Ys Jagan: మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి మీద టీడీపీ ప్రభుత్వం అన్యాయంగా అక్రమ కేసులు పెట్టారని, రాష్ట్ర వ్యాప్తంగా ఇదే కార్యక్రమాలు జరుగుతున్నాయని జగన్ ఆరోపించారు. నెల్లూరు జైల్లో ఉన్న పిన్నెల్లిని పరామర్శించిన జగన్ చంద్రబాబుపై తీవ్ర ఆరోపణలు చేశారు. గత ఐదేళ్లలో ఎప్పుడూ మీడియా ముందుకు రాని వైసీపీ అధ్యక్షుడు జగన్ ఏపీలో ఓటమి పాలైన తర్వాత మీడియా ముందుకు వచ్చి చంద్రబాబు ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణలు చేశారు. ఎన్నికల ఫలితాల తర్వాత మీడియాతో మాట్లాడిన జగన్ మరోసారి మీడియా ముందుకు వచ్చి ప్రభుత్వంపై ఆరోపణలు గుప్పించారు.
ఏపీలో చంద్రబాబుకు ఓటేయలేదని వైసీపీ నాయకులు, కార్యకర్తల ఆస్తులు ధ్వంసం చేస్తున్నారని, దొంగ కేసులు పెడుతున్నారని వైసీపీ అధ్యక్షుడు జగన్ ఆరోపించారు. వాళ్లే తమపై దాడి చేసి వాళ్లే కేసులు పెడుతున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో దారుణంగా పరిపాలన సాగుతుందన్నారు.
గత ఐదేళ్లలో వైసీపీ పరిపాలనలో వైసీపీ ప్రభుత్వంలో జగన్ ఏమి చేశాడో గుర్తు చేసుకోవాలన్నారు. కులం, మతం, ప్రాంతం చూడకుండా, ఏ పార్టీకి ఓటు వేశారో చూడకుండా ప్రతి పథకం, మంచి అర్హత మేరకు డోర్ డెలివరీ చేశామన్నారు.
ప్రజల మనసులో మంచి స్థానం సంపాదించుకుని, మంచి చేయాలే తప్ప దౌర్జన్యాలు చేసి అన్యాయమైన కేసులు పెట్టి ఆస్తులు ధ్వంసం చేసి విధ్వంసం చేయకూడదన్నారు. ఇలాంటి రాజకీయాలు ఎప్పుడు నిలబడవని జగన్ అన్నారు. వీటితో తాత్కాలిక మేలు జరుగుతుందే తప్ప ఓట్లు వేసే సమయంలో ప్రజలు ఖచ్చితంగా గుర్తు పెట్టుకుంటారన్నారు.
చంద్రబాబులో ఇకనైనా మార్పు రావాలన్నారు. ప్రజలు నీకెందుకు ఓటేశారని జగన్ ప్రశ్నించారు. వైసీపీ ప్రజల్లో వ్యతిరేకత వల్ల ఓడిపోలేదని, ప్రజలకు మంచి చేసి కూడా తమ పార్టీ ఓడిపోయిందన్నారు.
చంద్రబాబు మోసపూరిత ప్రచారాలను నమ్మి పదిశాతం ఓట్లు అటు మళ్లడం వల్ల చంద్రబాబు అధికారంలోకి వచ్చాడన్నారు. రైతులకు ఇస్తామన్న రైతు భరోసా ఎక్కడని ప్రశ్నించారు. ఖరీఫ్ మొదలైనా రైతు భరోసా లేదన్నారు.
బడులు మొదలైనా అమ్మఒడి జాడ లేదన్నారు. రూ.15వేలు ఇస్తుంటే చంద్రబాబు వస్తే ఎంతమంది పిల్లలు ఉంటే అందరికి 20వేలు ఇస్తామన్నారు. తల్లికి వందనం డబ్బులు ఎక్కడని ప్రశ్నించారు. చంద్రబాబు గవర్నెన్స్ మీద దృష్టి పెట్టాలన్నారు.
పాల్వాయ్గేట్ పోలింగ్ బూత్లో జరుగుతున్న అన్యాయం జరగడం చూడలేక ఎమ్మెల్యే పిన్నెల్లి ఈవిఎం పగులగొట్టారని, ఆయన్ని ఈవిఎం పగులగొట్టినందుకు జైల్లో పెట్టలేదన్నారు. ఆ ఘటన జరిగిన పదిరోజుల తర్వాత ఎమ్మెల్యే హత్యాయత్నం చేశాడని, వాళ్లు రిగ్గింగ్ చేస్తుంటే ఎమ్మెల్యే హత్యాయత్నం చేశారని కేసు పెట్టారని ఆరోపించారు.
అబద్దాలు చెప్పడానికైనా హద్దుండాలి. పిన్నెల్లి నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచాడని, మంచోడు కాబట్టే ప్రజలు ఆశీర్వదించారని, నాలుగుసార్లు గెలిపించారని అలాంటివ మంచి మనిషిని ప్రజలు తప్పుడు కేసులో ఇరికించారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో ఇదే పరిస్థితి ఉందని జగన్ ఆరోపించారు.
కారంపూడి ఘటన జరిగింది ఎన్నికలు పూర్తయ్యాక జరిగిందన్నారు. కారంపూడిలో టీడీపీ చేసిన ఆకృత్యాలకు ఎస్సీ కుటుంబం మహిళలు ఇబ్బంది పడుతుంటే వారిని పరామర్శించడానికి మర్నాడు డిఎస్పీ అనుమతితో ఎమ్మెల్యే బయల్దేరితే అతడిని అడ్డగించినపుడు గొడవ జరిగిందన్నారు. సిఐ నారాయణ స్వామి అనే సిఐను ఎమ్మెల్యే పిన్నెల్లి కనీసం చూడలేదని అయినా ఆయనపై కేసులు పెట్టారని ఆరోపించారు. ఇద్దరు వేర్వేరు ప్రదేశాల్లో ఉంటే ఎమ్మెల్యే సిఐపై హత్యాయత్నం కేసు పెట్టడం ఏమిటని ప్రశ్నించారు. మే14న ఘటన జరిగితే మే23న తప్పుడు కేసులు పెట్టారని జగన్ ఆరోపించారు.
చంద్రబాబు ఒక రెడ్ బుక్, లోకేష్ ఒక రెడ్ బుక్, ప్రతి ఒక్కరు రెడ్ బుక్ పెట్టుకుని, దారుణంగా, అన్యాయంగా ప్రవర్తిస్తున్నారని, ఆస్తులు ధ్వంసం చేస్తున్నారని జగన్ ఆరోపించారు. పోలీసులు దొంగ కేసులు పెడుతున్నారని, వాళ్లే కొట్టి దొంగ కేసులు పెడుతున్నారని ఆరోపించారు. ఎమ్మెల్యేలు స్వయంగా జేసీబీలు తీసుకువెళ్లి బిల్డింగులు పగులగొడుతున్నారని ఆరోపించారు.
ఎల్లకాలం మీ ప్రభుత్వమే ఉండదని, ప్రజలు ఖచ్చితంగా బుద్ది చెబుతారన్నారు. చేతనైతే ప్రజల మనసులు గెలవాలని, ఈ మాదిరి కొనసాగితే రాష్ట్రంలో తప్పుడు సంప్రదాయానికి నాందిపలికిన వాడు అవుతారన్నారు. ఏదైతే చంద్రబాబు విత్తితే అదే పండుతుందన్నారు. రేపు ఇదే పరిస్థితి మీ పార్టీ కార్యకర్తలకు జరుగుతందని హెచ్చరించారు. ఎవరు తప్పు చేసినా తప్పని వారించాలన్నారు. దీనికి చంద్రబాబు ఫుల్ స్టాప్ పెట్టాలన్నారు. తామేమి వీటిని ఆపాలని కోరడం లేదని చంద్రబాబును హెచ్చరిస్తున్నామన్నారు.