కృష్ణాజిల్లా గుడ్లవల్లేరులోని ఇంజినీరింగ్(ఎస్ఆర్ గుడ్లవల్లేరు ఇంజినీరింగ్ కాలేజీ) కాలేజీ వద్ద ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. శుక్రవారం అర్ధరాత్రి వరకు విద్యార్థులు ఆందోళన కొనసాగింది. లేడీస్ హాస్టల్ లో రహస్య కెమెరాలను కనిపెట్టేవరకూ తాము వసతిగృహంలోకి వెళ్లలేమంటూ నిరసన వ్యక్తం చేశారు. మరోవైపు విద్యార్థులతో పాటు తల్లిదండ్రులు… కాలేజీ యాజమాన్యంపై తీవ్రంగా స్పందిస్తున్నారు.
రహస్య కెమెరాల ఘటనను కాలేజీ యాజమాన్యం కప్పిపుచ్చేందుకు ప్రయత్నించిందని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. ప్రశ్నిస్తున్న తమను బెదిరించే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు. ఇదే విషయంపై శుక్రవారం గునుల శాఖ మంత్రి రవీంద్రకు ఫిర్యాదు చేశారు.
ఈ ఘటనపై గురువారం రాత్రి నుంచి వందలాది మంది విద్యార్థుల నిరసన కొనసాగుతోంది. అయితే ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాల మేరకు కాలేజీ వద్దకు జిల్లా కలెక్టర్, ఎస్పీలతో కలిసి మంత్రి కొల్లు రవీంద్ర వెళ్లారు. విద్యార్థులు తమ పరిస్థితిని మంత్రికి వివరించారు.
హిడెన్ కెమెరాల వ్యవహారంలో ప్రధానంగా ఇదే కాలేజీలో చదువుతున్న ఓ విద్యార్థిపై ప్రధానంగా ఆరోపణలు వినిపిస్తున్నాయి. అతడిని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. అతని ల్యాప్టాప్ను స్వాధీనం చేసుకున్నారు.