AP Rains: ఏపీలో మరో 2 రోజులు భారీ వర్షాలు
IMD Rain Alert to AP: ఏపీలో గడిచిన రెండు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఫలితంగా పలు జిల్లాల్లో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. వాగులు ఉప్పొంగడంతో రాకపోకలు నిలిచిపోయాయి. మరో రెండు రోజులు కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.
Rains in Andhrapradesh: ఏపీలో మరో రెండు రోజులపాటు వర్షాలు కురవనున్నాయి. కోస్తాంధ్రాను అనుకుని పరిసర ప్రాంతాల్లో ఉపరితల ద్రోణి కొనసాగుతోంది. అనుబంధంగా మరో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. ఈ ప్రభావంతో కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో చాలాచోట్ల వర్షాలు కురుస్తున్నాయి. మరో 2 రోజులు ఇలానే వానలు పడుతాయని వాతావరణ శాఖ తెలిపింది. ఈ మేరకు పలు జిల్లాలకు హెచ్చరికలు కూడా జారీ అయ్యాయి.
ట్రెండింగ్ వార్తలు
కోస్తా జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది. కోస్తాలో మత్స్యకారులు చేపల వేటకు వెళ్ళవద్దని అధికారులు స్పష్టం చేశారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
భారీ వర్షాల దాటికి పత్తి, వరి, మిర్చి పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. వివిధ జిల్లాల్లో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ప్రకాశం జిల్లా దర్శి, కురిచేడులో బుధవారం పిడుగుపాటుకు ఇద్దరు మృతి చెందారు. ప్రకాశం, పల్నాడు, గుంటూరు, బాపట్ల, ఎన్టీఆర్, కృష్ణా జిల్లాల్లో ప్రస్తుతం పూత దశలో ఉన్న పత్తి తీవ్రంగా దెబ్బ తిన్నది. శ్రీకాకుళంలో జిల్లాలో కొన్నిచోట్ల వరి నీట మునిగింది. రాయలసీమలో మొక్కజొన్న, జొన్న, పెసర, మినుము, కూరగాయల పంటలపై ప్రభావం పడింది. అనంతపురం జిల్లాల్లో ద్రాక్ష తోటలు నేలకొరిగాయి.
వైయస్ఆర్ జిల్లా ఖాజీపేట, కమలాపురం, మైదుకూరు మండలాల్లో పంటలు నేలకొరిగాయి. వరికి తీవ్ర కష్టం కలిగింది. ఏలూరు, పశ్చిమగోదావరి జిల్లా పాలకోడేరు మండలం పెన్నాడ, పాలకొల్లు, ఆచంట తదితర నియోజకవర్గాల్లో తోట పంటల్లో వర్షపు నీరు నిలిచింది. శ్రీకాకుళం జిల్లా సోంపేటలో వరదతో దాదాపు 1000 ఎకరాల వరి పంట నీట మునిగింది. విజయవాడలో గురువారం ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. వరద నీరంతా రోడ్లపైకి చేరడంతో ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. వాహనదారులు చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
ఎగువ నుంచి 79,350 క్యూసెక్కుల వరద నీరు వస్తుండడంతో ప్రకాశం బ్యారేజీ నుంచి 72,300 క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి, కృష్ణా డెల్టాలోని కుడి, ఎడమ కాల్వలకు 7,050 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు.