West Godavari : ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో కోళ్లలో అంతుచిక్కని వైరస్, లక్షల్లో జీవాలు మృత్యువాత
West Godavari : ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో అంతుచిక్కని వైరస్ సోకి లక్షల సంఖ్యలో కోళ్లు మృత్యువాత పడుతున్నాయి. ఇప్పటికే 40 లక్షలకు పైగా కోళ్లు మృతి చెందినట్లు పౌల్ట్రీ రైతులు చెబుతున్నారు. గత రెండు నెలలుగా వైరస్ వ్యాప్తి తీవ్రంగా ఉందని అంటున్నారు.
West Godavari : ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో కోళ్లకు అంతు చిక్కని వ్యాధి సోకుతోంది. నిత్యం వేల సంఖ్యలో కోళ్లు మృత్యువాత పడుతున్నాయని పౌల్ట్రీ రైతులు లబోదిబోమంటున్నారు. గతేడాది డిసెంబర్ లో మొదలైన వైరస్ వ్యాప్తి...జనవరి 13 తర్వాత తీవ్రమైందని రైతులు అంటున్నారు. ఆరోగ్యంగా కనిపించిన గంటల వ్యవధిలోనే కోళ్లు మృతి చెందుతున్నాయని వాపోతున్నారు. కోళ్లలో H15N వైరస్ లక్షణాలు ఉన్నట్లు వెటర్నరీ వైద్యులు చెబుతున్నారు. ఈ వైరస్ శరవేగంగా వ్యాపిస్తుండడంతో...పౌల్ట్రీ రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు.

40 లక్షల కోళ్లకు పైగా మృత్యువాత
ఇప్పటికే ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో 50 శాతం రైతులు నష్టపోయారని తెలుస్తోంది. దాదాపుగా 40 లక్షల కోళ్లు చనిపోయి ఉంటాయని అంచనా. మేత తిని, గుడ్డు పెట్టిన కొద్ది గంటల్లోనే కోళ్లు మృత్యువాత పడుతున్నాయని రైతులు అంటున్నారు. కోళ్లకు వ్యాక్సిన్ వేస్తున్నా... ఉపయోగం ఉండడంలేదని చెబుతున్నారు. దీంతో బ్యాంకుల నుంచి తెచ్చిన అప్పులు పెరిగి రోడ్డున పడే పరిస్థితి వచ్చిందని పౌల్ట్రీ రైతులు వాపోతున్నారు.
2012, 2020లో ఇదే తరహాలో వైరస్ వ్యాపించి లక్షల్లో కోళ్లు చనిపోయాయి. అయితే ప్రస్తుతం గతంలో కంటే వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉందని రైతులు చెబుతున్నారు. ఇంత భారీ సంఖ్యలో కోళ్లు చనిపోతున్నా అధికారులు పట్టించుకోవడంలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వైరస్ వ్యాప్తికి కారణాలు తెలియకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. పరీక్షల నిమిత్తం కోళ్ల బ్లడ్ శాంపిల్స్ భోపాల్ కు పంపుతున్నామని రైతులు చెప్పారు. ఈ వైరస్ వ్యాప్తిని విపత్తుగా ప్రకటించి, తమను ఆదుకోవాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.
కూటమి ప్రభుత్వ నిర్లక్ష్యం
"పశ్చిమ గోదావరి జిల్లాలో లక్షలాది కోళ్లు మృత్యువాత పడుతున్నాయి. వైరస్ సోకడంతో జిల్లాలో ఇప్పటికే 1 కోటి 20 లక్షలకిపైగా కోళ్లు చనిపోయినట్లు అధికారులు చెబుతున్నారు.
కోళ్ల ఫారాలు వద్ద గుట్టలు గుట్టలుగా చనిపోయిన కోళ్లు ఉన్నాయి. దీంతో కోడిగుడ్ల ఎగుమతి భారీగా పడిపోయింది. హైపాతోజనిక్ అవేయిన్ ఇన్ల్పూఎంజా స్ట్రెయిన్ (H5N1) వైరస్ సోకినట్లు పశు సంవర్ధక శాఖ అనుమానాలు వ్యక్తం చేస్తుంది. కోళ్ల వ్యాధులపై కూటమి ప్రభుత్వం కనీసం అవగాహన కల్పించడంలేదు. నష్టాలతో ఆత్మహత్యలే శరణ్యం అని పౌల్ట్రీ రైతులు అంటున్నారు" -వైసీపీ
ఖమ్మం జిల్లాలో
తెలంగాణలోని ఖమ్మం జిల్లాలో అంతుచిక్కని వైరస్ సోకి వేల సంఖ్యలో కోళ్లు మృత్యువాత పడ్డాయి. పెనుబల్లి మండలంలో ఉప్పయ్య అనే వ్యక్తికి చెందిన కోళ్ల ఫారంలో మూడు వేల బ్రాయిలర్ కోళ్లు, కొత్త కారాయగూడెం గ్రామంలోని నాగేశ్వరరావుకు చెందిన కోళ్ల ఫారంలో మూడు వేల బ్రాయిలర్ కోళ్లు మృత్యువాత పడ్డాయి. వరుసగా కోళ్లు చనిపోతుండడంతో వెటర్నరీ అధికారులు అప్రమత్తమై... కోళ్ల మృతికి గల కారణాలను తెలుసుకునేందుకు హైదరాబాద్ వెటర్నరీ పరిశోధన టీమ్ కు సమాచారం ఇచ్చారు. దీంతో రీసెర్చ్ టీమ్ కోళ్ల ఫారాలను పరిశీలించి శాంపిల్స్ సేకరించింది.