Loan Apps harassment : ఆగని లోన్ యాప్ వేధింపులు… యువకుడి ఆత్మహత్య….
Loan Apps harassment లోన్ యాప్ల ఆగడాలు తగ్గడం లేదు. కొద్ది నెలలుగా సద్దుమణిగని ఈ వ్యవహారం మళ్లీ తెరపైకి వచ్చింది. విజయవాడ శివార్లలో ఓ యువకుడు లోన్ యాప్ నిర్వాహకుల వేధింపులు తాళలేక ఆత్మహత్యకు పాల్పడ్డాడు. విజయవాడ రూరల్ మండలం గొల్లపూడి గ్రామంలోని సూరాయిపాలెంకు చెందిన తంగెళ్లమూడి రాజేష్ అనే యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు.
Loan Apps harassment లోన్ యాప్ వేధింపులను తాళలేక ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన విజయవాడ గ్రామీణ మండలం గొల్లపూడి గ్రామం సూరాయిపాలెంలో జరిగింది. గ్రామానికి చెందిన తంగెళ్లమూడి రాజేష్ శనివారం రాత్రి ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు.
ట్రెండింగ్ వార్తలు
సూరాయిపాలెంకు చెందిన రాజేష్కు తొమ్మిదేళ్ల క్రితం రత్న అనే యువతితో వివాహం జరిగింది. భార్యాభర్తలిద్దరూ ప్రైవేటు ఉద్యోగాలు చేస్తున్నారు. కొన్నాళ్లుగా రాజేష్ ఉద్యోగానికి సరిగా వెళ్లట్లేదు. ఆర్థిక ఇబ్బందుల కారణంగా దాదాపు 30 లోన్ యాప్ల నుంచి లక్షన్నర రుపాయల వరకూ రుణాలు తీసుకున్నాడు. తీసుకున్న డబ్బుల కంటే ఎక్కువగా చెల్లించాలని నిర్వాహకులు ఫోన్లు చేసి వేధించారు.
తీసుకున్న రుణాలు తీరుస్తానని లోన్ యాప్ నిర్వాహకులకు నచ్చజెప్పినా వారు వినిపించుకోలేదు. శనివారం రుణాల వసూలు కోసం యాప్ కంపెనీల నుంచి వరుసగా ఫోన్లు చేసి వేధించారు. రాజేష్ ఫొటోలు మార్ఫింగ్ చేసి అతడికీ, భార్యకూ వాటిని పంపించారు. వెంటనే నగదు చెల్లించకపోతే బంధువులు, స్నేహితులకు పంపుతామని బెదిరించారు.
లోన్ యాప్ల వేధింపుల రాజేష్ తట్టుకోలేక భార్యకు ఫోన్ చేసి, తాను ఆత్మహత్య చేసుకుంటానని చెప్పాడు. దీంతో కంగారుపడిన ఆమె యాప్ల నిర్వాహకులకు ఒక రోజు గడువు ఇవ్వాలని డబ్బులు కడతామని వేడుకున్నారు. అయినా వారు వినలేదు తమ వద్ద తీసుకున్న డబ్బు వెంటనే కట్టాలని బెదిరించారు. మరో రోజు గడువిస్తే రూ.3వేల జరిమానా పడుతుందని బెదిరించారు. భార్య రత్న ఇంటికి వచ్చి చూసేసరికి రాజేష్ ఉరి వేసుకుని చనిపోయాడు. భర్త చనిపోయినా ఇప్పటికీ కాల్స్ వస్తూనే ఉన్నాయని, యాప్ నిర్వాహకులపై కఠిన తీసుకోవాలని మృతుడి భార్య విజ్ఞప్తి చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
టాపిక్