ఆర్టిఫిషియల్ టెక్నాలజీ భవిష్యత్తును నిర్దేశిస్తుందని, దానిని ప్రభుత్వం అందిపుచ్చుకునేందుకు ప్రభుత్వం ఏమి చేయాలనే కార్యాచరణపై ఏపీ సచివాలయంలో రెండు రోజుల వర్క్షాప్ నిర్వహించారు.
ఏపీలో పాలనలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వినియోగం ద్వారా ప్రజలకు మెరుగైన పౌర సేవల్ని అందించడం మీద రెండు రోజుల వర్క్షాప్ జరిగింది. ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో ఎలాంటి పురోగతి సాధించవచ్చో అధికారులకు వివరించారు. శాఖల వారీగా ఏఐ భాగస్వామ్యంతో ఏమి చేయొచ్చో వివిధ పద్ధతుల్లో వివరించారు.
ఇందులో పాల్గొన్న వారికి టెక్నాలజీ గురించి ఎంత వరకు అర్థమైందో కానీ వర్క్షాప్పై రెండు రోజులుగా విడుదల చేసిన ప్రకటనల్ని మాత్రం ఏఐ టూల్స్తో తయారు చేసినట్టు అందరికీ అర్థమై పోయింది. ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొన్న కార్యక్రమంలో అన్ని శాఖలకు సంబంధించిన అధికారులు పాల్గొన్నారు. ఇందులో స్వయంగా పాల్గొన్న వారు ఎవరు రాసినా అర్థవంతంగా దానిని సులువుగా వివరించడానికి అవకాశం ఉండేది. కానీ ఆ ప్రయత్నం జరగలేదు. ఇంత ముఖ్యమైన కార్యక్రమాన్ని అర్థవంతంగా వివరించే ప్రయత్నం చేయలేదు.
తొలి రోజు కార్యక్రమాన్ని ప్రారంభించినపుడు విడుదల చేసిన ప్రకటనలో ఎవరికి అర్థం కానీ పదాలతో ప్రకటన తయారు చేశారు. ఇనుప గుగ్గిళ్ల వంటి పదాలతో చదవడానికి కఠినంగా ఉన్న ప్రకటన ఎవరికి ఓ పట్టాన అర్థం కాని విధంగా రూపొందించారు. చూడగానే అది మెషిన్లో తయారైన రాతగా ఎవరికైనా ఇట్టే అర్థమవుతుంది.
అందులో ఉపయోగించిన పదాలు వాడుక భాషకు సంబంధించినవి కాకపోయినా సర్దుకుపోక తప్పని పరిస్థితి ఎదురైంది. ఏఐ వర్క్షాప్పై రోజు విడుదల చేసిన ప్రకటనలో "పాలనలో కృత్రిమ మేధస్సు సామర్థ్యం మరియు డిజిటల్ పరివర్తన వ్యూహాలపై అధికారులను సమగ్ర అంతర్దృష్టులతో సన్నద్ధం చేయడమే దీని లక్ష్యం" "స్వల్పకాలంలో సాంకేతికత ప్రభావాన్ని అతిగా అంచనా వేయడం కానీ దీర్ఘకాలంలో దానిని తక్కువగా అంచనా వేయడం సర్వసాధారణం. వీటిని వినియోగించుకునేందుకు ముందుగానే సిద్ధమయ్యే వారు గొప్ప ఫలితాలను సాధిస్తారు" వంటి చిత్రమైన వాక్యాలతో రూపొందింది.
ఏఐ వర్క్షాప్లో జిల్లా విద్య వ్యవస్థను ఏఐతో విశ్లేషిస్తూ " అంతర్దృష్టుల ఆధారంగా సంభావ్య విధాన జోక్యాలను సూచించే పాల్గొనేవారితో ఇది ఆకర్షణీయమైన చర్చకు దారితీసింది." అని ప్రకటనలో పేర్కొన్నారు. కంప్యూటర్ విజన్ అప్లికేషన్లు, వాణిజ్య పన్ను శాఖ AI సాధనాలు మరియు "AI ప్లేబుక్" ద్వారా భావనల నుండి పైలట్ ప్రాజెక్టులకు మారడంపై మార్గదర్శకత్వం వంటి ఆచరణాత్మక ప్రదర్శనలు శుక్రవారం జరిగే రెండో రోజు వర్కుషాపులో వివరించబడతాయి.
రెండవ రోజు విడుదల చేసిన ప్రకటన కూడా అదే దారిలో సాగింది. ఎవరికి అర్థం కాకుండా కార్యక్రమాన్ని ఎందుకు నిర్వహించారో, ఏమి సాధిస్తారో, ఏమి చేయాలనుకుంటున్నారో వంటి వివరాలు ఎవరికి అర్థం కాని రీతిలో సాగింది. వాధ్వానీ సెంటర్ ఫర్ గవర్నమెంట్ డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ సహకారంతో రెండ్రోజులు పాటు ఈ కార్యక్రమాన్ని ఏపీ ప్రభుత్వం నిర్వహించింది.
ప్రభుత్వ లక్ష్యాలకు అనుగుణంగా ఏఐ భాగస్వామ్యంతో కార్యాచరణను నిర్దేశించుకున్నారు. ఇందుకోసం శాఖల మధ్య సమాచారాన్ని ఇచ్చి పుచ్చుకోవడం, పాలనా సంస్కరణలపై పలు సూచనలు చేశారు. కానీ ఈ మొత్తం కార్యక్రమానికి సంబంధించిన ప్రకటనను కూడా ఏఐ టూల్స్తోనే రాసేసి ఔరా అనిపించారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసే కృషిని కూడా చెప్పుకోలేని పరిస్థితిలో అధికార యంత్రాంగం ఉంది. బ్యూరోక్రాట్లు మొత్తం సీఎంను ప్రసన్నం చేసుకుని ఆయన కళ్లలో పడేందుకు తాపత్రయ పడే వారు తప్ప ప్రజలకు అర్థవంతంగా చెప్పాలనుకునే వారు కరువయ్యారు. మొదటి కలెక్టర్ల కాన్ఫరెన్స్లోనే ఓ ఐఏఎస్ అధికారి ముఖ్యమంత్రి దార్శనికతకు అనుగుణంగా తాను నేతృత్వం వహిస్తున్న శాఖలో ఏఐ వినియోగం పెంచినట్టు పవర్ పాయింట్ ఇచ్చుకున్నారు.
శాఖల వారీగా మంత్రులందరి వద్ద పీఆర్వో వ్యవస్థలను ఏర్పాటు చేసినా సిఎంఓ, డిప్యూటీ సీఎం, ఐటీ, విద్యా శాఖ, మునిసిపల్, చేనేత, మైనార్టీ ఇంధన శాఖ వంటి శాఖలు మినహా మిగిలిన శాఖల్లో ఏమి జరుగుతుందో కూడా బయటకు తెలియదు. కూటమి ప్రభుత్వం ఏర్పాటయ్యాక అన్ని శాఖల్లో ప్రభుత్వమే పీఆర్వోలను నియమించింది. ఇది కొందరు మంత్రులకు నచ్చలేదు. దీంతో వారితో పని చేయించడం లేదనే ఆరోపణలు ఉన్నాయి.
కొన్ని శాఖలకు మంత్రులు ఎవరున్నారో కూడా ఏడాది తర్వాత కూడా జనానికి తెలియని పరిస్థితి ఉంది. శాఖల వారీగా అమలవుతున్న సంక్షేమ కార్యక్రమాలు, పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలపై సమాచారం కూడా ఉండదు. రాజధాని నిర్మాణంపై వేల కోట్లతో అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నా వాటి గురించి కనీస సమాచారం కూడా విడుదల చేయలేని దుస్థితిలో సీఆర్డిఏ ఉంది. సీఆర్డిఏకు ప్రత్యేకంగా పీఆర్ వ్యవస్థ ఉన్నా సమాచారాన్ని విడుదల చేయడంలో ఇంకా పిల్లి మొగ్గలు వేస్తోంది.
తెలుగులో విడుదల చేసే ప్రకటనల్లో ఇంగ్లీష్ పదాలు, ఇంగ్లీష్ ప్రకటనల్లో ఏమి చెప్పాలనుకుంటున్నారో కూడా అర్థం కాని పరిస్థితులు ఉన్నాయి. ఈ ప్రకటనలన్నీ అధికారికంగా సమాచార పౌర సంబంధాల శాఖ విడుదల చేస్తోంది. వాటిని ఎవరు చదివి అమోదిస్తున్నారనేది కూడా అంతు చిక్కకుండా ఉంటోంది.
సంబంధిత కథనం