Sharmila on Arogyrasri: ఏపీలో ఆరోగ్య శ్రీ ఉంటుందా,లేదా? స్పష్టత ఇవ్వాలన్న కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల
Sharmila on Arogyrasri: ఆంధ్రప్రదేశ్లో ఆరోగ్య శ్రీ పథకాన్ని కొనసాగిస్తారా లేదా అంటూ పీసీసీ అధ్యక్షురాలు షర్మిల ఎన్డీఏ నేతల్ని ప్రశ్నించారు.
Sharmila on Arogyrasri: ఆరోగ్య శ్రీ పథకంలో రూ.7వేల కోట్లను చెల్లించాల్సి ఉందని బీజేపీ మంత్రి సత్యకుమార్, ఆరోగ్యశ్రీ పథకం అమలుపై కేంద్రమంత్రి పెమ్మసాని చేసిన వాఖ్యలు అనుమానాలు కలుగుతున్నాయంటూ ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల ఆరోపించడం కలకలం రేపింది.

ఏపీలో ఆయుష్మాన్ భారత్ కార్డులు ప్రతి ఒక్కరూ తీసుకోవాలని పెమ్మసాని సూచించడం అంటే ఇక రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ లేనట్లేనా అని నిలదీశారు. ఇకపై ఏపీలో ఆయుష్మాన్ పథకమే అమలు చేయాలని అనుకుంటున్నారా అని షర్మిల ప్రశ్నించారు.
రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ ని నిలిపివేసే ఆలోచన కూటమి సర్కార్ చేస్తుందా ? అని, అందుకే పథకానికి నిధులు ఇవ్వకుండా నిర్వీర్యం చేస్తున్నారా అని ప్రశ్నించారు. పెండింగ్ లో ఉన్న బకాయిల చెల్లింపుపై ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారని, బిల్లులు చెల్లించే మీ ప్రభుత్వమే బిల్లులు రావడం లేదు అని చెప్పే సమాధానం దేనికి సంకేతమని ప్రశ్నించారు.
ఆయుష్మాన్ కింద కేంద్రం ఇచ్చే 5 లక్షలతోనే సరిపెడితే మరి రాష్ట్రం ఇచ్చేది ఏమి లేదా అన్నారు. ఆరోగ్య శ్రీ పథకంలో ఇక వైద్యం లేదని చెప్పకనే చెప్తున్నారా ? అని షర్మిల నిలదీశారు. YCP ప్రభుత్వం 16 వందల కోట్లు బకాయిలు పెడింగ్ లో పెడితే, ఆసుపత్రులు కేసులను తీసుకోవడమే మానేశాయని, ఇప్పుడు మీ మంత్రుల మాటలు పథకం అమలుకే పొగ పెట్టేలా ఉన్నాయన్నారు.
దీనికి చంద్రబాబు, పవన్ కల్యాణ్ గారు వెంటనే సమాధానం చెప్పాలని షర్మిల డిమాండ్ చేశారు. ఆరోగ్యశ్రీ డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు ప్రవేశ పెట్టిన అద్భుత పథకమని, పేద కుటుంబాలకు పునర్జన్మ ఇచ్చిన పథకమన్నారు. ఎంతటి జబ్బు చేసినా ప్రాణానికి భరోసా ఇచ్చిన పథకమని, కేంద్రం అమలు చేస్తున్న ఆయుష్మాన్ కి కూడా ఆదర్శం ఆరోగ్యశ్రీనే అన్నారు.
ఇలాంటి పథకాన్ని నీరుగార్చాలని చూస్తే సహించమని, ఆరోగ్యశ్రీ పై వెంటనే కూటమి ప్రభుత్వం క్లారిటీ ఇవ్వాలని షర్మిల డిమాండ్ చేశారు. ఆస్పత్రులకు పెండింగ్ లో ఉన్న 16 వందల కోట్ల బకాయిలు వెంటనే విడుదల చేయాలని, పథకానికి ఏ లోటు లేకుండా అమలు చేయాలని కాంగ్రెస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నట్టు తెలిపారు.