు చేస్తున్నది టీడీపీ వాళ్లే : వైఎస్ జగన్

Anand Sai HT Telugu

ఆంధ్రప్రదేశ్‌లో కల్తీ లిక్కర్‌పై సీఎం చంద్రబాబు నాయుడిపై వైసీపీ అధినేత జగన్ విమర్శలు గుప్పించారు. నకిలీ లిక్కర్ వ్యవహారంలోనూ రాష్ట్రాన్ని నంబర్‌ వన్‌గా తీర్చిదిద్దాలని కంకణం కట్టుకున్నట్టున్నారని వ్యాఖ్యానించారు.

సీఎం జగన్

సీఎం చంద్రబాబు మద్యానికి బ్రాండ్‌ అంబాసిడర్‌గా మారిన మీరు, ఇప్పుడు నకిలీ లిక్కర్‌ వ్యవహారంలోనూ రాష్ట్రాన్ని నంబర్‌ వన్‌గా తీర్చిదిద్దాలని కంకణం కట్టుకున్నట్టున్నారని వైఎస్ జగన్ విమర్శించారు. అన్నమయ్య జిల్లా ములకలచెరువులో టీడీపీ నాయకులు ఏకంగా కల్తీ మద్యం తయారీ ఫ్యాక్టరీయే పెట్టి సప్లై చేసిన ఘటన రాష్ట్రంలో మద్యం అక్రమాలకు నిదర్శనంగా నిలుస్తోందన్నారు. రాష్ట్రానికి సంపద పెరగడం సంగతేమోకాని, లిక్కర్‌ సిండికేట్లతో నకిలీ మద్యం తయారీల ద్వారా ప్రజల ప్రాణాలను పణంగా పెట్టారని మండిపడ్డారు. మీ పార్టీనాయకులు గడించిన అక్రమ సంపాదనను పైనుంచి కిందివరకూ వీరంతా పంచుకుంటున్నారని ఆరోపించారు.

'మీ లిక్కర్‌ సిండికేట్లకు, గ్రామస్థాయి వరకూ విస్తరించిన బెల్టుషాపుల మాఫియాలకు, కల్తీ మద్యం వ్యాపారానికి అడ్డురాకూడదనే ఉద్దేశంతోనే ఒక వ్యూహం ప్రకారం మీరు ప్రభుత్వ మద్యం దుకాణాలపై విష ప్రచారం చేశారు. ఉద్దేశ పూర్వకంగా వాటిని తీసివేసి, వాటి స్థానంలో మీ సిండికేట్లకు అప్పగించారు. మద్యం దుకాణాలు టీడీపీ వాళ్లవే. బెల్టుషాపులు టీడీపీ వాళ్లవే. ఇల్లీగల్‌ పర్మిట్‌ రూమ్‌లు టీడీపీ వాళ్లవే. అక్రమ మద్యం తయారీ దారులు కూడా టీడీపీ నేతలే. వాళ్లు తయారుచేస్తారు, ఆ తయారు చేసిన దాన్ని మీ వాళ్లే, మీ షాపులద్వారా, మీ బెల్టుషాపుల ద్వారా అమ్ముతారు. అలా వచ్చిన డబ్బును వాటాలు వేసుకుని పంచుకుంటారు. రాష్ట్రంలో ప్రతి మూడు బాటిళ్లలో ఒకటి కల్తీ మద్యమేనన్న వార్తలు దిగ్భ్రాంతిని కలిగిస్తున్నాయి.' అని జగన్ అన్నారు.

లిక్కర్‌ వ్యవహారంలో మీ వ్యవస్థీకృత నేరాల ద్వారా ప్రజల ప్రాణాలకు తీవ్ర ప్రమాదం ఏర్పడ్డమే కాదు, ప్రభుత్వ ఖజానాకు రావాల్సిన డబ్బును మీరు దోచుకుంటున్నారని వైఎస్ జగన్ ఆరోపించారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ మద్యం దుకాణాలను రద్దుచేసి విచ్చలవిడిగా మద్యం విక్రయాలను పెంచారని పేర్కొన్నారు. మార్ట్‌లు పెట్టారు, తిరిగి మళ్లీ ఇల్లీగల్‌ బెల్టుషాపులు తెరిచారన్నారు. ప్రతి వీధిలో రాత్రిపగలు తేడాలేకుండా లిక్కర్‌ అమ్మడం మొదలుపెట్టారన్నారు. ఇల్లీగల్‌ పర్మిట్‌ రూమ్‌లు తెరిచారని పేర్కొన్నారు.

CAG నివేదికల ప్రకారం 2024-25 ఆర్థిక సంవత్సరంలో మొదటి ఐదునెలల్లో, అంటే ప్రభుత్వ మద్యం దుకాణాల ద్వారానే లిక్కర్‌ అమ్మకాలు ఉన్నప్పుడు రాష్ట్ర ఎక్సైజ్‌ ఆదాయం రూ.6,782.21 కోట్లు కాగా, 2025-26 ఆర్థిక సంవత్సరంలోని మొదటి ఐదు నెలల్లో, విచ్చలవిడిగా లిక్కర్‌ అమ్మినా సరే ఆదాయం రూ.6,992.77 కోట్లు మాత్రమే వచ్చిందన్నారు జగన్. కేవలం 3.10 శాతం వృద్ధి మాత్రమేనన్నారు. ఎక్కడైనా ప్రతిఏటా సహజంగా వచ్చే 10 శాతం పెరుగుదల కూడా రాలేదన్నారు. ప్రభుత్వ ఖజానాకు రావాల్సిన ఆదాయాన్ని, సిండికేట్ల రూపంలో, కల్తీ లిక్కర్ తయారీ రూపంలో మీ ముఠా కొట్టేస్తున్నట్టేగా అర్థం అని మండిపడ్డారు.

కల్తీ లిక్కర్‌ వ్యవహారాలు కొన్ని నెలలుగా రాష్ట్రవ్యాప్తంగా వెలుగుచూస్తున్నాయని వైఎస్ జగన్ ఆరోపించారు. ఉత్తరాంధ్రలోనూ, గోదావరి జిల్లాల్లోనూ, ఇప్పుడు రాయలసీమలోనూ ఈ ఘటనలు బయటకు వచ్చాయన్నారు. విచారణ, దర్యాప్తు తూతూమంత్రంగానే సాగుతున్నాయని, ఈ అక్రమాల వెనుక ఉన్నది మీ బినామీలు అయిన టీడీపీవాళ్లేనని విమర్శించారు.

'అన్నమయ్య జిల్లా స్థాయి ముఖ్యనేత, టీడీపీ ఇన్‌ఛార్జి కనుసన్నల్లో ఈ కల్తీమద్యాన్ని తయారు చేస్తే, వీరిని తప్పిస్తూ తూతూమంత్రంగా కేసు నమోదు చేశారు. మద్యం దుకాణంవైపు అధికారులెవ్వరూ కన్నెత్తిచూడలేదు. ఈ నేరాన్నంతటినీ విదేశాల్లో ఉన్న మరోవ్యక్తిపైకి తోసేసే ప్రయత్నంచేస్తున్నారు. అసలు సూత్రధారులను కాపాడేలా స్కెచ్‌ వేసి, మీరు ఇచ్చిన ఆదేశాల మేరకు, మీ కార్యాలయ డైరెక్షన్‌లో రాత్రికి రాత్రే కేసు మార్చేశారు. దీనికి కారణం, ఈ దందాకు మీ నుంచి, మీ చెప్పుచేతల్లో ఉన్న వ్యవస్థలనుంచి పూర్తి సహాయ సహకారాలు ఉన్నాయి కాబట్టే. మీ సొంత ఆదాయాలకోసం ఇలా ప్రజల ఆరోగ్యంతో చెలగాటం న్యాయమేనా?' అని జగన్ ప్రశ్నించారు.

ఆనంద్ సాయి హెచ్.టి తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్. నేషనల్, బిజినెస్ వార్తలు రాస్తారు. గతంలో ఎంటర్‌టైన్మెంట్, లైఫ్‌స్టైల్ రాసేవారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభం ఉంది. కాకతీయ యూనివర్సిటీలో మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం పీజీ చేశారు. గతంలో నవతెలంగాణ, ఈనాడు, ఈటీవీ భారత్, ఏబీపీ దేశంలో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. 2022లో హెచ్.టి తెలుగులో చేరారు.