Volunteers Future: ఆంధ్రప్రదేశ్లో 2019 అక్టోబర్ 2 నుంచి మొదలైన గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థల ద్వారా పాలనలో సాధించిన గుణాత్మక మార్పులు ఏమిటనే దానిపై ఇప్పటికే జాతీయ స్థాయిలో చర్చ జరుగుతోంది. పాలనా సంస్కరణల్లో భాగంగా పరిపాలనా వ్యవస్థల్ని గ్రామ స్థాయికి చేర్చామని ఏపీ ప్రభుత్వం గొప్పలు చెప్పుకున్నా అందులో లోపాలు కూడా లేకపోలేదు. ఏపీలో ఏర్పాటు చేసిన గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థల ద్వారా గుణాత్మక మార్పులేవి రాలేదనే అభిప్రాయం జాతీయ స్థాయిలో అధికార వర్గాల్లో ఉంది.
ఏపీలో ఇటీవల జరిగిన ఎన్నికల్లో వైసీపీ ఓటమి పాలై టీడీపీ అధికారంలోకి వచ్చింది. ఈ నేపథ్యంలో గ్రామ, వార్డు సచివాలయాల పరిధిలో పనిచేస్తున్న వాలంటీర్ల భవిష్యత్తు ఏమిటనేది చర్చగా మారింది. ఎన్నికలకు ముందు వరకు రాష్ట్రంలో దాదాపు రెండున్నర లక్షల మంది వాలంటీర్లు ఉన్నారు. ఎన్నికల సమయంలో వైసీపీ అభ్యంతరాల నేపథ్యంలో ప్రభుత్వ విధుల్లో వాలంటీర్ల ప్రమేయం ఉండకూడదని ఎన్నికల సంఘం ఆంక్షలు విధించింది.
పోలింగ్ ఏజెంట్లుగా వాలంటీర్లను నియమించడంపై కూడా అభ్యంతరాలు వ్యక్తం కావడంతో అధికార పార్టీ నాయకులు వాలంటీర్లతో రాజీనామా చేయించారు. తమతో పాటు ఎన్నికల ప్రచారంలో తిప్పుకున్నారు. ఇలా దాదాపు 1.06 లక్షల మంది రాజీనామాలు చేసి వైసీపీ నేతల వెంట ప్రచారంలో పాల్గొన్నారు.
ఎన్నికల్లో వైసీపీ ఓటమి పాలవడంతో వారంతా లబోదిబోమంటూ టీడీపీ ఎమ్మెల్యేలను ఆశ్రయించారు. రాజకీయ ఒత్తిళ్లతోనే రాజీనామాలు చేశామని తమను కొనసాగించాలని విజ్ఞప్తి చేశారు. ఈ క్రమంలోనే గుడివాడలో కొడాలి నానిపై పోలీస్ కేసు కూడా నమోదైంది.
ఏపీలో వైసీపీ అధికారంలోకి రాగానే గ్రామ, వార్డు స్థాయిలోనే పరిపాలన అందించేందుకు కొత్త వ్యవస్థను అందుబాటులోకి తీసుకువస్తున్నట్టు ప్రకటించారు. ప్రభుత్వ పథకం ఏదైనా సచివాలయ వ్యవస్థలతోనే నేరుగా అందిస్తామని ప్రకటించారు.
ప్రతి యాభై ఇళ్లకు వాలంటీర్ను నియమించి వారికి ఖజానా నుంచి ప్రతి నెల గౌరవ వేతనం చెల్లించారు. వాలంటీర్లు ప్రభుత్వ వ్యవస్థలో భాగం కాదు, ప్రభుత్వానికి జవాబుదారి కూడా కాదు. ఎలాంటి విధివిధానాలు బాధ్యతాయుతమైన విధుల నిర్వహణ లేకుండానే ఐదేళ్లుగా వారి సేవల్ని కొనసాగించారు.
ఇంటింటికి సంక్షేమ పథకాలను అందించడం, లబ్దిదారుల్ని ఎంపిక చేయడంలోకీలకంగా వ్యవహరించారు. సంక్షేమ పథకాలు అందించడం, పెన్షన్ల పంపిణీ వంటివి నాణానికి ఓ వైపు కనిపించే అంశాలు మాత్రమే.
వాలంటీర్ల నియామకం నుంచి విధి నిర్వహణ వరకు స్థానిక నేతల కనుసన్నల్లోనే సాగింది. తమ పరిధిలో ఉండే ఇళ్లపై పరోక్షంగా నిఘా ఉంచడం, రాజకీయ అభిప్రాయాలను ప్రభావితం చేయడంతో పాటు అధికార పార్టీ చెప్పిన పని చేయడమే లక్ష్యంగా వ్యవహారం సాగింది.
గతంలో ఏదైనా ప్రభుత్వ శాఖలో పని ఉంటే అయా కార్యాలయాలకు వెళ్లి పనులు పూర్తి చేసుకోవాల్సి వచ్చేది. సచివాలయాలు ఏర్పడిన తర్వాత ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరమే లేదని గొప్పలు చెప్పుకున్నారు. కానీ ప్రతి ప్రభుత్వ శాఖ తమ అధికారాలను సచివాలయాలకు పూర్తి స్థాయిలో బదిలీ చేయలేదు. గతంలో ఎమ్మార్వో ఆఫీసులో లభించే సేవలు పొందాలంటే అక్కడికే వెళ్లాల్సి వచ్చేది.
కేవలం దరఖాస్తుల స్వీకరణకు సచివాలయాలు పరిమితం అయ్యాయి. చివరకు వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన ఇసుక అమ్మకాలను కూడా సచివాలయాలు నిర్వహించ లేకపోయాయి. గతంలో ఉన్న మీ సేవా కేంద్రాలలో అందినన్ని సేవలు కూడా సచివాలయాలు ప్రజలకు ఇవ్వలేకపోయాయి. ఈ గవర్నెన్స్ ద్వారా సుదీర్ఘ కాలంగా ఏపీలో అమలైన పాలనా సదుపాయాలకు సచివాలయాల రాకతో బ్రేకులు పడ్డాయి. రకరకాల సేవల్ని సచివాలయాల్లో ఇస్తున్నామని ఆర్బాటంగా ప్రకటించినా ఆచరణలో మాత్రం అది నెరవేరలేదు.
పట్టణాల్లో అయితే టౌన్ ప్లానింగ్ విభాగానికి అనుబంధంగా వాలంటీర్లు కొనసాగారు. స్థానిక ప్రజాప్రతినిధులు చెప్పినట్టు చేయడం, కొత్తగా చేపట్టే నిర్మాణాల గురించి సమాాచారం అందించడం, అక్రమ వసూళ్ల దందాకు సహకరించారనే ఆరోపణలు ఉన్నాయి. ఇక సంక్షేమ పథకాలకు లబ్దిదారుల ఎంపిక మొదలుకుని ప్రత్యక్ష నగదు బదిలీలో లబ్ది అందించడం వరకు రకరకాల అక్రమాలు జరిగాయి. ఈ వ్యవహారాల మీద ఎవరికి ఫిర్యాదు చేయాలనే విషయాన్నే వైసీపీ ప్రభుత్వం విస్మరించింది. సచివాలయాలను ఏర్పాటు చేసిన తొలినాళ్లలో పాలన మొత్తం వాలంటీర్లే చేస్తున్నారని ప్రజా ప్రతినిధులు ఫిర్యాదు చేయడంతో తర్వాత వారందర్నీ ప్రజాప్రతినిధుల గుప్పెట్లో పెట్టారు. చివరకు వైసీపీ ఘోర పరాజయానికి ఈ వ్యవస్థ కొంత మేర కారణమైంది.
మరోవైపు ఏపీలో జరిగిన వాలంటీర్ల నియామకాలు చట్టబద్దమని, వైసీపీ కార్యకర్తల్ని వాలంటీర్లు నియమించారనే ఆరోపిస్తూ ఏపీ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. ఈ పిటిషన్పై కౌంటర్ వేయాలని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ రాకుర్, జస్టిస్ ఎన్ జయసూర్యతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది.
వాలంటీర్ల నియామకాన్ని తప్పుపడుతూ వారిని రాజకీయ పార్టీ కార్య కలాపాల్లో పాల్గొనకుండా నిలువరించాలని కోరుతూ కడప జిల్లా రాజంపేటకు చెందిన షేక్ అబుబాకర్ సిద్ధిఖి గతంలో హైకోర్టులో పిల్ వేశారు. ఎన్నికలకు కొద్ది నెలల ముందు ఇంటింటికి వెళ్లి వాలంటీర్లు ప్రచారం చేయాలంటూ పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహించారు.
ఈ క్రమంలో వాలంటీర్ల నియామకంలో రిజర్వేషన్ల విధానాన్ని పాటించలేదని, వైసీపీ కార్యకర్త లను వాలంటీర్లుగా నియమించి ప్రభుత్వ వ్యవస్థలను నాశనం చేశారని పిటిషనర్ ఆరోపించారు. ప్రభుత్వంతో ఏ రకమైన ఒప్పందం లేని వారికి ప్రభుత్వ ఖజానా నుంచి వాలంటీర్లకు గౌరవ వేతనం చెల్లించారని ఆరోపించారు.
ఈ వాదనలను పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం.. వాలంటీర్ల నియామక ప్రక్రియపై కౌంటర్ వేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ నేపథ్యంలో వాలంటీర్ల భవిష్యత్తు ఏమవుతుందనే ఆసక్తి నెలకొంది. ఎన్నికల సమయంలో వాలంటీర్ల వేతనాలు పెంచుతామని వైసీపీ, జనసేన హామీ ఇచ్చాయి. ఇటీవల వాలంటీర్ల సేవల్ని ఎలా వినియోగించుకోవాలనే దానిపై కసరత్తు చేస్తున్నట్టు క్యాబినెట్ భేటీ తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది.